విద్యా విజయానికి సర్వస్వతీ స్తుతి
జ్ఞానస్వరూపిణి, విద్యాప్రదాయిని అయిన సరస్వతి అనుగ్రహం లేనిదే ఎవరూ జ్ఞానులు కాలేరు. ఆ పలుకుల పొలతికి మన ముద్దుబిడ్డలైన వారే జ్ఞానవంతులై పరిపూర్ణులై, సకల విద్యా సంశోభితులవుతారు. సకల కళలు, విద్యలు, జ్ఞానం, బుద్ధి అన్నీ ఆ తల్లి రూపాలే. వీణా పాణి, పుస్తకధారిణి అయిన ఆ తల్లి జగతిలో జ్ఞానాన్ని ప్రసరింపచేస్తూ చైతన్య వంతం చేస్తుంది. ఆ విద్యా ప్రదాయినిని వేదం ఇలా స్తుతించింది.
ప్రణోదేవీ సరస్వతీ, వాజేభిర్వాజినావతీ ధీనామవితృ అవతు జ్ఞాన ప్రదాయిని అయిన తల్లి... బుద్ధి, శక్తుల్ని రక్షించేమాత. వేదం శారదాదేవిని అన్న ప్రదాయినిగా, ధనప్రదాయినిగా ఉపాసించింది. భారతా నస్మాస్ భారతి అంటే... భారతీ దేవి మమ్ములను జ్ఞానమునందు కోరిక కలవారిగా చేయుగాక అని భావం. సనస్సరన శీలత్వాత్ ప్రవాహరూపమైన చైతన్యమయమైన విద్య ద్వారా పర బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. శుద్ధత్వం శారదాదేవి రూపం. తెల్లదనం ఉట్టిపడే స్వచ్ఛోపకరణాలన్నీ ఆ అమ్మవే. అందుకే సరస్వతిని సర్వశుక్లాం శుద్ధరూపాం అన్నారు.
శరదిందు వికాసమందహాసాం శరదిందీవరలోచనాభిరామం
అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాస్మహే శరత్కాలపు చంద్రునివలె తెల్లని వన్నెగల చిరునగవు కలది, ప్రకాశించు నల్లకలువలవంటి కన్నులతో సుందరమైనది. పద్మములతో సాటియగు అందమైన మోముకలది, పద్మము పీఠముగా గల బ్రహ్మకు కాంతయగు సరస్వతిని తలంతును అని భావం. అంబనవాంబుజోజ్జ్వల పద్యంలో కూడా సరస్వతీ దేవి స్వచ్ఛస్వరూపమే వర్ణించబడింది. ఆ విధంగానే...
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హారా తుషారఫేణ రజతాచలాకాశ ఫణీశ కుందమం
దార సుధాపయోనిధి సితతామర సామరవాహినీ శుభాకారత నొప్పు నిన్ను మదిగానన నెన్నదు గల్లు భారతీ
ఈ పద్యాలలో తెల్లని మల్లెలు, చల్లని వెన్నెల, స్వచ్ఛమైన కాంతులు ఎన్ని విధాలుగా ప్రకాశించగలవో అన్ని తెలుపురంగు కాంతుల ఉపమానాలతో అమ్మవారిని పోల్చడం జరిగింది. స్వఛ్ఛమైన ధవళకాంతులలో ఆమె నిండి వుంటుంది. అందుకే స్వచ్ఛమైన మనస్సు కలవారికి సమస్త విద్యలూ సంప్రాప్తిస్తాయి. సంగీత సాహిత్యాలు సరస్వతికి ఆటపట్టులు.
