What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 14 August 2015

రాయదుర్గం : అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం కోటలో శ్రీప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం అత్యంత ప్రముఖమైనది.



రాయదుర్గం : అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం కోటలో శ్రీప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం అత్యంత ప్రముఖమైనది. 16వ శతాబ్దంలో కంచి కోదండ రామాచార్యులుగారు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ గోపురం 40 అడుగుల ఎత్తు గల 5 అంతస్తులతో నిర్మించబడింది. ఈ చారిత్రాత్మక దేవాలయంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి వారు రాయదుర్గం పట్టణ ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. ఆశేష భక్త జనుల చేత విశేషంగా నిత్యం పూజలందుకుంటూ పట్టణానికే తలమానికంగా పేరుగాంచిందనడంలో అతిశయోక్తి లేదు.

ప్రసన్న : నామ ధేయం వెనుక :

పూర్వం అరణ్యంగా వున్న ఈ ప్రాంతంలో ఒక నాడు వెంకటపతీనాయకుడు అనే రాజు తన సైన్యంతో వేట నిమిత్తం విచ్చేసి ఇక్కడ గుడారం వేసుకున్నాడట. వేట బడలికతో ఆదమరిచి నిద్రపోతున్న రాజుకు ఎవరో వీపు తట్టి లేపినట్లు అనిపించి, ఈ ప్రాంతంలో శ్రీ లక్ష్మీపద్మావతీ వెంకటేశ్వరుని విగ్రహం వున్నట్లు కనపడిందట. ఉషోదయానంతరం తనకు కలలో కన్పించిన విషయాన్ని తన పరివారానికి తెలిపాడట. మరుసటి రోజు రాజు విగ్రహాలు ఏ ప్రాంతంలో వున్నవో తెల పాల్సిందిగా ప్రార్థిస్తూ నిద్రించగా నీవున్న గుడారం కిందనే మేమున్నాం, మమ్మల్ని ఇచ్చటనే ప్రతిష్టించమని శ్రీస్వామి కలలో చెప్పారట. ఆ తరువాత ఆయన విగ్రహాలను వెలికి తీయించి ఓ శుభ ముహుర్తాన ప్రతిష్టించి ఇచ్చట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఒక సారి దత్త మండలాల కలెక్టరైన సర్‌ థామస్‌ మన్రో ఈ ఆలయాన్ని సందర్శించారు. అప్పుడు ఆయనకు గాలిగోపురం సమీపంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద దాదాపు ఎనిమిది సంవత్సరాల బాలుడు ప్రసన్న వదనంతో దొరగారికి కన్పించి కాసేపు మాట్లాడారట. అయితే దొరగారితో పాటు అక్కడున్న అర్చక బృందానికి ఆ బాలుడు కన్పించలేదట. ఆలయంలోకి వెళ్లిన అర్చకులకు స్వామి వారి విగ్రహం కన్పించకపోయే సరికి ఆశ్చర్యం చెంది బయటకు వచ్చి కలెక్టర్‌ మన్రోకు విషయం తెలిపారట. అంతలోనే కలెక్టర్‌ దొర ఆశ్చర్యం చెంది తన అదృష్టానికి పొంగిపోయి శ్రీస్వామి వారు తనకు ప్రసన్నుడయినందున నాటి నుంచి ఈ ఆలయానికి ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంగా నామకరణం చేశారట. ఆలయం అభివృద్ది కోసం కలెక్టర్‌ మన్రో దొర ఆలయానికి కొంత భూమిని మాన్యంగా ఇచ్చినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

విశిష్ట సాంప్రదాయం స్వామివారి కళ్యాణోత్సవం :

రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామికి ప్రతి సంవత్సరం రథోత్సవంతో పాటు కళ్యాణోత్సవం జరుగుతుంది. అయితే శ్రీవారి కళ్యాణోత్సవానికి అనేక సంవత్సరాల నుండి విశిష్టమైన సాంప్రదాయం కొనసాగుతోంది. శ్రీస్వామి వారి ఉత్సవ విగ్రహానికి పట్టణంలోని పద్మశాలి కులంలో అరవా తెగకు చెందిన దాదాపు 10-15 యేళ్ల వయసు గల కన్యతో వివాహం జరపడం సాంప్రదాయంగా వస్తోంది. పద్మావతీ దేవి పద్మశాలీయ కులస్థుల మూల పురుషుడైన బృగు మహర్షి కూతురని కలియుగంలో పద్మావతిగా అవతరించిందని ఆ శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడని వీరు భావించడం వల్ల పద్మశాలీయ వంశస్తురాలిని పద్మావతిగా భావించి శ్రీస్వామివారితో శాస్త్రోత్తంగా వివాహం జరిపిస్తారు. శ్రీస్వామి వారి వైపు పెళ్లి పెద్దలుగా బ్రాహ్మణులు, వైశ్యులు మేళతాళాలు, మంగ ళ వాయిద్యాలతో పెళ్లి చూపులకు సాంప్రదాయ బద్దంగా శ్రీ మార్కెండేయ దేవాలయమునకు రాగా, పద్మశాలియకుల పెద్దలు అమ్మాయి తరపున పెళ్లిపెద్దలుగా వ్యవహరించి అందరి సమక్షంలో నిశ్చితార్థ తాంబూలాలను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోంది. మరుసటి రోజు ఆ కన్యను పెళ్లి కూతురుగా అలంకరించి శ్రీ స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి వివాహ ఆచారాలన్నీ జరిపిస్తారు. తర్వాత పురోహితులు మంగళ సూత్రాన్ని అమ్మాయి మెడకు తాకించి శ్రీస్వామి వారి ఉత్సవ విగ్రహానికి కడతారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులు స్వామివారిపై వధువుపై అక్షింతలు వేస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ తదియ రోజున శ్రీ స్వామి వారికి కళ్యాణోత్సవం వేలాది మంది భక్తుల నడుమ అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామి వారి విగ్రహంతో వివాహం జరగడం వల్ల ఆ అమ్మాయికి అత్యంత యోగ్యుడైన భర్త లభిస్తాడని అమ్మాయి తల్లిదండ్రుల విశ్వాసం. ఈ ఆచారం తిరుమల దేవరాయల కాలంలోనే ప్రారంభమైనట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

వైభవోపేతంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి రథోత్సవం – కళ్యాణోత్సవం అనంతరం స్వామి వారి రథోత్సవం అశేష జనసందోహం మధ్య వైభవోపేతంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి రథోత్సవం జరుగుతుంది. రథత్సవం జరిగే రోజు ఉదయం హోమం నిర్వహించి, స్వామి వారి మడుగు తేరును పట్టణంలోని తేరు బజార్ నుండి వినాయక సర్కిల్ వరకు లాగుతారు. వినాయక సర్కిల్లో ఉంచిన రథంలోని స్వామి వారికి భక్తాదులు సాయంత్రం వరకు సందర్శించుకొని, పూజలు నిర్వహిస్తారు. ఈ రథోత్సవానికి రాయదుర్గం నియోజకవర్గం నుంచే కాకుండా ఎక్కడెక్కడ నుంచే బందువులు విచ్చేసి తరిస్తారు.




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML