తపస్సు మూడు విధములని భగవద్గీతలో భగవానుడు చెప్పి యున్నాడు. అవే అసలైన
తపస్సు అని నా భావన.
శ్లో|| దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్|
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే|| 17-14 ||
తా|| దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించటం, పవిత్రంగా
వుండటం, కల్లాకపటం లేకుండా ప్రవర్తించటం, బ్రహ్మచర్య దీక్షను, అహింసా
వ్రతాన్ని అవలంబించటం - వీటిని శరీరంతో చేసే తపస్సు అని చెబుతారు.
శ్లో|| అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే|| 17-15 ||
తా|| ఇతరులకు బాధ కలిగించకుండ సత్యము, ప్రియము, హితము అయిన సంభాషణ
సాగించడం, వేదాధ్యాయన చేయడం - వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు.
శ్లో|| మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే|| 17-16 ||
తా|| మనస్సును నిర్మలంగా వుంచుకోవటం, మౌనం వహించటం, శాంత స్వభావమూ,
ఆత్మ నిగ్రహమూ, అంతఃకరణశుద్ధీ కలిగివుండటం - మనస్సుతో చేసే తపస్సు
అవుతుంది.
ఈ ప్రాధమిక సూత్రములు పాటించకుండా ఏమి చేసినా అది సరైన ఫలితాన్ని
ఇవ్వదు. ఈవిధంగా తపమాచరించటానికి కుటుంబాన్ని, సమాజాన్ని వదిలి అడవులకు
వెళ్ళ వలసిన అవసరము లేదు.
ఎక్కడికి వెళ్ళినా మన స్వభావము మనతోనే వుంటుంది కనుక ముందు దానిని
సరిచేసుకోవలసిన బాధ్యత ఎవరికి వారికి వుంది.
అది మారాలంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా అచరించవలసినదే.
ఇవిలేకుండా ఎన్ని యోగాలు చేసినా, ధ్యానములు చేసినా అవి ప్రయోజనము
చేకూర్చవు. ఎదో మేముకూడా చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు.
ఎవరి నిర్ణయము వారిదే... ఒకరు ఇంకొకరిని మార్చలేరు. ఏ జీవి కా జీవి
మారాలి అని తనకు తాను సంకల్పించి మార్పు తెచ్చుకుంటేనే స్వభావంలో మార్పు
సంభవం.
ఏ స్వభావి ఎలా వుంటాడొ కూడా భగవానుడే చెప్పి వున్నాడు. దేనికైన శరణు
జొచ్చవలసినది భగవద్గీతకే.
No comments:
Post a Comment