అందుకే సంగీత సాహిత్యాల్లో తప్పనిసరిగా సరస్వతీదేవిని స్తుతిస్తారు. చిలుక వాక్కులకు సంకేతం. అందుకే వాగ్దేవతను ఆశ్రయించి ఉంటుంది. సరస్వతి బాలచంద్రుని కుసుమంగా ధరించింది. పాటకు తోడుగా బంగారు వీణ మ్రోగుతుంది. బ్రహ్మదేవుని ముఖపద్మాలు ఆమెకు కేళీ గృహాలు. నాలుగు ముఖాలు నాలుగు వేదాలు. వేదాలు వాక్కుకు మూలాలు. బ్రహ్మముఖంలో సరస్వతి ఉన్నదని శాస్త్రోక్తి. వేదపురాణేతిహాసాది విద్యలు ఆ తల్లికి నివాసాలు. రాజహంస వాణి వాహనం. హంస అజపామంత్ర స్వరూపం శివశకె్తైక్య స్వరూపిణి. పసిడి కిన్నెర వీణ పలికించు నెలనాగ అనటంలో దేవి నాద స్వరూపిణీ అన్న అర్ధం ద్యోతకమవుతుంది.
హంస వాహనం గల నాద స్వరూపిణీ దేవి చతుర్దశ భువనాధీశ్వరి. ఆమే విద్యాధిదేవత, జ్ఞాన స్వరూపిణి. తనను సదా రక్షించి గీర్వాణ వాణిని అనుగ్రహించాలని శ్రీనాథుడు ఆ దేవిని సంస్తుతించాడు.సరస్వతి ఎవరిలోనైతే ఉంటుందో వారికి గౌరవ ప్రతిష్ఠలు, ధనం కలుగుతాయి.భయభక్తులతో ఉంటే ఆ ఇంటిని ఆ సరస్వతి గౌరవిస్తుంది. మరికొంత కాలం ఉండేందుకు ఇష్టపడుతుంది. లేని పక్షంలో వ్యసనపరునిగా, జూదగానిగా, ఇంకా హేయమైన పరిస్థితికి తీసుకువస్తుంది. అది పతనానికి గుర్తుగా భావించాలి. సన్మార్గం తోచని వ్యక్తికి భార్యాపుత్రులు, మిత్రులు క్షేమాన్ని కోరే ఇతరులూ అతడిని సన్మార్గంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. పాండిత్యం, పతనమమనేది రెండూ సరస్వతి అధీనంలోనివే అన్న విషయం గమనించాలి.
శ్లో|| వాణీం పూర్ణనిశాకరోజ్జ్వల ముఖీం కర్పూర కుంద ప్రభాం
చంద్రార్ధాంకిత మస్తకాం నిజకరై స్సంచిబ్రతీ మాదరాత్
వర్ణాకుక్షగుణం సుదాద్యకలశం వద్యాంచ ఉత్తుంగ స్తనీం
దివ్యైరాభరణై ద్విభూషిత తనుం సింహాది రూఢాం భజే
(ఈ శ్లోకం క్రమం తప్పకుండా ప్రాతః కాలంలో 18 సార్లు పఠిస్తే జ్ఞాపకశక్తి, స్ఫూర్తి, మేధాశక్తి వృద్ధి చెంది విద్యాజయం కలుగుతుంది)
శ్లో మేధాం విద్యాం బల ప్రజాక్షం సంపదం పుత్ర పౌత్రకాం
దేహిమే శారదే దేవీ స్మరామి ముఖ సంస్థితాం
(ఈ శ్లోకాన్ని 21 సార్లు చదవాలి)
శ్లో నమస్తే శారదే దేవి- కశ్మీర పురవాసినీ
త్వా మహం ప్రార్ధయే న్నిత్యం - విద్యా దానం చదేహి మే
సరస్వతీ నమస్తుభ్యం
శ్లో సరస్వతీ నమస్తుభ్యం వరదేకామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణినీ త్వం
విద్యాలయాదేవీ సామాంపాతు సరస్వతీ
చింతామణి సరస్వతీ మంత్రం: ఓం హ్రీం హ్రైం ఓం ఐం ధీం క్లీం సౌః సరస్వత్యై స్వాహా(దీనిని 12 లక్షల సార్లు జపించాలి. మంత్రం ిసిద్ధిస్తే .. ఆ నరునికి కేవలం విన్నంత మాత్రాన సర్వవిద్యలూ వశమవుతాయి)
No comments:
Post a Comment