What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 16 April 2015

భీష్మ పితామహునకు సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకధలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మపితామహుడు



భీష్మ పితామహునకు సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకధలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మపితామహుడు. ఈయనకు ఇంతమహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధానకారణం. మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి, ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి, శౌరసంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్త్రవిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు.

వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు . చక్కటి కధల రూపంలో వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీమహాభారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కధలను ధర్మరాజుకు చెబుతున్నసమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూఉండేవారు. కృష్ణతత్వాన్నీ బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు. రాజ సూయయాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్నా ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించేభాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు.

అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేసించింన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాల్కుల మీద నానుతూనే ఉన్నయి. ఆదిశంకరాచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవత్ శక్తి దాగిఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడి మహత్యాన్నిగురించి తెలుసుకోవటానికి. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికీ అందరికీ ఆయన మార్గ దర్శకుడుగా నిలిస్తున్నారు.

అన్నిటికంటే మించిన విశేషమేమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు. పిల్లలూ లేరు. కానీ ఇలా అపుత్రకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితరులకు పితృతర్పణాలను ఇచ్చేటప్పుడు భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. అందరికీ అలా ఆయన పితామహుడు (తాతా) లాంటి వాడయ్యారు. ఇంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞా పాలన, పితృ భక్తి, సత్ శీల సంపద వలనే లభించాయి.

భీష్మ ఏకాదశి- శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి

శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒకనాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.

భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?

ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.

బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్లూ అంపశయ్యపై పడి ఉన్నాను' అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. 'హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.

శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మెఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML