What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 11 October 2016

శివ తాండవాన్ని బ్రహ్మదేవుడు చిత్రించిన ప్రదేశము



తమిళనాడులోని కుట్రాలం అనే పేరు వినగానే, అందరి మదిలో అదొక పర్యాటక స్థలం గానే మెదలుతుంటుంది. కుట్రాలంలోని కొండలు, ఆ ఒందల పైనుండి జాలువారుతున్న జలపాతలే మన మదిలో మెదలడం జహాజం. పేదవాళ్ళ ఊటీగా పేర్కొనబడుతున్న కుట్రాలానికి ఆ పేరు ఏర్పడడానికి కారణం అక్కడ నెలకొన్న కుట్రాలీశ్వరుడు. పంచసభలలోని ఇంద్రసభ ఇక్కడ ఉన్నదని ప్రతీతి. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ పుణ్య స్థలం గొప్పదనాన్ని ఎందరో తమిళకవులు తమ కీర్తనలలో నిక్షిప్తం చేశారు. తిరుజ్ఞాన సంబంధర్, తిరునావుక్కరుసు, అరుణగిరినాథర్ వంటి కవులు ఈ క్షేత్రమహాత్యాన్ని తమ కీర్తనల ద్వారా లోకానికి చాటారు. వేదవ్యాస విరచితమైన ‘తామ్రప మహాత్మ్యం’ లో ధరణీపీఠం గురించి, శెన్బగదేవి గురించి, కుట్రాలీశ్వరుని గురించి విపులంగా వివరించబడింది. ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కుట్రాలం యొక్క గొప్పదనం అర్థమవుతుంది.

పూర్వము ఈ పుణ్యభూమిని పృథు మహారాజు పరిపాలిస్తున్న సమయం. నీతి గ్రంథాలలో చెప్పిన నియమాలను అనుసరించి పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లసాగారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశావళికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. నాలుగు వేదాలను, సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన అపరిమితమైన అపర విష్ణుభక్తులు. అయితే, వారు అపరిమితమైన విష్ణుభక్తి పరాయణత్వంలో దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ శివనింద చేయసాగారు. విష్ణువేగొప్ప, శివుడు గొప్ప కాదన్న వాదనలతో దేశమంతా పర్యటిస్తుండేవారు. ఆ నోట, ఈ నోట ఈ విషయం పృథుమహారాజు చెవిన పడింది. విషయం విన్నంతనే ఎంతో కలత చెందిన పృథువు, నేరుగా కైలాసానికి వెళ్ళి శివునితో ఈ విషయాన్ని వినమ్రతతో విన్నవించాడు.

“పరమేశ్వరా! నా దేశంలో శివభక్తి పరాయణులు ఉండాలి. అందుకు నువ్వే ఏదైనా మార్గాన్ని చూపాలి” అని వేడుకున్నాడు. అతని ప్రార్థనను విన్న శివపరమాత్మ, “తగిన సమయంలో అగస్త్య మహాముని ద్వారా అందుకు తగిన ప్రయత్నాలు మొదలవుతాయి” అని పృథువును స్వాంతన పరిచాడు.

అందుకు తగినట్లుగానే, కొన్నాళ్ళ తర్వాత అగస్త్య మహామునీశ్వరుడు కుట్రాలంలో విష్ణు సన్నిధికి శివచిహ్నాలతో వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు అగస్త్యుని విష్ణుసన్నిధిలోకి రాకుండా అడ్డుకున్నారు. వారి గొడవకు ఆరోజున తిరిగి వెళ్ళిపోయినా అగస్త్యుడు మరుసటి రోజున ఓ విష్ణుభక్తునివలె వేషాన్ని వేసుకుని విష్ణ్వాలయానికి చేరుకున్నాడు. అగస్త్య మునీశ్వరుని ఆవిధంగా చూసిన విష్ణుభక్తులు, ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, ఆలయం లోపలకు తీసుకెళ్ళి, ఆయన్నే పూజావిధులు నిర్వహించమని చెప్పారు.

గర్భగృహంలోకి వెళ్ళిన అగస్త్యుడు, శివుని ధ్యానిస్తూ పూదండంతో విష్ణువును తాకాడు. అంటే ఆ మరుక్షణమే, నిల్చున్న భంగిమలోనున్న విష్ణుమూర్తి ప్రతిమ క్షణ మాత్రములో శివలింగంగా మారిపోయింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలోనున్న విష్ణు పరివార దేవతలంతా శివపరివార దేవతలుగా మారిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు స్తంభించిపోయారు. అక్కడున్న సురుచి ఆవేశంతో ఊగిపోయాడు. ఫలితంగా అగస్త్యునికి, సురుచికి మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం మొదలైంది. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, ఎవరైనా మధ్యవర్తిని పెట్టుకుని వాదనలను కొనసాగించమని చెప్పింది.

ఆ మరుక్షణం శివుని ఎడమభాగం వైపునున్న ధరణి పీఠం నుంచి ఒక దేవి ఆవిర్భవించింది. ఆ దేవి మధ్యవర్తిత్వం వహింకాగా, అగస్త్య, సురుచిల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో, వారు గెలిచినవారి మతాని అనుసరించాలన్న నిబంధనతో సుమారు ఐదురోజులపాటు వాదన కొనసాగింది. చివరగా అగస్త్యమహామునీశ్వరుడే గెలిచాడు. ఫలితంగా అక్కడున్న విష్ణుభక్తులంతా అగస్త్యుని ద్వార శివదీక్షను స్వీకరించారు. ఈ వాదనకు మధ్యవర్తిత్వం వహించింది ఆ పరాశక్తియే. ఆ ధరణీపీఠ నాయకి సృష్టి, స్థితి, సంహారము అనే మూడింటిని నిర్వహిస్తుంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే మూడు వేదాల రూపంగా భాసించే ధరణీపీఠనాయకి తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో దర్శనమిస్తుంటుంది. అప్పుడు జరిగిన వాద ప్రతివాదనలకు సాక్ష్యంగా కుట్రాలంలో కొలువైన ధరణీ పీఠ నాయకి, భక్తజనులను తన కరుణాపూరిత దృక్కులతో కరునిస్తోంది.

ఇక, కుట్రాలంలో ప్రధాన నదీదేవి చిత్రానదీ దేవి. ఈ నదికి కొంచెం పైభాగంలో శెన్బగదేవి ఆలయం ఉంది. శెన్బగదేవి ఇక్కడ కొలువై ఉన్నందువల్ల పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా శెన్బగవనం అని పిలువబడుతు ఉండేదట. ఒకానొకప్పుడు ఈ ప్రాంతంలో శుంభనిశుంభులు శివునివల్ల అనేక వరాలను పొందారు. పురుషుల వలన మరణం రాకుండా వరాన్ని పొందిన వీరు, యజ్ఞభాగాలను అపహరిస్తూ, అందరినీ బాధిస్తూ ఉండటంతో, మునుల మొరలను ఆలకించిన ఆది పరాశక్తి వారిద్దరినీ సంహరిస్తుంది. ఇదంతా , చూసిన శుంభనిశుంభుల గురువు ఉదుంబరునికి వణుకు పుట్టింది. ఆదిపరాశక్తి తనను కూడ సంహరిస్తుందని వణికిపోయాడు. ఆదిపరాశక్తి కంట్లో పడకుండా ఎక్కడ తలదాచుకోవాలన్న విషయమై ఆశ్రయించాడు. ఉదుంబరుని పరిస్థితిని అర్థం చేసుకున్న మయుడు కుట్రాలం ప్రక్కనున్న ఓ పర్వతారణ్యములో దాక్కుని ఉండమని చెప్పాడు. అలా ఆ పర్వతారణ్యములో దాక్కున్న ఉదుంబరుడు పగలంతా ఎవరికీ తెలియకుండా నక్కి ఉండి, రాత్రయితే బయటకు వచ్చి అన్ని జీవులను పీడిస్తుండేవాడు. ఆ రాక్షసుని ఆగడాలకు తట్టుకోలేకపోయిన మునీశ్వరులు దేవితో మొరపెట్టు కోగా, ఆ రాక్షసుని అతని పరివారముతో సహా అంతమొందించింది.

అనంతరం ఆ ఋషిపుంగవులతో దేవి, “మీకు తోడుగా నేను కూడ ఇక్కడే కొలువై వుంటాను” అని ఓ చెట్టు కింద ధరణీపీఠ నాయకిగా కొలువై భక్తులను కరుణిస్తోంది. ఈ పవిత్ర ప్రదేశం కుత్రాలము జలపాతాలకు సుమారు మూడు కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడున్న తీర్ధాన్ని దేవి పేరుతో శెన్బగతీర్థం అని పిలుస్తుంటారు. ఈ దేవికి చైత్రమాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కుట్రాలీశ్వరుని ఉత్సవాలు ముందు ముందుగా ఈ అమ్మవారికే పూజలు జరుతుగుంటాయి. ఈ అమ్మవారి ఆలయానికి పైభాగాములో ‘శివమధుగంగ’ అనే జలపాతం ఉంది. ఇక్కడ గంగాదేవి శివలింగానికి తేనెతో అభిషేకం చేసినందువల్ల ఈ జలపాతదారకు ‘శివమధుగంగ’ అనే పేరు ఏర్పడిందని ప్రతీతి. ఇక్కడ పౌర్ణమి రోజున పసుపువర్ణంతో కూడిన వర్షం పడుతుంటుందని పెద్దలు చెబుతుంటారు.

అదేవిధంగా పరమశివుడు ఐదుచోట్ల తాండవ నృత్యం చేసాడని ప్రతీతి. ఇక్కడ స్వామివారు నృత్యం చేసిన సభచిత్రసభగా పిలువబడుతోంది. ఈ చిత్రసభ మిగతా సభల కంటే భిన్నమైనది. మిగతా నాలుగు సభలలో శివుడు వగ్రహరూపంలో గోచరిస్తుండగా, ఇక్కడ మాత్రం చిత్ర రూపంలో దర్శనమిస్తుంటాడు. శివతాండవాలలో ఒకటైన త్రిపురతాండవము ఈ చిత్రసభలో జరిగిందట.

ఈ చిత్రసభకు ముందు కోనేరు, దాని మధ్యలో ఓ మంటపం ఉంది. చిత్రసభలో పరమశివుడు దేవేరితో పాటు తాండవం చేస్తుండగా, ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు ఓ గోడపై చిత్రీకరించాడని పురాణకథనం. అందువల్లనే వ్యాసభగవానుడు ఈ సభను చిత్రసభ అని పిలుచుకున్నారు. ఇక్కడ మార్గశిర మాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కుత్రాలీశ్వరుని ఆలయ ప్రాంగణంలో కుళళ్ వాయ్ మొళియమ్మన్ ఆలయం ఉంది. నత్తి, మూగ తనంతొ బాధపడేవారు ఈ అమ్మవారిని మొక్కుకుంటే చక్కని ఫలితం ఉంటుందని భక్త జనుల విశ్వాసం.

ఈ కుట్రాలీశ్వరుని ఆలయంలో రోజుకు తొమ్మది సార్లు పూజలు జరుగుతుంటాయి. చిత్రసభలో ఆరుద్ర దర్శనం జరుపబడుతుంటుంది. ఆ సమయంలో తాండవ దీపారాధన జరుగుతుంటుంది. సంవత్సరానికి ఒకసారి జరుపబడే ఆరుద్ర దర్శన పండుగ సమయంలో బ్రహ్మ, విష్ణువులతో పాటు సమస్త దేవతలు ఇక్కడకు వస్తారని ప్రతీతి. ఇంకా చైత్రమాసంలో వసంతోత్సవం, కార్తీకమాసములో పవిత్రోత్సవం, నవరాత్రి, స్కందషష్ఠి అంటూ అన్ని ప్రధాన పండుగలు ఈ ఆలయములో జరుపబడుతుంటాయి.

జూన్ నుంచి సెప్టెంబర్ లోపు కుట్రాలానికి వెళితే వర్షాకాలం కావడం వలన గలగల పారే నిండుజలపాతాలను చూడొచ్చు. కుట్రాలానికి రైలు ప్రయాణ సౌకర్యం లేదు. కాబట్టి బస్సులోనే అక్కడకు చేరుకోవలసి ఉంటుంది. కుట్రాలంలో బస సోకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించాలను కునే వారికి ఇదొక అపూరూప అవకాశం.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML