కొందరు మంచి స్వామిజిల గురించి part 2
శ్రీ శిరిడీ సాయిబాబా అవతారం :
--------------------------------------

శ్రీమతి మేనేజర్ అనే పార్శీ భక్తురాలు సాయి గురించి చెప్తూ :
---------------------------------------------------------
నేనెందరినో ప్రఖ్యాత మహాత్ములను దర్శించాను, వారప్పుడప్పుడూ ఉత్తమ
ధ్యానస్థితిలోకి వెళ్లి తిరిగి మామూలు స్థితిలోకి వచ్చాక భక్తుల
హృదయాల్లోని సంశయాలకు సమాధానం చెప్పేవారు. కాని సాయికట్టి అవసరంలేదు, అదే
ఆయనలోని ప్రత్యేకత. ప్రతి క్షణమూ అయన చైతన్యం రెండు స్థాయిలలో పనిచేసేది.
ఒక స్థాయిలో శిరిడీలో సాయిగా వ్యవహరిస్తూ వాటి లౌకిక,పారలౌకిక వ్యవహారాలు
చక్కదిద్దేవారు, మరొక స్థాయిలో అహంకార భేదాన్నతిక్రమించిన
విశ్వాత్మస్థితిని అనుభవించేవారు. ఈ రెండు స్థితులకు సంబంధించిన చిహ్నాలు,
సిద్ధులు ఆయనలో ప్రకటమయ్యేవి. ఆయన చూపులో ప్రకటమయ్యే శక్తికీ, తీవ్రతకూ
తట్టుకోలేక భక్తులు తమ కళ్లను దించుకోవల్సి వచ్చేది. భక్తుని హృదయంలోని
భావాన్ని ఆయన చదువుతున్నట్టుండేది. సాయి తమ హృదయంలోనేగాక, తమ శరీరంలో
అణువణువునా వున్నట్లు భక్తులకు అనుభవయ్యేది. ఆయన మాట్లాడే కొద్ది మాటల్లో,
ప్రతి చర్యలో భూత,భవిష్యత్తు, వర్తమానాలే కాక సర్వవిషయాలు ఆయనకు
తేటతెల్లమనే విషయం ఋజువయ్యేది. సంపూర్ణ విశ్వాసంతో ఆయన్ను శరణు పొందడం
తప్ప, వేరే చేయవలసిందేదీ లేదని భక్తులకు వారి సన్నిధికి రాగానే త్వరగా
అర్ధమయ్యేది.
బాబాగారు తమ గురించి తాము చెప్పిన వివరాలు :
-------------------------------------------------
ఒకప్పుడు ధూలియా కోర్టులో దొంగ, తనవద్ద దొరికిన వస్తువులు తను
దొంగిలించలేదని అవి సాయిబాబా తనకిచ్చారని చెప్పినప్పుడు, కోర్టువారు
సాయిబాబాని విచారించారు. ఆ విచారణ ఇలా కొనసాగింది....
న్యాయవాది : మీ పేరేమిటి?
బాబాగారు : "వీరంతా నన్ను సాయిబాబా అంటారు."
న్యాయవాది : మీ తండ్రి పేరు?
బాబాగారు : "అదీ సాయిబాబానే."
న్యాయవాది : మీ గురువు పేరు?
బాబాగారు : "వెంకూసా."
న్యాయవాది : మతం?
బాబాగారు : "కబీరు."
న్యాయవాది : కులం?
బాబాగారు : "దైవం."
న్యాయవాది : మీ వయస్సు?
బాబాగారు :" లక్షల సంవత్సరాలు."
న్యాయవాది : సరిగ్గా చెప్పండి!
బాబాగారు :" నేనెప్పుడూ అబద్ధం చెప్పను."
తన చిత్రపటానికి తనకు బేధం లేదని, కుక్క, పిల్లి మొదలైన జంతువుల ఆకలి
తీరితే తమ కడుపు నిండినట్లేనని- ఇలా అనుభవపూర్వకంగా భక్తులకు ఈ విశ్వమంతా
తన రూపమే అని సాయి నిరూపించినంతగా మరొకరు నిరూపించలేదనే చెప్పవచ్చు. సాయి ఏ
మతానికీ చెందక అన్ని మతాలకు చెందారు. సర్వ ధర్మాలకూ పరాకాష్ఠగా నిలిచారు.
మతబేధం లేకుండా తననాశ్రయించిన ముముక్షువులందరికీ ఆధ్యాత్మికోన్నతి
ప్రసాదించారు. అలాంటి సమర్ధ సద్గురువు శిరిడీ 1854వ సంవత్సరంలో 18 లేక 19
సంవత్సరాల బాలుడిగా కనిపించారు. వేపచెట్టు కింద తపస్సు చేసిన తర్వాత కొన్ని
రోజుల ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లారు. చాంద్పాటిల్ మేనల్లుడి పెళ్లికి
రెండవసారి శిరిడీ చేరి దాదాపు 60 సంవత్సరాల పాటు తాము సమాధి చెందే వరకూ
అక్కడే ఉండిపోయారు.
ప్రయాగ స్నానం :
-----------------
గంగా,యమునలు కలిసే సంగమ ప్రదేశానికి ప్రయాగ అని పేరు. ఈ సంగమంలో స్నానం
చేసినట్లైతే గొప్ప పుణ్యం లభిస్తుందని తరతరాలుగా హిందువుల నమ్మకం. అందువల్ల
సాయి ముఖ్యభక్తుల్లో ఒకరైన దాసగణు ఒకరోజు ప్రయాగలో సంగమస్నానానికి
వెళ్లాలని నిశ్చయించుకొని బాబా అనుమతి కోరాడు. దానికి బాబా గణూ "శ్రమకోర్చి
అంత దూరం పోవలసిన అవసరమేముంది, నా మాటలపై విశ్వాసముంచు - మన ప్రయాగ ఇక్కడే
వుంది దోసిలి పట్టు అన్నారు." ఇంతలో అందరూ ఆశ్చర్యపోయేలా బాబాగారి రెండు
పాదాల బొటన వేళ్ల మధ్య నుండి గంగా, యమున జలాలు ఉబికి వచ్చాయి. అప్పుడు
దాసగణు ఆయన పాదాలపై శిరస్సు వుంచి ఆ చేతిని నీటిలోకి తీసుకుని ఒక్క క్షణం
ఆలోచించి నెత్తిన జల్లుకున్నాడు. బాబా చిఱునవ్వుతో మౌనంగా చూచారు. సాయి
సమాధి చెందిన తర్వాత దాసగణు మరొక యోగిని దర్శించినపుడు ఆ యోగి " మూర్ఖుడా!
సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్ధజలాన్ని, ఆయన ముస్లీమన్న
సంకోచంతో శిరస్సున ధరించావేగానీ, నోటిలో పోసుకోలేదు కదా! నీకెన్ని
జన్మలకైనా మరల అట్టి భాగ్యం లభిస్తుందా? అంతటి మహనీయుడు మరల దొరుకుతాడా?
అని మందలించారు.
** సద్గురువు సాక్షాత్తూ భగవంతుడు, సర్వ
పుణ్యతీర్ధాలూ వారి పాదాలలో వుంటాయని గురుగీత చెబుతుంది. గంగ విష్ణువు
పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు విష్ణుమూర్తే. గంగలాంటి
పుణ్యనదులు పాపాత్ములెందరో స్నానమాచరించడం వల్ల కలుషితమౌతాయి, అట్టి
పుణ్యనదులు కూడా మహనీయులు స్నానం చెయ్యడం వల్లనే తిరిగి పునీతమవుతాయి.
సద్గురువే సాక్షాత్తూ భగవంతుడని తలచి సేవించాలని, సంశయాలు తగవని ఈ లీల
ద్వారా తెలియజేసారు.
నీటితో దీపాలు :
---------------
సాయికి దీపారాధన అంటే చాలా ఇష్టం. శిరిడీలో నూనె వ్యాపారుల దగ్గర నూనె
అడిగి తెచ్చి మసీదులో రాత్రంతా దీపాలు వెలిగించేవారు. ఇలా కొన్ని రోజులు
జరిగిన తర్వాత ప్రతిరోజూ నూనె ఇవ్వడం దండగని తలచిన వ్యాపారస్తులు తమలో తాము
కూడా బలుక్కుని ఫకీర్కి నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారిని
నూనె కోసం ఎప్పటిలా వెళ్లి అడగ్గా, నూనె నిండుకుందని చెప్పారు. బాబా
వినయంగా భగవంతుడి నామాన్ని ఉచ్ఛరించి మౌనంగా మసీదుకు వచ్చేసారు. మసీదుకు
వచ్చాక, ప్రమిదల్లో ఒత్తులు వేసారు. నూనె పోసే రేకు డబ్బాలో అడుగున మిగిలిన
రెండు మూడు నూనె చుక్కలను చూచి ఆ డబ్బా నిండుగా నీరు పోసి బాగా
కలియబెట్టి, ఆ నీటిని తాగేసారు. మళ్లీ ఆ రేకు డబ్బాతో 'నీరు నిండుగా
తీసుకుని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు'. ఈ తతంగాన్నంతా రహస్యంగా
గమనిస్తున్న వ్యాపారస్తులు విస్మయం చెందేలాగా తెల్లవారి వరకూ దీపాలు
వెలుగుతూనే వున్నాయి. ఫకీర్ తాము అంచనా వేసినట్టు సామాన్యుడు కాదని తలచిన
వ్యాపారస్తులు భయపడి క్షమార్పణ వేడుకున్నారు. బాబా వారిని క్షమించి,
ఇకపైనైనా సత్యాన్ని అంటిపెట్టుకుని వుండమని హితవు చెప్పారు.
**
నిన్నెవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇవ్వడం ఇష్టమైతే ఇవ్వు, ఇవ్వడం ఇష్టం
లేనట్లయితే ఆ విషయం వినయంగా చెప్పు. అబద్ధం మాత్రం ఆడకు అనేది బాబాగారి
సూక్తి. అబద్ధం, మొహమాటం రెంటినీ జయించమన్నది బాబా గారి ఉపదేశం. లేదు అని
చెప్పేటప్పుడు బలంగా వచ్చే కోపేద్రేకాల వంటి భావోద్వేగాలని నియత్రించడం
కూడా అవసరమని ఇక్కడ ఉద్దేశ్యం. సత్యం చెప్పడమనేది కూడా సాధనే.
చక్కెరలేని తేనీరు :
------------------
నానా చందోర్కర్ ఉపన్యాసాల తోనూ, దాసగణు హరికథలతోనూ ఎంతోమందిని బాబాగారికి
పరిచయం చేసారు.దాసగణుగారు ఒకరోజు ఠాణాలో వున్న కౌపీనేశ్వరలాయంలో హరికథని
నిర్వహించారు. ఆ కథను వినడానికి వచ్చిన వారిలో చోల్కర్ కూడా ఒకడు.అతనో
కోర్టు గుమస్తా, బాగా పేదవాడు. అతడు దాసగణు కీర్తనలని అత్యంత శ్రద్ధగా
వినడంతో, బాబాగారిపై అతనికి ఇష్టం ఏర్పడింది. మనసుకి దగ్గరయిన బాబాగారితో
తన బాధని ఇలా చెప్పుకున్నాడు, "బాబా నేను పేదవాడ్ని, కుటుంబాన్నే
పోషించుకోలేని దీనస్థితిలో వున్నాను. నీ అనుగ్రహంతో ఇప్పుడు రాయబోయే
పరిక్షలో ఉత్తీర్ణత సాధించి, స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను శిరిడీ వచ్చి
నీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి, నీ పేరున కలకండ పంచుతాను." అని
మొక్కుకున్నాడు. "నీ భారములన్నీ నాపై వేసి నిశ్చింతగా వుండు" అన్న బాబాగారు
తన మాట నిలబెట్టుకున్నారు.
చోల్కర్కి స్థిరమైన ఉద్యోగం
దొరికింది. మొక్కు తీర్చుకోవాలనే ఆతృత అతనిలో ఎక్కువగావుంది, కానీ కుటుంబం
పెద్దది. తను పేదవాడు ఇప్పుడొచ్చే జీతం కుటుంబాన్ని గౌరవంగా
పోషించుకోడానికి మాత్రమే సరిపోతుంది. శిరిడీ యాత్ర చెయ్యడానికి కూడా డబ్బు
మిగిలే అవకాశమే లేదు. మొక్కు చెల్లించాల్సిందే అనే కృతనిశ్చయంతో వుండటంతో
అతను కుటుంబపోషణకయ్యే ఖర్చులో కొంత తగ్గించుకుందామనుకున్నాడు.
కుటుంబపోషణకయ్యే ఖర్చులో ప్రతిదీ అవసరమయ్యేదే కాబట్టి తను రోజూ తాగే టీలో
వేసే చక్కెరని త్యాగం చెస్తే ఎవరికీ ఇబ్బంది కలుగదని నిశ్చయించుకుని, ఆ
రోజు నుండి చక్కెరకయ్యే ఖర్చుని దేవుడి కోసం తియ్యడం మొదలుపెట్టాడు.
చాలినంత డబ్బు సమకూరిన తర్వాత శిరిడీ యాత్ర చేసి, బాబా గార్ని దర్శించి
వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి పేరు మీద కలకండ పంచిపెట్టి, దేవా ఈ
రోజుకి నా మనసులో వున్న కోరికలన్నీ తీరాయి, నాకెంతో తృప్తిగా వుంది అని
జోగ్తో కలిసి వెళ్లడానికి సెలవు తీసుకున్నాడు. వారు బయలుదేరగానే బాబాగారు
జోగ్తో - " ఒరే జోగ్, నీ అతిధికి టీ కప్పులలో విరివిగా చక్కెరవేసివ్వు"
అన్నారు. ఆయన అన్న మాట అర్ధమైంది చోల్కర్ ఒక్కడికే....అది విన్న వెంటనే
చోల్కర్ మనసు కరిగి బాబా పాదాలపై పడ్డాడు.
భగవంతుడి కోసం భక్తుడు
ఏదైనా త్యాగం చెయ్యడమనేది మహా అరుదుగా జరుగుతుంది. త్యాగం అంటే - మనకెంతో
ఇష్టమైనదాన్ని మనమెంతో ఇష్టపడ్డ వారికి అర్పించడం. మరి ఇలా
అర్పిస్తున్నప్పుడు ఎదుట వ్యక్తి మన త్యాగాన్ని గుర్తిస్తున్నాడో, లేదోనన్న
సంశయం ఏ మూలో వుంటుంది. ఈ సంశయం ఎక్కడ వెదికినా కనిపించని భగవంతుని
గురించైతే ఇంకా ఎక్కువగా వుంటుంది. బాబా వుండేది ఎక్కడో శిరిడీలో,
చోల్కరున్నది ఠాణాలో సాయి కోసం తనేంచేసాడో ఆయనకెలా తెలుస్తుంది??? అందుకే
బాబా తన భక్తులకి సూటిగా ఒక విషయం చెప్పాలనుకున్నారు. నా కోసం ఎవడైతే చిన్న
త్యాగం చేస్తాడో వాడ్ని నేను పెద్ద మనసుతో చూస్తూ వుంటాను అని
నిరూపించడానికే ఈ లీల.
** "నా ముందర భక్తితో మీ చేతులు చాపితే,
రాత్రింబవళ్లు నేను మీ వెంటే వుంటాను. నేను ఇక్కడుండి, మీరు సప్తసముద్రముల
అవతల వున్నప్పటికీ, మీరు చేస్తున్న పనులన్నీ నాకు తెలుసు. ఈ ప్రపంచంలో ఏ
మూలకైనా నీవెళ్లు, నేను నీ చెంతనే వుంటాను. నీ హృదయంలోనే నా నివాసస్థలం
వుంది. నీ హృదయంలోనూ, సర్వజనుల హృదయాల్లోనూ నివశిస్తున్న నన్ను పూజించు.
ఇది ఎవరైతే అర్ధం చేసుకుని ఆచరిస్తారో వారు ధన్యులు, పావనులు,
అదృష్టవంతులు."
72 గంటలు :
------------
1886 వ
సంవత్సరం ఒక మార్గశిర పౌర్ణమి రోజు ఉబ్బసంతో బాధపడుతూ బాబా తన భక్తుడైన
మహల్సాపతితో "మహల్సా నా శరీరాన్ని మూడు రోజుల వరకూ కాపాడు. నేను తిరిగి
వస్తే సరే, లేకపోతే ఎదురుగా వున్న ఆ ఖాళీ స్థలంలో ఈ శరీరాన్ని పాతిపెట్టి
గుర్తుగా రెండు జండాలు పాతు" అన్నారు. ఇలా చెప్పి రాత్రి 10 గంటలకి
బాబాగారు శరీరం విడిచారు. శిరిడీలో జనాలందరూ న్యాయ విచారణ చేసి బాబా చూపిన
స్థలంలో ఆయన శరీరాన్ని పాతిపెట్టడానికి సిద్ధమయ్యారు. గ్రామాధికారి
దిక్కుతోచక పోలీసుపటేల్ ద్వారా జిల్లా కలెక్టరుకి కబురుచేసాడు.అప్పుడు
కలెక్టర్ విదేశీయులమైన మేమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు, గ్రామ
పెద్దలే ఎలాగో చక్కబెట్టండి. కానీ సాయి బ్రతికితే నాకు తెలియజేయండి, ఆయన్ను
దర్శించుకుంటాను. క్రీస్తు తప్ప మరణించాక ఎవరూ జీవించలేదు అన్నారు. జనాలు
సమాధి చెయ్యాల్సిందే అని పట్టుబట్టారు. మహల్సాపతి వారికి అడ్డుతగిలాడు. మా
సాయి ఆడిన మాట తప్పడు, ఆయన మూడు రోజుల తర్వాత తిరిగి అని మొండికేసి ఆ
శరీరాన్ని ఒడిలో పెట్టుకుని మూడు రోజులూ అలాగే కూర్చుండిపోయాడు. మూడు రోజుల
తర్వాత అగష్టు 16,1886 తెల్లవారుఝామున 3 గంటలకు శరీరంలో కదలిక ప్రారంభమై,
బాబాగారు నిద్రనుండి లేచినట్లు లేచారు.
ఈ విషయం గురించి శ్యామా
బాబా గార్ని దేవా ఈ మూడు రోజులు ఎక్కడికి పోయావు, ఏమైపోయావు? మమ్మల్నెందుకు
ఇంత కలతపెట్టావు అని అడిగాడు. అప్పుడు బాబా గారు " అల్లాహ్ వద్దకు
వెళ్లాను, నేను తిరిగి రాదలచలేదు! కానీ అల్లాహ్ నీవు చేయవలసినదెంతో వుంది,
బెంగాల్లో గదాధరుడు అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కానీ అతని
పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలివున్నాయి. వాటిని నీవు స్వీకరించి,
అతనిని విడుదలచేసి నీ స్థలానికి నీవెళ్లు అన్నారు. నేనలానే చేసాను"
అన్నారు.సాయి పునరుజ్జీవితులైనారని తెలిసిన తర్వాత ఎంతో మంది ఆయన్ను
దర్శించుకున్నారు వారిలో ఆంగ్లేయుడైన కలెక్టర్ ఒకడు.
** తర్వాత
విచారిస్తే బాబాగారు గదాదర్ అని చెప్పినది రామకృష్ణ పరమహంస గురించని
తేలింది. బాబాగారు పునరుజ్జీవితులైన రోజే పరమహంస గారు రాత్రి 1 గంII 2 నిII
లకే నిర్యాణమయ్యారని తెలిసింది. రామకృష్ణ పరమహంస గారి పూర్వనామం గదాధరుడు.
నిర్యాణం - సూచనలు :
----------------------
1916 వ సంవత్సరంలో విజయదశమి వేడుకల్లో బాబా తన సమాధి గురించి సూచన
అందజేసారు. విజయదశమి రోజు ఊరు పొలిమేరకు వెళ్లి చేసే సీమోల్లంఘనము పూజ చేసి
వస్తున్నారు. అందరూ మసీదు చేరుతుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు,
కఫ్నీ, లంగోటా తీసి ధునిలో పారేసి, అగ్నికణాల వంటి కళ్లతో మసీదు ముందు
దిగంబరంగా నిలబడి, "మూఢులారా! ఇప్పుడు చూచి నేని హిందువునో, ముస్లీంనో
తేల్చుకోండి" అని కేకలేశారు. ఆ కేకలకి అందరూ భయపడిపోయారు. చివరికి
కుష్టురోగి బాబాజో ధైర్యం చేసి ఆయన మొలకి లంగోటా చుట్టి,
"బాబా, శుభమా
అని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు?" అన్నాడు.
సాయి సట్కా నేలకేసి కొడుతూ "అవును ఈ దినమే నా సీమోల్లంఘనం" అని కేకలేశారు. ఆ
తర్వాత కొంతసేపటికి శాంతిచడంతో చావడి ఉత్సవం యధాతధంగా జరిగింది.
1918 వ సంవత్సరంలో తరచూ శిరిడీకి తరచూ వచ్చే ఉద్ధవేశ్ బువా, శ్రీ మతి
చంద్రాబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి ఇక నుండి మీరు శ్రమపడి తరచూ శిరిడీ
రానక్కర్లేదు అన్నారు. కొన్ని రోజుల తర్వాత సాయి, బడేబాబా కుమారుడూ ఖాసింకు
కోడి పలావు తినిపించి "నీవు ఔరంగాబాద్లో ఫకీరు షంషుద్దీన్మియాను 250 రూ.
లతో మౌలు(సంకీర్తన) , కవ్వాలి, నియాజ్(అన్నదానం) జరిపించమను. తర్వాత ఆయన
మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి - ముస్లింల పంచాంగంలో 9వ నెలలో, 9వ రోజున
అల్లాహ్ వెలిగించిన దీపం అల్లాహ్యే తీసుకుపోతారు, ఆయన దయ అలా వున్నదని
చెప్పు." అన్నారు. ఖాసిం షంషుద్దీన్మియాగారి దగ్గరకెళ్లి సాయి చెప్పినట్లే
చాసాడు. సాయి పంపిన సందేశం విన్న ఆయన కొన్ని క్షణాలు ఆకాశం వైపు చూచి
కన్నీరు కార్చారు. దాని భావమేమిటో అక్కడున్న వారికి అర్ధం కాలేదు.
అక్టోబరు నెల ప్రవేశించింది, బాబా అంతకు కొద్ది రోజుల ముందే వాఘే అనే
భక్తుని చేత రోజు ’రామ విజయం’ అనే గ్రంధం నియమంగా చదివించుకుని అతనికి
కొబ్బరికాయ దక్షిణగా ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన గురుప్రసాదంగా
భావించే ఇటుక మాధవ్ఫస్లే చేతిలోంచి జారి క్రిందపడి విరిగిపోయింది.కొద్ది
సేపటికి మసీదుకు వచ్చిన సాయి విరిగిన ఇటుకని చూచి కోపించకుండా, కన్నీరు
కారుస్తూ "విరిగినది ఇటుక కాదు నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి,
ప్రాణానికి ప్రాణం దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. ఇప్పుడది
విరిగిపోయింది. ఇక నేనెక్కువ కాలం జీవించను" అన్నారు. అక్టోబరు 3 పురందరే,
దీక్షిత్ అనే భక్తులు దర్శనానికి రాగానే " నేను ముందు వెళ్తాను, మీరు వెనుక
వస్తారు, నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. నా నామం
పలుకుతుంది." అన్నారు. ఆ మాటలెవరికీ అర్ధం కాలేదు.
నవరాత్రులు
ఆరంభవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. బాబాకు కూడా తీవ్రంగా
జ్వరమొచ్చి, ఆయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. అయినా బాబా తాత్యాకు
నిత్యమూ ఊదీ పంపుతున్నారు. బూటీవాడాను పావనం చెయ్యకుండానే బాబా సమాధి
అవుతారని భక్తులు భయపడ్డారు. ఒకరోజు తాత్యాను భోజనానికి మసీదుకు రమ్మని
చెప్పి పిలిపించి, పాయసం తినిపించారు, అతడెంతో కష్టపడి మింగాడు. అప్పుడతని
నొసటి విభూతు పెట్టి, "తాత్యా! మొదట మనిద్దరి కోసం రెండు ఊయలలు
తెప్పించాను. కానీ మరల మనసు మార్చుకున్నాను, నేనొక్కడినే వెళ్తున్నాను,
నువ్వింటికి వెళ్లు" అని అతన్ని పంపేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్ధం.
సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర.
బాబా బాగా
నీరసించడంతో, ఆయన బిక్షకి వెళ్లడం కూడా మానుకున్నారు. ఆయన ఎక్కువ కాలం
మౌనంగా వుండసాగారు. ఒక రోజు కొందరు పులిని ప్రదర్శించి డబ్బు చేసుకునే
ఫకీర్లు కొందరు జబ్బుగా వున్న పులిని మసీదుకు తీసుకువచ్చారు.
అదెంతో
బాధతో గర్జించడం చూచిన సాయి, "పాపం దానిని అలా కట్టేశారేమి? విప్పండి దాని
బాధ నేను తీరుస్తాను" అన్నారు. ఫకీర్లు ముందు భయపడ్డారుగానీ, తర్వాత
గంపెడాశతో దాన్ని విప్పారు. అది మెల్లగా బండి దిగి, మసీదు మెట్లెక్కి ఆయన
ఎదుటకొచ్చింది. మంత్రముగ్ధయైనట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్ను చూచి,
వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకుంది. బాబా పాదాలు వాసన చూచి, మూడు
సార్లు తోకని నేలకు కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. సాయి దాని
యజమానులకు 500 రూ. బహూకరించారు.
విజయదశమికి నాలుగు రోజులుందనగా
సాయి నందూ మార్వాడి భార్యతో, "ద్వారకామాయిలోనూ, చావడిలోనూ వుండాలంటే నాకేమీ
బాగుండలేదు. నేను బూటీవాడాకు పోతాను. అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు
చేస్తుంటారు" అన్నారు. ఇంకో రెండు రోజులకు తాము సమాధి చెందుతామనగా బాబాగారు
భక్తులతో "మీరెవరూ శోకించగూడదు" అని హెచ్చరిస్తున్నారు. ఎంతో అస్వస్థగా
వున్నప్పటికీ ఆయన ఎప్పుడూ విశ్రమించలేదు. రోజంగా కూర్చునే వుండేవారు.
అక్టోబరు 15, విజయదశమి రోజు తెల్లవారుఝామున బాబాగారు చాలా బలహీనంగా
వున్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే వున్నారు.
తత్యాకు నాడి బలహీనమవుతుందని కబురు వచ్చింది. మధ్యాహ్న హారతి కాగానే
భక్తులందర్నీ భోజనాలకు పంపేశారు. శ్రీమతి లక్ష్మీబాయి షిండే, బయ్యాజీ
అప్పకోతే పాటిల్, బాలాషింపీ, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే
ఉన్నారు.
అప్పుడు బాబా "నాకిక్కడ ఏమీ బాగాలేదు, ఆ దగదీవాడా(బూటీ
వాడా)కి తీసుకుపొండి, అక్కడ నాకు సుఖంగా వుంటుంది" అన్నారు. ఆయన ఆసనం మీద
కూర్చుని మాధవ్ఫస్లేనడిగి పాన్(తాంబూలం) తీసుకున్నారు. తర్వాత ఆయన
మంచినీళ్లు తాగుతుండగా మధ్యలో మింగుడుపడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్లు
అర్ధ నిమీలితాలయ్యాయి. అప్పుడాయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5.
తర్వాత 4 నాణేలూ ఇచ్చి వాటిని జాగ్రత్తగా వుంచుకోమన్నారు. అబ్దుల్లాను
వెంటనే రమ్మని కబురు చేస్తే అతను కాసేపాగి వస్తానని చెప్పమన్నాడు. సాయి
చిన్నగా నవ్వి, తమకు మసీదులో బాగుండలేదని, బూటీవాడాకు తీసుకెళ్తే
బాగుంటుందని చెప్పి, బయ్యజీ అప్పకోతే పాటిల్ వైపు ఒరిగి కన్నుమూసారు.
బాగోజీ అది గమనించి, నిమోన్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం
నీరుపోసి, అది బయటకు వచ్చేయడం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు. సాయి శరీరం
విడిచారని వినగానే, గ్రామస్తులు, భక్తులు శోకాలు పెడుతూ మసీదు చేరారు. తన
దురదృష్టానికి అబ్ధుల్ల ఎంతగానో దుఃఖించాడు. క్షణంలో శిరిడీ యావత్తూ
జీవచ్ఛవమైంది. ఎప్పుడూ భయమూ, దుఃఖమూ ఎరుగని నానావల్లీ గూడా ఆ రోజు కన్నీరు
తుడుచుకుంటూ కొద్దిసేఫు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్లిపోయాడు.
అప్పటినుండి 13 రోజులపాటు, "ఓ మామా నీవు లేక నేను బ్రతుకలేను. నేనూ
వచ్చేస్తాను" అని శోకాలు పెడుతూ, అన్నపానీయాలు గూడ మాని సమాధి చెందాడు!.
సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాత్యా ఆరోగ్యం బాగుపడింది.
సాయిని ఏ విధంగా సమాధి చెయ్యాలనే అంశంపై ఇరు పక్షాలవారికి వివాదం జరిగింది.
చివరికి సాయి సంకల్పాను సారం ఆయన శరీరాన్ని బూటీవాడాలో సమాధి చేసారు.
విరిగిన ఇటుకని వెండితీగతో చుట్టి ఆయన తల కింద పెట్టారు. సమాధి చెందిన
మరుసటి తెల్లవారుఝామునే దాసగణుకు స్వప్నంలో కనిపించి, "మసీదు కూలిపోయింది,
నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు. అందుకే ఆ చోటు
విడిచిపోయాను. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. నీవు త్వరగా వెళ్లి సమాధిని
పూలతో కప్పు" అన్నారు. అతను వెంటనే శిష్యులతో శిరిడీ చేరి సమాధి పూజ,
ఏకాహము, అన్నదానం చేసాడు. సాయి అదే రోజు ఉదయం లక్షణ్ మామా జోషికి స్వప్నంలో
కనిపించి, "నేను మరణించాననుకొని ఈ రోజు జోగ్ ఆరతివ్వడానికి రాడు. నీవు
వచ్చి పూజ, ఆరతి చెయ్యి" అని చెప్పారు. అతడు వెంటనే వెళ్లి సాయి దేహానికి ఆ
సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలసి జోగ్ సాయి దేహానికి
పూజ, ఆరతి చేసాడు. బాబా చేతి వేళ్లు తెరిచి దక్షిణ పెట్టాడు, 21 గంII ల
తర్వాత గూడ సాయి వేళ్లు బిగిసిపోకుండా, తెరిస్తే సులువుగా తెరుచుకున్నాయి.
బాబా సమాధి చెందిన మరునాటి రాత్రి గం. 12.30 ని.లకు శ్రీమతి ప్రధాన్కు ఒక
కల వచ్చింది. బాబా సమాధి చెందుతుంటే చూచి, "ఆవిడ బాబా చనిపోతున్నారు! అని
కేకలు పెడుతుంది. అపుడు బాబా మహాత్ములు చనిపోరు సమాధి అవుతారు" అన్నారు.
మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది. అందరూ దుఃఖిస్తున్నారు. తెల్లవారే సరికి
సాయి మహాసమాధి చెందిన వార్త అందింది. కాలాతీతుడు, ద్వంద్వాతీతుడు ఐన ఆయనకు
మరణం ఎక్కడిది?తనకు మరణం లేదని తన భక్తులకు తెలియజేయడానికే ఈ
నిరూపణలిచ్చారు.
శ్రీ గజానన మహరాజ్ అవతారం : (శేగాంవ్) :
----------------------------------------

సంత్
శ్రీ గజానన మహారాజు మాఘ పద్య సప్తమి తిథి, 23-2-1878 న శేగాంవ్లో
ప్రత్యక్షమయ్యారు. వీరుకూడా సాయి బాబా వలెనే ఎవరికి జన్మించారు? ఎక్కడ
నుండి ఇక్కడికి వచ్చారు? వారు ఏ జాతి వారు? అనే వివరాలు ఎవరికీ తెలీదు.
భగవంతుడి సృష్టే అంత, పంచ భూతాలతో సహా ప్రతిదీ జాతి, కుల, మత బేధాలు
లేకుండా అందరి కోసం సృష్టించబడ్డట్టే, మహాత్ములు కూడా తాము అవ్యక్త స్థితి
నుండి వ్యక్తమైనప్పుడు ప్రతి ఒక్కరినీ ఆదరిస్తారు. కానీ ఇది నాది, అది
నీది, నేను, నీవు అనే స్థితిలో వున్న సామాన్యులమైన మనం అందరి కోసం వెలసిన
మహాత్ముల్ని కూడా ఏదో ఒక ఛట్రంలో ఇరికించే ప్రయత్నం చేస్తాం. గజానన
ప్రభువులకి, స్వామి సమర్ధులకి కూడా సాయి వలనే ఒక మొదట నామం లేదు. నామ,
రూపాలకి అతీతులమని తెలపడానికే వారీవిధంగా సంకల్పించి వుండవచ్చు.
అవతరణ :
----------
దేవదాసు అనే ఒక మఠాధిపతి మాఘ పద్య సప్తమి రోజు తన కుమారుని గ్రహశాంతి
నిమిత్తం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. భోజనానంతరం మిగిలిన ఎంగిలి
విస్తళ్లను పారవేసేచోట ఒక వ్యక్తి కూర్చుని, ఆ విసిరిన ఎంగిలి విస్తళ్లలో
ఏవైనా ఎంగిలి మెతుకులు దొరికితే అమాంతం నోట్లో వేసుకుంటున్నాడు. అదే
సమయానికి అటుగా బంకట్లాల్ అగర్వాల్, అతని మిత్రుడు దామోదర్పంత్ కులకర్ణి
కలిసి అటుగా వస్తూ ఆ వ్యక్తిని చూశారు. వాస్తవానికి భగవంతుడు మనిషిలా
వెలసినంత మాత్రాన్నే, ఆయనకి వైకుంఠంలో వుండే విష్ణుమూర్తిలా అలంకారాలుండవు,
ఆయనా మనలా మామూలు మనిషిలానే వుంటాడు. క్రీడలో సామాన్యుడైనా, అసామాన్యుడైనా
మైదానంలో దిగిన తర్వాత ఎవరైనా ఒకటే దుస్తులు ధరించాలి మరి. అలాగే ఇక్కడ
సామాన్యుల్లో అతి సామాన్యుడిలా అక్కడ మెతుకులు తింటున్న వ్యక్తిలో ఏదో
దివ్యత్వం గోచరించి ఆయన్ని పరీక్షగా చూచాడు. చూడ్డానికి నిజమైన నోటు, దొంగ
నోటు ఒకేలా వుంటాయి, నిపుణుడే అసలో, నకిలీనో పసిగట్టగలడు. అలాగే భగవంతుణ్ని
కేవలం భక్తులు మాత్రమే గుర్తించగలరు. అలా చూస్తున్న బంకట్లాల్కి
దారినపోతూ ఎంగిలి మెతుకులు తినే బిచ్చగాడిలా కనిపించలేదు అక్కడ కూర్చున్న వ్యక్తి.
ఆయన ఉపాధిరహితుడవటం చేత కేవలం నీరు త్రాగే కమడలమూ, మట్టితో తయారుచేసిన
హుక్కా గొట్టం తప్ప ఇంకేవీ ఆయన దగ్గర లేవు. విదేహుడవడం (దేహఙ్ఞానం లేకపోవటం
) వల్ల ఆయన దిగంబరిగా వున్నారు. నీవు, నేను అన్న బేధభావం లేకపోవటం వల్ల
వారి వృత్తి లౌకికానికి భిన్నంగా వుంది. సంసారం పట్ల నిరాసక్తులవడం వల్ల
ఆయనకి రుచే లేకుండాపోయింది. నిరంతరం ఆత్మధ్యానంలో నిలిచివుండటం చేత బేధభావం
నశించిన ఆయన దొరికిందే తిని ఆకలి బాధని తీర్చుకుంటున్నట్టు అనిపించింది.
ఆయన దృఢమైన శరీరం కలిగివున్నారు. విశాల వక్షస్థలం, భృకుటి మధ్యనే స్థిరంగా
నిలిపిన దృష్టి వంటి లక్షణాలు ఆయన యోగి అని తెలియజేస్తున్నాయి. అవధూత
స్థితిని గురించి భాగవతంలో చెప్పిన వివరాలన్నిటినీ ఆయన పోలివున్నారు. ఇదంతా
గమనించిన బంకట్లాల్ ఆ మహాత్ముని వైపు వెళ్లి, స్వామీ! ఎంగిలి ఆకుల్లో
మెతుకులెందుకు తింటున్నారు? మీకు ఆకలిగా వున్నట్లయితే భోజనం సిద్ధం
చేయిస్తాను" అన్నాడు. స్వామి సమాధానం ఇవ్వకుండా మౌనంగా వారివైపు
దృష్టిసారించారు. వెంటనే బంకట్లాల్ దేవీదాసును పిలిచి విషయం చెప్పి
పంచభక్ష్యాలున్న భోజనపాత్ర తెప్పించి స్వామి వారి ముందుంచాడు. స్వామి వారు
భోజన పదార్ధాలన్నిటినీ కలిపేసి భోజనం ముగించారు. రుచిన ఆస్వాదిస్తూ
భుజించడానికీ, ఆకలి బాధని తీర్చుకోవాలని భోజనం చేయడానికి మధ్య ఎంతో
వ్యత్యాసం వుంది. ఎంత వ్యత్యాసం అంటే అవసరానికీ, విలాసానికి మధ్య వున్నంత.
స్వామి వారి కమండలం ఖాళీగా వుండటం చూచి బంకట్లాల్, "స్వామీ కమండంలో నీరు
లేదు, మీరు కోరినట్లయితే ఈ దాసుడు తెచ్చివ్వగలడు అన్నాడు." అది విని స్వామి
మందహాసం చేస్తూ, "మీకవసరమైతే తీసుకురండి, ఒకే సద్వస్తువు అన్నిటిలోను
నిండివుంది. నీవు నేను అనే తేడా అక్కడ లేదు. కానీ లౌకిక ప్రపంచంలో దేహధారణ
చేసినప్పుడు కొన్ని అవసరమవుతాయి. ఇంతకు ముందు అన్నం తిన్నాను గనుక, ఇప్పుడు
నీరు అవసరం - కాబటి తాగక తప్పదు." అన్నారు. స్వామికి కించిత్ సేవ చేసే
భాగ్యం దక్కిందని దామోదర్పంత్ వేగంగా ఇంటికి పరుగెత్తుకెళ్లి శుద్ధ జలం
తెచ్చాడు. ఈలోపే స్వామి నూతి దగ్గర పశువుల కోసం పెట్టిన నీటిని త్రాగి
బ్రేవ్ మని తేన్చారు. అది చూచిన పంత్ " అయ్యో స్వామీ మీరు తాగేనీరు పశువుల
కోసం వుపయోగించేది, దాన్ని తాగకండి అన్నాడు." స్వామి మందహాసం చేస్తూ "ఇక్కడ
పవిత్రం - అపవిత్రం, మంచి - చెడు తేడా లేదు, నీరు, దాన్ని తాగేవాడు,
తాగాలనే కోరిక కూడా ఈశ్వరుడే. భగవంతుడు అంతటా వున్నా సామాన్యులు
తెలుసుకోలేరు. అంచేత భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి." అని, వారు
ప్రమాణం చేసే లోపల వాయువేగంతో అక్కడ నుండి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయారు.
కాశీ సన్యాసి - గంజాయి :
------------------------
కాశీలో స్వామి వారి లీలలు విన్న సర్వసంఘ పరిత్యాగి ఐన ఒక సన్యాసి, తనకెంతో
ప్రియమైన గంజాయిని స్వామివారికి సమర్పిద్దామని సంకల్పించి స్వామి వారి
దర్శనార్ధం శేగాంవ్ వచ్చాడు. భక్తులతో స్వామివారి దర్బార్ కిటకిటలాడుతుంది.
అంతమంది భక్తులతో వేంచేసివున్న స్వామివారి దర్బార్లోకి ప్రవేశించి,
అంతమంది సజ్జనులు ఎదుట ఆయనకి గంజాయినెలా సమర్పించాలా అని వ్యాకులపడసాగాదు.
భక్తునకేది ప్రియాతిప్రియమైనదో భగవంతునికదే సమర్పించగోరతాడు, గంజాయి తనకి
ప్రియమైనదైనా అందరి భక్తుల ఎదుట అది సమర్పించబూనడం హాస్యాస్పదమౌతుందోమోనన్న
శంక, అంతమందిలో తనెక్కడో మూలన వుండగా ఆయన దర్శనం ఎనాటికి లభిస్తుందో అని
చింతతో స్వామివారినే స్మరిస్తూ ఉన్నాడు. సర్వాంతర్యామి ఐన స్వామికి తన
భక్తుని మనోగతం తెలియకుండా ఎలా వుంటుంది? సన్యాసి చింతని తీర్చాలని స్వామి
సంకల్పించి ఒక భక్తునితో "ఆ మూలగా కాశీ నుండి వచ్చిన సన్యాసి వున్నాడు,
అతను మా దర్శనానికి ఆతురుత పడుతున్నాడు అతన్ని తీసుకురండి" అన్నారు. స్వామి
సందేశాన్ని విన్న సన్యాసి తన కోరిక తీరబోతున్నందుకు ఎంతో ఆనందించాడు,
యోగులు నిజంగా త్రికాలఙ్ఞులనే విషయం అతనికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది.
అతను స్వామి వారి ఎదుటకు రాగానే "మొక్కుకునేప్పుడు లేని బిడియం
ఇప్పుడెందుకూ" అని చమత్కారంగా అని సరే "ఆ సంచిలో నా కోసం మూడునెలలుగా
దాచివుంచిన వస్తువును బయటకు తీసి అర్పించి నీ మొక్కు తీర్చుకో " అన్నారు.
తన మొహమాటాన్ని గుర్తించి స్వామివారే స్వయంగా మొక్కు తీర్చుకో అంటూ అందరి
ఎదుట తన గంజాయి సమర్పణ వ్యవహారం అపహాస్యం కాకుండా కాపాడారని అర్ధమయి,
ఆనందభాష్పాలు ప్రవహిస్తుండగా స్వామి వారికి సాష్టాంగ నమస్కారంచేశాడు. ఈ
సన్యాసి మహాచతురుడు తన సంచీలోంచి గంజాయి తీస్తూ స్వామీ "మీరికనుండి ఎప్పుడూ
గంజాయి తాగుతానని మాటివ్వండి, అదే నా కోరిక - మీకిది అనవసరమైనదే అనుకోండి.
నా కోరిక మన్నించండి, పిల్లవాని కోరిక తల్లి ఎలానూ తీరుస్తుంది కదా. మీరు
కర్పూర గౌరీశంకరులు కదా - నా గంజాయిని వేళాకోళం చేయకండి. శంకరులు దీనిని
’ఙ్ఞానవళ్లి’ అన్నారు. దీని వుపయోగించడంలో ఇతరులకి హానిగానీ, మీకిది
శోభాయమానమైనదే కదా" అన్నాడు. సన్యాసి గంజాయి తీసి దాన్ని చేతిలో వేసి
శుభ్రం చేసి స్వామికి త్రాగశానికిచ్చాడు. సన్యాసి మాటలను విన్న స్వామి ఒక్క
క్షణం ఆలోచించి, వెంటనే తల్లి తన పిల్లవాని కోరిక మన్నించినట్టుగా అతని
కోరిక తీర్చారు. తన కోరిక తీరిందనే సంతృప్తితో ఆ సన్యాసి ఇహ రామేశ్వరం
వెళ్లాడు.
** భక్తుడు నిష్కల్మషమైన హృదయంతో ఏదిచ్చినా భగవంతుడు
ప్రేమతో స్వీకరిస్తాడు. పరుసవేది తాకగానే ఎంతటి కఠిన లోహమైనా బంగారంగా
మారినట్టు, ఎంతటి చెడయినా భగవంతున్ని స్పర్శ పొందగానే అది సద్వస్తువై
తీరుతుంది. భక్త కన్నప్ప ఎంతో ప్రేమతో సమర్పించిన మాంసాన్ని పరమశివుడు ఎంతో
ప్రీతితో ఆరగించారు. ఇవేవో కాలాన్ని గడపటం కోసం వినే కథలు ఎంత మాత్రమూ
కాదు - ఇవి సచ్ఛరిత్రలు. సచ్ఛరిత్ర - సత్ అనగా నిత్యమూ నిరూపణకు నిలిచే
వాస్తవం అని అర్ధం, చరిత అంటే జరిగిన సంఘటనల సమాహారం అని అర్ధం. వినడం
ద్వారా నేర్చుకోవాలి. నేర్చిన దాన్ని ఆచరణలో పెట్టాలి, అప్పుడు కదా
భగవంతుడు అనుభవానికి వచ్చేది.
తెలుగు బ్రాహ్మణులు :
---------------------
ఒకరోజు ఖండూ పాటిల్ అనే భక్తుని ఇంట్లో స్వామి వారు విడిది చేసారు. అదే
సమయంలో ఓ పదిమంది తెలుగు బ్రాహ్మణులు ఖండూ పాటిల్ ఇంటికి వచ్చారు. వారు వేద
పండితులే గాక విద్వాంసులు కూడా అయితే వీరు కాస్త ధన ప్రలోభం కలవారు. వీరు
వచ్చే సమయానికి స్వామి వారు కంబలి కప్పుకుని పడుకుని వున్నారు. వీరిని
లేపాలనే ఉద్దేశ్యంతో ఆ బ్రాహ్మణులు పెద్దగా వేద మంత్ర పఠనం ప్రారంభించారు,
స్వర యుక్తంగా వేద పఠనం సాగుతోంది, ఈ క్రమంలో మంత్రపఠనంలో చిన్న పొరపాటు
జరిగింది. అయినా దాన్ని పట్టించుకోకుండా పఠనం సాగిస్తున్నారు.
స్వామి వారు వెంటనే లేచి ఆసనం మీద కూర్చున్నారు, వేద పఠనం చేస్తున్న వారితో
కాస్త కఠినంగా "మీరు వైదికులెందుకయ్యారు? మంత్రాలు తప్పుగా చదివి
వేదవిద్యకు హాని కలిగించకండి. పొట్ట పోసుకోవటం కోసం వేద విద్యని ఆలంబనం
చేసుకోకండి! ఇది మోక్షాన్ని ప్రసాదించే విద్య. ఆ కప్పుకున్న శాలువా
విలువైనా కాపాడండి." అని "నేనెలా చెపుతానో మీరూ అలానే చెప్పండి.
చెప్పేప్పుడు సరియైన ఉచ్ఛారణ, స్వరంపై ధ్యాస వుంచండి. అమాకులైన భక్తుల్ని
భ్రాంతిలో పడేయకండి." అంటూ ఏ వేద మంత్రాలైతే బ్రాహ్మణులు పఠిస్తున్నారో
వాటినే స్వామి స్వర యుక్తంగా పఠించడం ప్రారంభించారు. వారి వాక్శుద్ధికీ,
విలక్షణ స్మరణ శక్తికీ బ్రాహ్మలు ఆశ్చర్యపోయి, తలలు వంచి కూర్చుండిపోయారు.
వీరిని పిచ్చివాడనుకున్నాం వశిష్ట మహర్షుల వారే వేదగానం చేసినట్టుగా వుంది
వారి గానం అనుకున్నారు. స్వామి వారిని పెద్ద మనసుతో క్షమించి, ఖండూపాటిల్
చేత వారిని సాదరంగా ఆహ్వానింపజేసి ఒక్కొక్కరికీ ఒక్కో రూపాయి దక్షిణ ఇచ్చి
దీవించిపంపారు. స్వామివారు వారితో మాట్లాడేప్పుడు తెలుగు భాషనే
ఉపయోగించారు.
** సాయి దర్బారులో నానా చందోర్కర్ అనే భక్తుడు
డిప్యూటీ కలెక్టరు, భగవద్గీత ఇత్యాది గ్రంధాలపై బాగా పట్టున్నవాడు. అతను ఓ
రోజు సాయికి పాద సేవ చేస్తూ, భగవద్గీత శ్లోకాలు వల్లెవేసుకుంటున్నాడు.
ఏమిటి నానా నీలో నీవే ఏదో గొణుక్కుంటున్నావ్వు, పైకి చదివితే మేమూ వింటాం
కదా అంటారు. అప్పటికీ నానా సాయి తత్త్వాన్ని గుర్తించలేదు, అందుకే ఇది
భగవద్గీత బాబా మీకు అర్ధం కాదు అంటాడు. అప్పుడు బాబాగారు ఆ శ్లోకాని పైకి
చదివి అర్ధం వివరిస్తే తెలుసుకుంటాను నానా అని వినయంగా అడుగుతారు.
"తద్విద్ధి ప్రణి పాతేనా పరి ప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యన్తి తే ఙ్ఞానం ఙ్ఞానినాస్తత్వదర్శినాః"
ఇది శ్లోకం అని తెలిపి, తనకు తెలిసిన అర్ధం చెబుతాడు నానా. బాబా అతన్ని
కొన్ని ప్రశ్నలడిగి అతనికేమాత్రం గీత మీద పట్టున్నదీ అతనికి తెలియజేసి,
దాని లోతైన అర్ధాన్ని వివస్తారు.
1.సద్గురువులకి శరీర భంగిమతో
కేవలం నమస్కరిస్తే చాలదు వారికి మన మనసుని సంపూర్ణంగా అర్పించాలి, అదే
సర్వస్య శరణాగతి. మనసా, వాచా, కర్మణా వారిని తెలుసుకోవటానికి ప్రయత్నం
జరగాలి.
2.గురువుల శక్తి సామర్ధ్యాలు తెలుసుకోవటానికో, వారి
తప్పొప్పులెన్నడానికో కాక, మనం అధ్యాత్మికంతా ఉన్నత శిఖరాలు చేరుకోవటానికి
వారి ఉత్సాహంతో ప్రశ్నించి, వారి నుండి సేకరించిన వివరాలు ఆచరణలో పెట్టాలి.
3.సేవ అనేది మనకి మనం పూనుకుని చేసేది కాదు - మనకి నచ్చినప్పుడు
చెయ్యటానికీ, నచ్చనప్పుడు మానడానికి. ఈ శరీరం, మనసు నాది అనే భావన విడిచి,
ఇది గురువు ప్రసాదించినది. దీనిపై పూర్తి హక్కు వారిదే. ఈ దేహంలో గురువు
నివశిస్తున్నారు. వారి మనసు నొచ్చుకునే పనులేవీ చేసే స్వేచ్ఛ నాకు లేదు అని
గుర్తెరిగి. గురువు ఆఙ్ఞ ప్రకారం నడుచుకునేదే. అసలైన జీవితం. అదే ఙ్ఞాన
సంపాదనకి మార్గం.
** సద్గురువు అంటే లౌకికమైన వ్యక్తి కాదు, ఆయన
పూర్ణఙ్ఞాని. ఙ్ఞానం అంటే కేవల పుస్తక ఙ్ఞానం కాదు. ఉదా : ఒక పుస్తకంలో -
మనసుని పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నవాడే పూర్ణఙ్ఞాని, అతనికి ప్రకృతి
కూడా తలవంచుతుందని చదివాం అనుకోండి. ఇది చదివి గుర్తుపెట్టుకుని నలుగురికి
తెలియజెప్పడం ఙ్ఞానం కాదు. అది పుస్తక పరిఙ్ఞానం. ఙ్ఞానం అంటే తెలుసుకున్న
దాన్ని నిరూపించగలగడం. అంటే సాయి సచ్ఛరిత్రలో బాబా గారు తన భక్తులుతో
మసీదులో వున్న సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను వచ్చింది. మోరేశ్వర్
ప్రధాన్, అతని భార్య త్వరగా వెళ్లాల్సి వుంది, తుఫాను వల్ల తాము గమ్యం
చేరుకోవటం వీలుపడదేమో అనే ఆందోళనలో ఉన్నప్పుడు, బాబాగారు తన భక్తుల
మనోభావాలు పసిగట్టగలిగిన అంతర్యామి అవడం వల్ల - " భగవంతుడా నా బిడ్డలు
గమ్యం చేరాలి, తుఫాను నిలిచిపోనీ" అన్నారు. అన్న వెంటనే తుఫాను ఆగిపోయింది.
ధునిలో మంటలు ఎక్కువయి మసీదు కప్పుని తాకుతున్నప్పుడు "తగ్గు తగ్గు"
అనగానే అగ్ని ఆయన మాట జవదాటలేదు. అదీ పూర్ణఙ్ఞానం.
** భక్తులు
వేరు తమంతట తాము భక్తులం అని అనుకునేవారు వేరు. వాస్తవానికి నిజమైన
భక్తునికి భగవంతునికీ తేడా ఏమీ వుండదు. భక్తుడు పిలిస్తే భగవంతుడు
పరిగెత్తుకుంటూ వస్తాడని భాగవతంలో గజేంద్రోపాఖ్యానంలో వ్యాస మహర్షుల వారు
తెలియజేసారు, అది కాకపోయినా ఏ సద్భక్తుని చరిత అధ్యయనం చేసినా మనకి ఈ విషయం
అర్ధమవుతుంది.
బ్రహ్మఙ్ఞానం :
-------------
శేగాఁవ్కి
ఉత్తరం వైపున కృష్ణాపాటిల్కి సుందరమైన ఉద్యానవనం వుంది, బాబా వారు అక్కడ
విడిది చేసివున్నారు, ఆయన అక్కడ వున్న సమయంలోనే తీర్ధయాత్రలు చేస్తూ
ఉపదేశాలిస్తూ, భక్తులకి ప్రవచనాలు చెప్పే ఒక సన్యాసుల బృందం అక్కడ బస
చేసారు. ఆ సన్యాసుల బృందానికి బ్రహ్మగిరి అనే సన్యాసి నాయకుడు, వారి
శిష్యుల్లో ఒకడు పాటిల్తో " ఓ పాటిల్ మేం బ్రహ్మగిరిజీ వారి శిష్యులం, మేము
తీర్ధయాత్రలు చేస్తూ భాగీరధి జలాన్ని తీసుకుని రామేశ్వరం వెళ్తున్నాం.
గంగోత్తరి, జమునోత్తరి, కేదారం, హింగళాజ్ మాత, గిరినార్, డాకోర్ ఇత్యాది
పుణ్యక్షేత్రాలు పాదయాత్రతోనే దర్శించాము. గురుదేవులు కూడా మాతోనే
విచ్చేశారు. వీరి పరిచయభాగ్యం ఎలాంటిదంటే ఏం చెప్పను? భగవంతున్నే తమ
నౌకరుగా చేసుకున్న మహానుభావులు. ఆట్టివారు నీ అదృష్టం కొద్దీ నీ గడప
తొక్కారు. వారికి హల్వా, పూరీలంటే ప్రీతి, వారికవి నైవేద్యంగా సమర్పించుకో,
మేం కొద్దిగా గంజాయి కూడా సేవిస్తాం - అదీ సమర్పించుకో. గురువుగారి సేవా
భాగ్యం నీకు నాలుగురోజులే దొరుకుతుంది. తర్వాత మా యాత్ర కొనసాగాలి
అన్నాడు." అలా వారికి కావల్సిన రుచికరమైన పదార్ధాలన్నీ చెప్పి చేయించుకుంటూ
విందులు ఆరగిస్తూ, ప్రవచనాలు కొనసాగిస్తున్నారు.
రెండో రోజు వారి
గురువు బ్రహ్మగిరి, భగవద్గీతలో "నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః "
అనే శ్లోకం ఎన్నుకుని దానిపై ప్రవచనం కొనసాగిస్తున్నాడు. వారి శిష్య
రత్నాలు, దొరికినవి భక్షించి, గంజాయి గొంతుదాకా పీల్చి మత్తులో జోగసాగారు.
గజానన్ బాబా వారు కూడా చిలుము సిద్ధం చేసుకుంటూ ఆ తతంగాన్నంతా
చూస్తున్నారు. ఇంతలో ఒక నిప్పురవ్వ స్వామివారు కూర్చున్న మంచం మీద పడి
అంటుకుంది, అది గమనించిన భాస్కర్ పాటిల్ స్వామి మంచం అంటుకుంది, అది
టేకుది, నీటితోగానీ దాన్ని ఆర్పలేము, దిగిరండి స్వామి అని ఆందోళనగా
అన్నాడు. దానికి స్వామి, "ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించవద్దు" అని
బ్రహ్మగిరి స్వామి వేపు తిరిగి " ఓ బ్రహ్మగిరి స్వామీ! మీరు భగవద్గీతను
ఆసాంతమూ తెలుసుకున్నారు కదా, దయచేసి ఇటురండి...ఈ మండే మండే మంచం మీద
కూర్చుని భగవంతుడు గీతలో చెప్పిన సత్యాన్ని ఋజువుచేయండి." అన్నారు. అతను
తనెని దీన్లో ఎందుకు ఇరికిస్తున్నారో అర్ధంకాక దూరంగా వెళ్లే అవకాశం కోసం
చూస్తుంటే, నాలుగు వైపులా మండుతున్న మంచంపై నిజానందంలో కూర్చున్న బాబాగారు
పాటిల్ని పిలిచి, " ఆ బ్రహ్మగిరిని పట్టి ఈ మంచంపై పడెయ్యి, అతని
ప్రవచనానికి మెచ్చిన భగవంతుడు అతని సత్యం నిరూపించే అవకాశం ఇచ్చాడు, మళ్లీ
మళ్లీ ఇట్టి అవకాశం అతనికి కలుగకపోవచ్చు." అన్నారు. తన నిజస్వరూపం
తెలియపరచకుంటే తన ప్రాణాలకే ప్రమాదమని గ్రహించిన బ్రహ్మగిరి - దేవా గజాననా
బాబా, నన్ను క్షమించు కేవలం భుక్తి కోసమే ఈ వేషం వేశాను. భగవద్గీతను
కంఠస్తం చేసాను తప్పితే అందులో ఇమిడివున్న నిరంతర సత్యాన్ని అన్వేషించే
ప్రయత్నమెప్పుడూ చేయలేదు. మిమ్మల్ని పిచ్చివాడిగా తలచాను, కానీ నేడు మీ
మహత్తు ప్రత్యక్షంగా చూస్తున్నాను, ప్రభూ నా అపరాధాలన్నిటికీ నన్ను
క్షమించమని వేడుకుంటున్నాను అని తన పశ్చాత్తాపం ప్రకటించాడు. ప్రజల
అభ్యర్ధన మన్నించి స్వామి అగ్నిమయం అయిన ఆ మంచం నుండి క్రిందికి
దిగివచ్చారు. దిగి రాగానే ఒక్క క్షణంలో మంచం మొత్తం విరిగిపోయి
కాలిపోయింది. బ్రహ్మగిరి స్వామివారికి సాష్టాంగపడ్డాడు.
అర్ధరాత్రి స్వామి వారు బ్రహ్మగిరికి ఇలా ఉపదేశం చేసారు -" నేటి నుండి
ప్రజలను మోసగించకు, ఒంటికి విభూది పూసుకునేవాడు సన్మానాదులకి దూరంగా
వుండాలి, అనుభవంలేని ఙ్ఞానాన్ని ఇతరులకు బోధించరాదు. ఈనాడు శబ్ధపాండిత్యం
ఎక్కువ ప్రచారంలో వుంది. దీని వలన సంస్కృతు పతనమవుతోంది. మహాఙ్ఞానులైన
నవనాధుల మహిమనెవరు ఎరుగగలరు? శ్రీ శంకరాచార్యులవారు స్వానుభవ యతులుగా
చెప్పబడతారు, సంసారం చేస్తూనే ఏకనాధులు బ్రహ్మఙ్ఞాన స్థితిని అనుభవించి
తెలుసుకోగలిగారు, సమర్ధ రామదాసుల వారు బ్రహ్మచర్యాన్ని పాటించి
బ్రహ్మఙ్ఞానాన్ని పొందారు. ఇలాటి వారెందరొ ఈ భూమిపై జన్మించారు. వారి
పుణ్యచరితలు ఎంతని గానం చెయ్యగలం? హల్వా, పూరీలు తిని వ్యర్ధంగా కాలక్షేపం
చెయ్యకు, ఏమీ సాధించలేని జీవితం వృధాయైపోతుంది." అన్నారు. గజాననుల వారి
ఉపదేశం విన్న బ్రహ్మగిరికి నిజంగానే జీవితంపై విరక్తి కలిగింది. ఉదయం
కాగానే ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు.
**అప్పటి పరిస్థితే
అలా వుంటే నిజమైన సద్గురువు దొరకడం నేటి కాలంలో ఇంకెంత దుర్లభమో కదా,
సద్గురువుని ఎవరికై వారు వెదికితే దొరికేవారు కాదని, మనం చేసే నామ జపం,
పూజలు, గురువుల సచ్ఛరిత్రల పారాయణలు ఫలించి వారికై వారే మనల్ని వారి వద్దకు
రప్పించుకుంటారని శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి సచ్ఛరిత్ర లాంటి
గ్రంధాలెన్నో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
పీతాంబరుని అనుభవం :
------------------------
పీతాంబరుడు నిమ్న జాతివాడు, అత్యంత పేదవాడు. స్వామివార్ని మనస్ఫూర్తిగా
నమ్మి సేవ చేస్తుండేవాడు. పేదవాడు కావడం వల్ల చిరిగిన దుస్తులు ధరించేవాడు,
అయినప్పటికీ తన పేదరికం గురించి విచారించక దేహధ్యాస లేక స్వామివారి సేవకై
నిరంతరం తపించేవాడు. ఒకనాడు స్వామివారికి అతనిపై దయకలిగింది, అతన్ని చూచి
మందహాసం చేస్తూ, "ఒరే పీతాంబరా నీవు ధరించిన వస్త్రంలో చిరుగులు ఎక్కువగా
వున్నాయిరా, ఆ చిరుగుల్లోంచి నీ పార్శ్వభాగం అంతా కనిపిస్తోంది. జీర్ణ
వస్త్రాల్ని విసర్జించాల్సిందే, ఎంచేతంటే అవి దేహాన్ని సంరక్షించలేవు. కనుక
ఈ వస్త్రం ధరించు - ఎవరేమన్నా దీన్ని ధరించే వుండాలి సుమా" అంటూ ఒక
అంగవస్త్రాన్ని అతనివైపు విసిరేసారు. స్వామివారి కృపకి పాత్రుడైనందుకు
అతడెంతగానో సంతోషించి, అప్పటి నుండి స్వామివారు ప్రసాదించిన వస్త్రాన్ని
ధరించసాగాడు. పీతాంబరుడ్ని ఎప్పుడైతే స్వామివారు గుర్తించారో అప్పటి నుండి
అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి, సాటి భక్తులు అతనీవిధంగా స్వామివారిచే
గుర్తించబడటాన్ని సహించలేక సూటిపోటి మాటలతో అతని హృదయం గాయపడేలా
మాట్లాడసాగారు.
భగవంతుడు అక్షయుడని విష్ణుసహస్రనామాల్లో వుంది,
అంటే ఆయన్ని ఎంత మంది పొందినప్పటికి, ఎప్పటికీ తరగిపోనివాడవటం వల్లనే ఆయనకా
పేరు. ఇది తెలియని భక్తులు ఆయన కృపని లౌకికంగా దొరికే వస్తువుగా భావించి,
వాటి సహజ లక్షణమైన తరుగుదలని ఆయనకి ఆపాదించి, తమ తోటి భక్తులకి ఆయన కృప
లభిస్తే ఈర్ష్య, అసూయలు ప్రదర్శిస్తారు. తన బిడ్డలు ఎటువంటి లక్షణాలు
కలిగివున్నప్పటికీ, తనను ఆశ్రయించి వున్నారు కాబట్టి భగవంతుడు వారిలో
దోషాలెంచడు, వారిలో పరివర్తన కోసమే తపిస్తాడు. అందుకే బాబాగారు "
అరిషడ్వార్గలన్నిటిలోకీ అసూయను జయించడం సులువు, అసూయ వల్ల మనకొరిగే లాభమూ
లేదు, ఎదుటవాడికి కలిగే నష్టమూ లేదు. అసూయ అంటే ఎదుటవాడి బాగుని
సహించలేకపోవటమే, ఓర్వలేక అపవాదులు కల్పిస్తాము, వాడు నష్టపోతే
సంతోషిస్తాము. ఇదేమి మంచి? అవతలివాడికి మంచి జరగటం వల్ల మనకేం నష్టం
జరుగుతుందని ఈ అపవాదులు? కానీ ఎవరూ ఈ సంగతి ఆలోచించరు. ఎదుటవాడికి మంచి
జరిగితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా ఆ మేలును మనమూ పొందే
ప్రయత్నం చేద్దాం. వాడు మన సొత్తేమి లాక్కున్నాడు? వాడి పూర్వజన్మ
కర్మననుసరించి ఫలితాన్ని పొందుతాడు" అన్నారు.
పీతాంబరుడు వారి
మాటలకి బదులివ్వక సహించివుండేవాడు. నిజమైన భక్తుడు ప్రతిదానిలోనూ
భగవంతున్ని చూస్తాడు. కార్యమూ, కారణమూ కూడా భగవంతుడే అని తలుస్తాడు. అతని
భక్తిని పరిక్షించడానికే స్వామివారు అతనికా వస్త్రం ప్రసాదించి, ఇతర
భక్తుల్లో ఈసునసూయల్ని రప్పించి, ఎవరేమిటో తెలియజేసారు. దీని గురించే బాబా
గారు "ఎవర్నెవరు కోప్పడ్డా నన్ను చాలా బాధపెట్టినవారౌతారు. ఎవడు ధైర్యంగా ఈ
నిందనూ, దూషణని సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. ఎవడైనా నిన్ను
నిందించినా శిక్షించినా వాడితో పోట్లాడవద్దు, సహించలేకపోతే ఒకటి రెండు
మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు, లేకుంటే నా నామం స్మరిస్తూ ఆ చోటు
విడిచిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తియ్యవద్దు. ఎవరిగురించీ
తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే చలించకు. వాడి మాటలు
నీకేమీ గుచ్చుకోవు కదా! ఇతరులు చేసే పనులకు వారిపైనే ప్రభావం వుంటుంది.
నీవు చేసే పనులకే నీపై ప్రభావముంటుంది. ఇదే ఆనందానికి మార్గం. తక్కిన
ప్రపంచం తలక్రిందులు కానివ్వు, దానిని లక్ష్యపెట్టక ఋజుమార్గంలో వెళ్లు."
అన్నారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత - ఈవిధంగా పీతాంబరుడు సహనంలో ఉన్నత
స్థితి చేరాడని గుర్తించిన స్వామి అతన్ని పిలిచి, "ఒరే నువ్వెక్కడికైనా
దూరంగా పో! కొడుకు పెద్దవాడయ్యాక బిడ్డ తల్లికి దూరంగానే వుండాలి కదా! నీపై
నా కరుణాకటాక్షాలెప్పటికీ ఇలాగే నిలిచివుంటాయి. ఇక్కడినుండి దూరంగా వెళ్లి
శక్తిహీనులకి సాయపడు అన్నారు." గురుదేవుల ఆఙ్ఞని శిరసావహించి, వారినుండి
సెలవు తీసుకున్నాడు పీతాంబరుడు.
అక్కడ నుండి బయలుదేరిన
పీతాంబరుడు, ’కొండోలీ’ గ్రామం వైపుగా బయలుదేరాడు. స్వామివారికి దూరమైనా
అతని దృష్టి ఆయన నుండి విడిపోలేదు. నిరంతరం స్వామివారి నామాన్నే
ఉచ్ఛరిస్తున్నాడు. గ్రామ పొలిమేరలకి చేరుకునే సరికి సాయంత్రమైంది, ఈ సమయంలో
గ్రామంలోకి వెళ్లడం అనుచితం అనుకుని, ఊరి బయటే విశ్రాంతి తీసుకున్నాడు.
ఉదయం ఊరిలోకి ప్రవేశించగానే, మొదట్లోనే అతనికి పశువులకాపర్లు ఎదురయ్యారు.
అతన్ని దొంగగా పొరబడిన పశువులకాపర్లు అతన్ని ఓ చెట్టు క్రింద నిలబెట్టి
విచారించసాగారు. అక్కడ అతన్ని విపరీతంగా చీమలుకుట్టడంతో పశువులకాపర్ల
భయానికి, చీమల బాధకి భయపడి చెట్టెక్కాడు. ఆ చెట్టుపైన కూడా చీమలు కుట్టడంతో
అతను ఆ కొమ్మకీ, ఈ కొమ్మకీ మారసాగాడు, కొమ్మలు ఒకదానికొకటి కాస్త దూరంగా
వున్నప్పటికీ అతను కింద పడటంలేదు. ఇదేదో విచిత్రంలా వుందని తలచిన
గ్రామస్తులు అతన్ని పట్టి గ్రామపెద్ద దగ్గరికి తీసుకెళ్లారు. పీతాంబరుడు
తాను గజాననులవారి శిష్యుడిని అని పరిచయం చేసుకుని జరిగిన వృత్తాంతం అంతా
చెప్పాడు, గ్రామస్తులెవరికి అతని వృత్తాంతం నమ్మశక్యంగా అనిపించలేదు.
గజాననుల వారి శిష్యున్నని చెప్పుకుని దొంగస్వామిగా చెలామణి
అవుదామనుకుంటున్నాడని భావించి, "ఒరే దొంగవెధవా! గజాననులు సాక్షాత్తూ
భగవంతుడే. ఆయన పేరు చెప్పి ఆయన పేరుకి కళంకం ఆపాదించకు" అని ఒకసారి
దీర్ఘంగా అలోచించి " నీవు నిజంగా వారి శిష్యుడివే ఐతే ఈ ఆకులు రాలిన మామిడి
చెట్టుకి ఆకులు వచ్చేలా చెయ్యి - ఒకసారి వారు మామిడికాయలు కాసే కాలం
కాకున్నా మామిడి చెట్టుకి కాయలు కాయించారని విన్నాం" అన్నారు. అది విని
పీతాంబరుడు భయపడిపోయి "మీ పరీక్షకి నిలిచేంత గొప్పవాడిని కాదు నేను,
స్వామివారి శిష్యుల్లో నేను గులకరాయి వంటి వాణ్ని. రాళ్లు, వజ్రాలు భూమి
నుండే లభ్యమౌతాయి కదా. గులక రాళ్ల వల్ల భూమి గొప్పతనమేమైనా తగ్గుతుందా?
నేను వారిని ఆశ్రయించి వున్నానే గానీ వారంత శక్తిసామర్ధ్యాలు నాకు లేవు,
దయతో నన్ను విడిచిపెట్టండి" అని ప్రాధేయపడసాగాడు. దానికి ఆ గ్రామ పెద్ద
"నిరుపయోగమైన మాటలు మాట్టాడకు! శిష్యులు ఆపదలో వున్నప్పుడు, గురువును
మనస్ఫూర్తిగా స్మరిస్తే. శిష్యుడు యోగ్యుడుకాకపోయినా గురువులు అతన్ని
రక్షిస్తారు - నీవు శిష్యుడిని అంటున్నావు కాబట్టి వారి శక్తిసామర్ధ్యాలు
నిరూపించాల్సిందే, లేదంటే ఇక్కడ నుండి కదల్లేవు" అని హెచ్చరించారు.
ఇక చేసేదేమీ లేక పీతాంబరుడు గురుమూర్తిని ధ్యానించి, వారిని ఇలా
ప్రార్ధించాడు, "హే స్వామీ! సమర్ధ గజాననా! నారాయణా! పతితులని రక్షించేవాడా!
నా వలన నీ సచ్ఛరితకు కళంకం రాకూడదు! ఈ మామిడి చెట్టుకు ఆకులు వచ్చేలా చేసి
నీవు అంతటా వున్నావని నిరూపించు. భగవంతుడు తానొక రూపం ధరించవల్సినప్పుడు
మీలాటి యోగుల ద్వారానే కదా ప్రకటమవుతాడు. యోగులు సర్వాంతర్యాములు కదా, నా
అంతరంగంలో వున్న నీకు నా బాధ వినపించదా ప్రభూ. ఈ దీనున్ని సంకటస్థితి నుండి
కాపాడు" అని గజాననుల వారి నామాన్ని బిగ్గరగా ఉచ్ఛరించసాగాడు. అతని భక్తిలో
తీవ్రతని గమనించిన గ్రామస్తులు కూడా అతనితో శ్రుతి కలిపారు. గజాననుల వారి
నామం మారుమోగుతుండగా మోడుబారిన చెట్టు క్రమంగా చిగురించి, ఆకులు పెద్దవి
అయి, చెట్టు పచ్చదనంతో కళకళలాడసాగింది. భగవంతుని శక్తిని నిరూపించగలవాడే
నిజమైన భక్తుడు అని గ్రహించిన గ్రామస్తులు, పీతాంబరుణ్ని క్షమాపణలు కోరి,
అతన్ని ఎంతో గౌరవమర్యాదలతో ఆతిధ్యం ఇచ్చి, సత్కరించారు. భగవంతుని లీలలు
అతర్క్యములు - వాటిని అనుభవించవలసిందే కానీ, తర్కించకూడదు.
** ఎండిపోయిన మేడిచెట్టుని చిగురింపచేసిన లీల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో నరహరిశర్మ వృత్తాంతంలో వస్తుంది.
నిర్యాణం :
----------
గజానన మహరాజు తన ప్రియభక్తుడు పాటిల్తో కలిసి ఆషాఢమాసంలో పండరిపుర యాత్ర
చేసారు. చంద్రభాగా నదిలో స్నానం చేసి స్వామి పాండురంగని దర్శనార్ధం
మందిరంలోకి వెళ్లారు. పండరినాధుని దర్శనం చేసుకుని స్వామి ఇలా
ప్రార్ధించారు, "హే పండరినాధా! అద్వయ! సమర్ధ! భక్త వత్సలా! రుక్మిణీ వరా!
నీ ఆనతి ప్రకారం ఈ భూమిపై భ్రమించి శ్రద్ధా, భక్తులున్న భక్తుల
మనోభావాలన్నింటినీ పూర్తిచేసాను. హే పుండరీక వరదా! విఠ్ఠలా! నా అవతారకార్యం
పూర్తయిందని నీకు తెలుసుకదా! ఇంక నేను నిజధామాన్ని చేరడానికి అనుఙ్ఞ
ఇవ్వు. హే భగవాన్! భాద్రపద మాసానికల్లా వైకుంఠంలో నీ చరణ సన్నిధిని చేరాలని
కోరుకుంటున్నాను." అని ప్రార్ధించి చేతులు జోడించారు, వారి నేత్రాలు
అశ్రుపూరితాలయ్యాయి. అది చూచిన పాటిల్ కంగారుపడుతూ "స్వామి నా సేవలో
ఎటువంటి లోపమూ జరుగలేదు కదా! ఎందుకీ కన్నీరు." అని అడిగాడు. స్వామి పాటిల్
చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ "దీని అంతరార్ధం నీకు తెలియదు. ఇక నా
సహవాసం కొద్ది రోజులని మాత్రం తెలుసుకో! పద శేగాఁవ్ వెళ్దాం, నీ వంశానికి
నా రక్ష ఎప్పటికీ వుంటుంది." అన్నారు. శేగాఁవ్ తిరిగి వచ్చాక పాటిల్ తన
మిత్రులందరికీ స్వామి తన అవతారాన్ని సమాప్తి చేయబోతున్నట్లుగా సంకేతం
ఇచ్చారని తెలియజేసి ఎంతో బాధపడసాగాడు.
భాద్రపద మాసం వచ్చింది.
వినాయక చవితి రోజు స్వామి భక్తులతో " గణపతి విసర్జనానికి అందరూ మఠానికే
రండి!", "గణేష చతుర్ధినాడు పార్ధివ గణపతిని తయారుచేసి దాన్ని పూజించాలి,
నైవేద్యం మొదలైనవి సమర్పించాలి. దాని తర్వాత రెండవనాడు దాన్ని నిమజ్జనం
చేయాలి అని గణేశ పురాణంలో రాసి వుంది." అని తన వైపు చూపిస్తూ "అదే రోజు ఈ
శరీరాన్ని కూడా ఉత్సాహంతో నిమజ్జనం చేయండి!. కొంచెం కూడా శోకం దుఃఖం
కలగకూడదు సుమా! మీ రక్షణ కోసం నా అస్తిత్వాన్ని ఇక్కడే మరగుపరిచి
వుంచుతాను. భక్తుల్ని మరచిపోయే ప్రశ్నే వుండదు. జీర్ణవస్త్రాన్ని
మార్చినట్లుగా సరైన సమయంలో ఈ శరీరాన్ని మార్చాల్సి వుంటుంది. ఇదే
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునికి బోధించినది! బ్రహ్మవేత్తలైన వారంతా
ఇలానే చేశారు. ఈ విషయాలను ఎప్పటికీ మరువకండి." అని ఉపదేశించారు. ఆ తర్వాత
బాళాభావూ చేతిని పట్టుకుని ఆసనంపై కూర్చుండబట్టి, "నేను వెళ్లిపోయానని
అనుకోకు, భక్తిలో ఏ లోపమూ రానీయకు, నన్నెప్పుడూ మరువకు. ఎందుకంటే
నేనెప్పుడూ ఇక్కడే వుంటాను." అని ఉపదేశించి స్వామి తన శ్వాసని యోగ
సామర్ధ్యంతో బంధించి, సచ్చిదానంద స్వరూపంలో విలీనమైపోయారు. శరీర చలనం
ఆగిపోయింది. స్వామి తన శరీరాన్ని విడిచారని భక్తులకు అర్ధం కాగానే గుండెలు
బాదుకుంటూ ఆక్రోశించారు. డోణగాంవ్కి చెందిన గోవిందశాస్త్రి ఆ రోజే సమాధి
చేయాలన్న కొందరిని వారించి, వారి భక్తులందరూ వచ్చే వరకూ వారి శరీరం జీవించి
వున్న వారి శరీరంలాగే వుంటుంది అని చెప్పి, ఆ మాట నిరూపించడానికి వెన్నపూస
తెప్పించి స్వామివారి నుదుటిపై పెట్టాడు. ఆయన నుదుటిపైన పెట్టగానే
ఆశ్చర్యకరంగా వెన్నపూస కరిగిపోయింది. ఈ విధంగా స్వామివారి శక్తిని
గ్రహించిన తర్వాత భక్తులందరూ స్వామి వార్ని దర్శించుకునే వరకూ వుంచి ఆ
తర్వాతే ఆయన శరీరాన్ని సమాధి చేశారు. ఆయన సమాధి చెందిన సంII సెప్టెంబరు 8,
1910.
**గజానన మహరాజు సమాధి చెందిన రోజు శ్రీ సాయి బాబా, మసీదులో
ఆయన కూర్చున్న చోటు నుండీ లేచి పక్కకి వచ్చి నేలపై పడుకుని తన చేతుల్ని
శంఖువులా చేసి ఊదారు. వారి చర్యకి కారణం ఏమిటని అడిగిన భక్తునికి "ఈ రోజు
నా సోదరుడు గజానన్ భగవంతునిలో ఐక్యమయ్యాడు" అన్నారు.
శ్రీ తాజుద్దీన్ బాబా అవతారం :
------------------------------------

తాజుద్దీన్ బాబా గారి పూర్వీకులు అరబ్బుదేశం వారు. అరేబియా నుండి వలస
వచ్చి వీరు మద్రాసులో స్థిరపడ్డారు. వీరి తండ్ర్రిగారి పేరు సయ్యద్
బద్రుద్దీన్, వీరు భారత సైన్యంలో సుబేదారుగా చేశారు, తల్లిగారు మీరాబీ.
బాబావారు జనవరి 27, 1861వ సంవత్సరం గురువారం ఉదయం 5 గం. 15 ని.లకు
కాంప్టీ(నాగపూర్)లో జన్మించారు. బాబాగారు పుట్టగానే అందరు పిల్లల్లా
ఏడవకపోవడంతో వారి కణతలపై, ముఖంపై కాల్చారు, ఆ కాల్చిన ముద్రలు వారి ముఖం
మీద శాశ్వతంగా వుండిపోయాయి. బాబాగారు పుట్టిన సంవత్సరానికి వీరి
తండ్రిగారు, 9 సంవత్సరాలకి వీరి తల్లిగారు మరణించారు. అప్పటినుండి బాబాగారు
వారి అమ్మమ్మగారి సంరక్షణలో పెరిగారు. వీరికి 18వ ఏడు వచ్చే వరకు వీరు
అరబ్బీ, పార్శీ, ఇంగ్లీషు భాషలు నేర్చుకున్నారు.
బాల్యం :
--------
తాజుద్దీన్ బాబాగారికి 6 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన పాఠశాలలో వుండగా
ఒకనాడు ఆ ఊళ్లో ప్రఖ్యాతిగాంచిన ముస్లీం మహాత్ముడు హజరత్ అబ్దుల్లా షా
గారు, తాజుద్దీన్ బాబాగారిని చూడటానికి వచ్చారు. ఆ మహాత్ముడు బాల
తాజుద్దీన్ వైపు దృష్టి నిగిడ్చి, తన దగ్గరున్న సంచీలోంచి కొంత మిఠాయి తీసి
తాను కొంత చప్పరించి, కొంత బాలుని నోట్లో వేసారు. తర్వాత పక్కనే వున్న
ఉపాధ్యాయునితో "ఇతనికి మీరేం బోధించగలరు? క్రిందటి జన్మలలోనే ఇతడు
నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాడు." అన్నారు. తర్వాత బాలునితో "మితంగా
తిను, మితంగా నిద్రించు, మితంగా సంభాషించు. ఖురాన్ చదివేప్పుడు ’మహమ్మదుల
వారే’ నీలో ఉండి చదువుతున్నట్లు భావించు" అని చెప్పి వెళ్లారు. ఈ
అసామాన్యమైన సంఘటన బాలునిగా వున్న తాజుద్దీన్ గారిలో అద్భుతమైన మార్పు
తెచ్చింది. వారి కళ్ల వెంట సంతత ధారగా మూడురోజుల పాటు కన్నీళ్లు కారాయి. ఆ
తర్వాత నుండీ వారికి ఆటపాటలపై విముఖత కలిగింది. ఒంటరిగా కూర్చుని గొప్ప
సూఫీ మహాత్ములు రచించిన గ్రంధాలు చదువుతూ, సత్యాన్ని చేరడంలో వారు
అన్వేషించిన నవీన విధానాల పట్ల ఆకర్షితులయ్యారు. ఇలా ఆయన చదివిన
గ్రంధాలన్నిటిలోకీ ఒక మహాత్ముడు రచించిన ద్విపద ఆయన హృదయాన్ని
హత్తుకుపోయింది. అదేమిటంటే -
"సారాయి త్రాగు, ఖురాను, కాబాను తగులబెట్టు, కావాలంటే దేవాలయంలో నివశించు, కానీ ఏ మానవుని మనస్సునూ గాయపరచకు!"
’సారాయి తాగు’ అంటే ’భక్తి పారవశ్యం చెందు’ అని అర్ధం, ’ఖురాన్’ అంటే
పుస్తక ఙ్ఞానం కాదు, ప్రత్యక్ష అనుభవం సాధించు అని. పవిత్రమైన కాబా అంటే
నల్లని రాతితో నిర్మించబడిన మందిరం ఎంత మాత్రం కాదు ’ప్రతి హృదయంలోనూ
భగవంతుడు నివసించే పవిత్ర స్థలం అని. ’దేవాలయంలో నివసించు’ అంటే ’ఎవరి
నమ్మకాలను, ఆచారాలను వారిని పట్టించుకోనివ్వు - నీవు మాత్రం సత్యాన్ని అంటి
పెట్టుకో' అని అర్ధం.
సంకేత భాషని వుపయోగించడం వల్ల మహాత్ముల
మాటలు భావగర్భితంగా వుంటాయి. లౌకిక దృష్టితో వాటిని అర్ధం చేసుకోవటానికి
ప్రయత్నించడం ఎలాంటిదంటే "తొక్కని తిని, పండుని పారేయడంలాంటిది." భాగవతంలో
ఎన్నో కథల్లో భావగర్భితమైన అర్ధాలున్నాయి, సూటిగా విషయాన్ని చెప్పకుండా
లోతైన అర్ధం వుండేలా కథలెందుకు చెప్తారు మహాత్మా అని విదురుడు, మైత్రేయ
మహర్షిని అడిగినప్పుడు - "విశ్వమానసుడైన భగవంతుడు భావప్రియుడు, ఏ భావంతో
నిండిన మనసుకు ఆ అనుభవాన్నిస్తాడు, భావన మారితే ప్రపంచాన్ని చూచే దృష్టే
మారిపోతుంది" అన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సాయి బాబా ఒక భక్తునితో
"ఎద్దులకి ఙ్ఞానం రాదు" అన్నారు. ఏసు ప్రభువుని ఆయన శిష్యుడొకడు "మీరు
ఉపమానాలతో ఎందుకు బోధిస్తారని?" అడిగినప్పుడు ఆయన - "భగవంతుడు తనని
గ్రహించే శక్తిని సంపాదించినవాడికి రెట్టింపు ఇస్తాడు, లేని వాళ్ల దగ్గర
నుండి వున్నది కూడా తీసేస్తాడు" అన్నారు.
**లోతుని చూడాలంటే
లోపలికి వెళ్లే ఆసక్తి కావాలి. ఆసక్తితో నిండిన మనసు విషయానికి
హత్తుకుపోతుంది, మనసు ఏకాగ్రమైనప్పుడు బుద్ధి వికసిస్తుంది, అలాటి బుద్ధి
సూక్షమైన విషయాలను గ్రహిస్తుంది, అలాంటి హృదయంలోనే ఙ్ఞానం ఉదయిస్తుంది.
అందుకే ఏ మత గ్రంధంలో చూచినా పరోక్ష విధానంలో సత్యాన్ని బోధించే కథలుండటం
గమనించవచ్చు. కేవలం కథలను వినడం వల్లో, విన్న వాటిని వల్లె వేయడం వల్లో ఏమి
తెలుస్తుంది? కథలు వినాలి, వాటిలో చెప్పిన లోతైన అర్ధాలు తెలుసుకునే
ప్రయత్నం చేయాలి (సత్సంగం). సంకటస్థితి ఎదురైనప్పుడు ఈ స్థితి ఏ కథలోనిదో
ఙ్ఞప్తికి తెచ్చుకొని ఆ బోధనకి అనుగుణంగా ప్రవర్తన మలచుకోచాలి.
ధర్మమార్గంలో నడవడం వల్ల ఇలాటి అనుభవాలు క్రమంగా పోగుపడి మనలో ఒక దివ్యమైన
భావం జీవం పోసుకుంటుంది. ఆ దివ్యమైన భావన మనసులో సృజింపబడ్డాక నామాన్ని
స్మరించిన ప్రతిసారి లోపలున్న చైతన్యం ఉద్దీపన పొందుతుంది. క్రమంగా దేహ
భావన అంతరించిపోతుంది. భగవంతుని చూడాలనే ఆరాటం ఎక్కువవుతుంది, ఆయన్ని చేరడం
కోసం దేహంతో సహా సర్వం త్యజించాలనే స్థితికి చేరుకోవడమే భక్తి. విని
జీర్ణించుకోవాలి అప్పుడే ఒంటబడుతుంది. అందుకే సాయిబాబా శ్రవణ, మనన, నిధి
ధ్యాసలు అవసరం అని చెప్పారు.
సైన్యంలో ఉద్యోగం - ఆధ్యాత్మిక సాధన :
-------------------------------------
తాజుద్దీన్ బాబాగారి మామగారు ఆర్ధికంగా నష్టపోవడంతో కుటుంబం గడవటం కోసం
తాజుద్దీన్ బాబా తన 20 వ ఏట (1881 వ సంII) నాగపూర్లో 13వ రెజిమెంట్లో
సైనికుడిగా చేరారు. ఆయన సైన్యంలో పనిచేస్తుండగా విధి నిర్వహణలో భాగంగా దేశం
నలుమూలలా, ఫ్రాన్స్ తదితర దేశాలెన్నో పర్యటించారు. విధి నిర్వహణలో తీరిక
లేకుండా వున్నప్పటికీ వారు మతపరమైన విధులని ఏనాడూ అశ్రద్ధ చేయలేదు.
సవ్గర్ అనే ప్రదేశంలో వుండేప్పుడు వారికి ఒకనాడు అద్భుతమైన కంఠధ్వని
వినిపించింది, ధ్వనికి ఆకర్షితుడై అది వినిపించిన వైపుగా వెళ్లగా, ఊరి చివర
హజరత్ దావూద్ షా అనే సూఫీ మహాత్ముని నివాసం దగ్గరికి చేరుకున్నారు. అప్పటి
నుండి ఆయన ప్రతిరోజు విధి నిర్వహణ పూర్తికాగానే ఆ మహాత్ముని దగ్గరకు
వెళ్లి ఆయన్ని సేవించుకొనేవారు. ఆయన దగ్గరే కూర్చుని వీలైనంత ఎక్కువ సేపు
ధ్యానంలో గడిపేవారు. రాత్రుళ్లు కూడా ఆయన సైనిక గుడారంలో నిద్రించడం లేదని
తెలిసిన వారి బామ్మగారు ఒకరోజు తాజుద్దీన్ గారిని వెంబడిస్తూ వెళ్లి ఆయన
ధ్యానం చేస్తుండం చూచి దైవ చింతనలో వున్నాడని గ్రహించి సంతోషించింది.
దావూద్ చిస్తీ గారు సమాధి చెందిన తర్వాత కూడా తాజుద్దీన్ బాబా గారు ఆయన
సమాధి వద్దనే వుండి ఆధ్యాత్మిక సాధనలు చేసేవారు. ఈ సాధనలకి ఉద్యోగం పెద్ద
అవరోధంగా వుందని తలచి, స్వచ్ఛందంగా ఉద్యోగం నుండి నిష్క్రమించారు.
తాజుద్దీన్ గారిని మహాత్ముడుగా చూడక ముందే వారి బామ్మగారు మరణించారు.
తాజుద్దీన్ గారు క్రమంగా అధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కొద్దీ
ఆయనకి లౌకిక ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ వచ్చాయి, ఆయన స్థితి సామాన్యులకి
అర్ధం కాక ఆయన చర్యల్ని పిచ్చి చేష్ఠలుగా భావించేవారు. బంధువులు కూడా బాబా
గారిని దూరంగా వుంచసాగారు. ఆయన పాడుబడిన ఇండ్లలోను, వంతెల కింద ఏకాంతంగా
ఉండేవారు, దేహధ్యాస లేక పూర్తి దిగంబరునిగా సంచరించేవారు. ఇలా వున్న సమయంలో
వీరి అవతారం ప్రకటమయ్యే సమయం రావడంతో క్రమంగా ప్రజలు వీరికి ఆకర్షితులవడం
జరిగింది. ఆయన కృపకి పాత్రులైన వారి కోరికలు తీరడంతో పిచ్చి తాజుద్దీన్
కాస్తా తాజుద్దీన్ బాబా అయ్యారు. బాబాగారి మహిమలు విని ఎంతో మంది వారిని
ఆశ్రయించసాగారు, వారిలో ఎక్కువ మంది తాము మోయలేని భారాలను ఆయనపై వేసే వారు
కాక, ఆయాచితంగా లభించే వాటిని, అర్ధరహితమైన వాటిని కోరుకునేవారే ఎక్కువ.
దాంతో విసిగిపోయిన భగవంతుడు నిజమైన భక్తులకు మాత్రమే అందుబాటులో వుండాలని
నిర్ణయించుకుని రేపు నేను పిచ్చాసుపత్రికి వెళ్తాను అన్నారు.
పిచ్చాసుపత్రి :
--------------
దిగంబరిలా సంచరించే బాబాగారు తాను పిచ్చాసుపత్రికి వెళ్తానన్న మరిసటిరోజు,
ఆంగ్ల స్త్రీలు టెన్నిస్ ఆడే మైదానానికి వెళ్లి వారి ముందు నగ్నంగా
నిలబడ్డారు. ఆయన ప్రవర్తనకి రెచ్చిపోయిన ఆంగ్ల స్త్రీలు ఆయనపై పోలీసులకు
ఫిర్యాదు చేసారు. పోలీసువారు ఆయన్ని తీసుకెళ్లి నాగపూరు పిచ్చాసుపత్రిలో
జేర్చారు. పిచ్చాసుపత్రిలో ఆయన్ని బంధించినప్పటికీ మరుసటి దినమే తన పై
ఫిర్యాదు చేసిన ఆంగ్ల స్త్రీలకి స్వేచ్ఛగా రోడ్లపై విహరిస్తూ కనిపించారు.
తమ ఫిర్యాదుకి పోలీసులు విలువ ఇవ్వలేదని భావించిన ఆ స్త్రీలు పోలీసులని
నిలదీశారు. ఆయన బయట కనిపించడానికి అవకాశమే లేదని చెప్పి, స్వయంగా
పోలీసువారే ఆ స్త్రీలని బాబాగారిని నిర్భందించిన గదికి తీసుకువెళ్లి
చూపించారు. అక్కడ ఆయన నిర్భందంలో ఉండటం చూచిన వారి ఆశ్చర్యానికి అంతులేదు,
ఇక చేసేది లేక వారు వెనుదిరిగారు.
ఆ పిచ్చాసుపత్రికి ముఖ్య
డాక్టరుగా అబ్దుల్ మజీద్ వుండేవాడు. ఒకనాడు విధి నిర్వహణలో భాగంగా
ఆసుపత్రిని పర్యవేక్షిస్తున్న అతనికి బాబాగారు వరండాలో తిరుగుతూ
కనిపించారు. బాబా గారి మహిమ గురించి తెలియని అతడు వెంటనే రోగులను గదిలో
పెట్టి తాళాలు వేసే ఉద్యోగి దగ్గరికి వెళ్లి బాబా గారిని అలా బయటకి
వదిలినందుకు నిందించాడు. ఆ ఉద్యోగి మజీద్ని వెంటబెట్టుకుని వెళ్లి
బాబాగారిని నిర్భందించిన గదికి తీసుకెళ్లి చూపాడు. బాబాగారుండే గదికి తాళం
వేసివుంది, ఆయన లోపల కూర్చుని వున్నారు, ఇలా ఒకేసారి రెండు చోట్లా
కనిపించిన ఇతను మామూలు వ్యక్తి కాదని అతనికి అర్ధమైంది. ఇక అప్పటి నుండి
వారి మహిమలు అతనికి అనుభవానికి రావడంతో బాబా గారికి గొప్ప భక్తుడయ్యాడు.
బాబాగారు ఇతనికి ఎన్నో నిదర్శనాలు చూపారు.
ఒకరోజు ఆ ఆసుపత్రిలో ఒక
పిచ్చివాడు తప్పించుకుని పారిపోయాడు. ఎంత వెదికినా దొరకలేదు, దాంతో
ఆసుపత్రికి తాను అధికారి కావడం వల్ల మజీద్ ఎంతో ఆందోళన పడసాగాడు. అప్పుడు
బాబాగారు అతని దగ్గరికి వచ్చి "బాబు నువ్వేమీ కంగారు పడకు, రేపు
ఉదయానికల్లా ఆ రోగి తనంతట తానే ఇక్కడకి వస్తాడు" అన్నారు. మరుసటి రోజు ఉదయం
బాబాగారు చెప్పినట్లుగానే ఆ రోగి ఆసుపత్రి గేటు దగ్గర తచ్చాడుతుంటే
కాపలావారు అతన్ని పట్టుకున్నారు. తప్పించుకుని ఎక్కడిపోయావని అతన్ని
వైద్యులు విచారించానిపుడు, తాజుద్దీన్ బాబా తనకి కనిపించి తీసుకువచ్చి గేటు
దగ్గర విడిచారని చెప్పాడు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతను
తప్పించుకుని పారిపోయి, తిరిగి దొరికినంత వరకూ బాబా గారు తన గది దాటి బయటకే
వెళ్లలేదు. ఈ అపూర్వమైన సంఘటన డాక్టరు మజీద్కు బాబా గారిపై ధృడమైన
భక్తి,శ్రద్ధలు ఏర్పడేలా చేసింది.
డాక్టర్ మజీద్ ఒకరోజు బొంబాయి
వెళ్తూ బాబాగారిని ఆశీర్వదించమని అడిగాడు, బాబాగారు మౌనంగా ఊరుకున్నారు.
ఆయన మౌనాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలియని మజీద్ ఆయన్ని
పీడించసాగాడు. చివరకు విసిగిపోయిన బాబాగారు "నా మాట లక్ష్య పెట్టకుండా
నువ్వు వెళ్లేట్లయితే వెళ్లు, కానీ ఈ ఆకుని భద్రంగా వుంచుకో" అని అక్కడే
క్రింద పడి వున్న చిన్న ఆకునిచ్చారు. డాక్టర్ ఆ ఆకుని భద్రంగా జేబులో
దాచుకుని బొంబాయి ప్రయాణమయ్యాడు. ’భూసావల్’ స్టేషన్ రాగానే రైలు దిగి,
స్టేషన్ అవతల వైపు వెళ్లడానికి పట్టాలు మీద నడవసాగాడు. అతను పట్టాల మీద
వుండగా హఠాత్తుగా ఒక రైలు ఆ పట్టాల మీదకే వచ్చింది. అతను తప్పించుకోవడానికి
ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో, అందరు అతను చనిపోయింవుంటాడనే అనుకున్నారు.
కానీ ఇంజను వచ్చి డాక్టరు గుద్దుకోబోయే సమయంలో అతను స్పృహ తప్పి పడిపోయాడు,
అతని సమీపంలోకి వచ్చి ఇంజను నిలిచిపోయింది. తాము ఆపకుండానే ఇంజను ఎలా
ఆగిపోయిందా అని ఇంజను డ్రైవరు, బొగ్గు వేసేవాడు దిగివచ్చి చూచారు. బ్రేకులు
వేయకుండా ఇంజను ఆగిపోవడం, మజీద్ స్పృహ తప్పినా సురక్షితంగా వుండటం చూచిన
వారందరూ అతను గొప్ప మహాత్ముడై వుంటాడని తలచి ఆయన చూపిన మహిమను
కీర్తించసాగారు. అప్పుడు మజీద్ తాను తాజుద్దీన్ బాబాగారి భక్తుడినని జరిగిన
వృత్తాంతం చెప్పి ఆయన ప్రసాదించిన ఆకుని చూపించాడు. ఇదంతా ఆయన మహిమే అని
తాను నిమిత్త మాత్రుడినని చెప్పాడు.
**మహాత్ముల దర్శనానికి
వెళ్లినప్పుడు వారి అనుమతితోనే తిరిగి వెళ్లాలి. వారు మౌనంగా వున్నప్పుడు
వారి అనుమతి లభించలేదని తలచి వారి సన్నిధిలోనే వుండాపోవాలి తప్ప మనకి మనమే
నిర్ణయాలు తీసుకోకూడదు. ఏవైనా దుర్ఘటనలు జరిగే అవకాశం వున్నప్పుడే భక్తులు
తిరిగి వెళ్లడానికి మహాత్ములు అనుమతించరు. శిరిడీ సాయి బాబా చరిత్రలో వారి
మాట వినకుండా వెళ్లి ప్రమాదానికి గురైన సంఘటనలెన్నో వున్నాయి.
కాజీ అనుభవం :
----------------
ఉత్తరప్రదేశ్లో 'నజీనా' అనే పట్టణంలో 'అహమ్మద్ అలీ షా' అనే కాజీ
నివసించేవాడు. వివాదగ్రస్థమైన స్థలాలను వేలం వేసే అధికారిగా అతను పని
చేసేవాడు. జీతం తక్కువ కావడం వల్ల అతను నిర్భయంగా లంచం పుచ్చుకునే వాడు.
కొంత కాలానికి అతనికి వేరే ఊరికి బదిలి అయింది. అక్కడ అతను రాసిన ప్రభుత్వ
ఖాతాలలో 14 రూపాయల తేడాను పై అధికార్లు పట్టుకుని ప్రభుత్వపు డబ్బు
సంగ్రహించినందుకుగానూ అలిషా పై చర్య తీసుకున్నారు. శిక్ష నుండి
తప్పించుకోడానికి అతను పై అధికారుల ప్రాపకానికి ఎంతో ధనం వెచ్చించాడు,
అయినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన అలీషా దైవం తప్ప తనకు మరొకరు
దిక్కులేరని తలచి సాధు, సత్పురుషుల ఆశీర్వచనాల కోసం దేశమంతా తిరిగాడు.
అప్పటికీ ఫలితం లేకపోవడంతో వ్యధ చెందసాగాడు, అప్పుడతనికి ఎవరో తాజుద్దీన్
బాబా గార్ని కలవమని సలహా ఇచ్చారు. సరైన సమయం చూచుకుని అతను నాగపూర్ చేరి
తాజుద్దీన్ బాబా గార్ని దర్శించుకున్నాడు. అతన్ని చూస్తూనే బాబా గారు
"ఉండిపో" అన్నారు. బాబా గారి ఆఙ్ఞ మీరకుండా అతను నాగపూర్లో ఐదురోజులు
వుండిపోయాడు, ఐదో రోజు మళ్లీ బాబాగారి దర్శనానికి వెళ్లగానే మళ్లీ బాబా
గారు "ఉండిపో" అన్నారు. క్రమంగా బాబా గారిపై అతనికి భక్తి, శ్రద్ధలు
ఏర్పడ్డాయి. కొద్దికాలం తర్వాత అతన్ని ఇంటికి చేరడానికి అనుమతినిస్తూ
అతనితో "నేను నీతోనే వున్నాను" అని అభయమిచ్చారు.
చాలా రోజులుగా
ఇల్లు విడిచి తిరుగుతున్నందు వల్ల ఎటువంటి వార్తలు వినవలసి వస్తుందో అనే
సంకోచంతో అతను ఇల్లు చేరాడు. తలుపు తట్టగానే ఇంట్లోవారు తలుపు తీసారు, చాలా
రోజుల తర్వాత అతన్ని చూస్తున్నప్పటికీ ఎవ్వరూ కుటుంబసభ్యులెవరూ
ఆశ్చర్యాన్ని కనబరచలేదు. తనొచ్చిన టాంగావారికి డబ్బు చెల్లించమనే సరికి
అమె, "రోజూ ఇవాళ తెస్తాను, రేపు తెస్తానంటూ ఎగగొడుతున్న నా చెవిరింగులు
యివ్వాళైనా తెచ్చావా, లేదా?" అని పేచీ పెట్టుకు కూర్చుంది. ఆమె మాటల ధోరణి
అతన్ని దిగ్భ్రాంతుడిని చేసింది. తాను సంవత్సరం క్రితం ఇల్లు విడిచి సాధు,
సంతుల సేవలో గడిపి ఇప్పుడే వచ్చానని ఎంతగా చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదు.
ఎంచేతనంటే రోజూ ఆ కాజీ ఉదయమే బయటకు వెళ్లి, రాత్రి అయ్యే సరికి ఇంటికి
తిరిగి రావడం అందరూ చూస్తూనే వున్నారు. మాటల సందర్భంలో అతనిపై ప్రభుత్వం
పెట్టిన కేసులన్నీ అతనికి అనుకూలంగానే వచ్చాయనే విషయం తెలిసే సరికి కాజీకి
నమ్మశక్యంగాక తాను పని చేసే కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కూడా ఎవరూ
అతన్ని ఎంతో కాలం కనిపించకుండా పోయి, తిరిగి వచ్చిన వ్యక్తిగా చూడకుండా
రోజూ కలుస్తున్నట్టే పలకరించారు. అతని పై అధికారి అతన్ని పిలిపించి, అతనిపై
దావా వేసి అతని మనసు కలతపడేలా చేసినందుకు సంతాపం వెలిబుచ్చాడు గానీ,
ఇంతకాలం ఆఫీసుకు రాలేదంటని అడగలేదు. దాంతో అతనికి అనుమానం వచ్చి హాజరు
పుస్తకాన్ని తెరిచి చూచాడు, అందులో అతను ప్రతి రోజూ హాజరవుతున్నట్టు నమోదు
చేయబడి వుంది. అప్పుడతనికి బాబా గారు "నేను నీతోనే వున్నాను" అన్న మాట
చటుక్కున స్ఫురించింది. తాజుద్దీన్ బాబా గారు తన రూపం ధరించి కోర్టులూ,
ఆఫీసుకూ సంవత్సరకాలంగా తిరిగారనే అద్భుత మహిమను గుర్తించి, తన పట్ల ఇంత
ఆదరణ చూపించినందుకు బాబాగారిని స్వయంగా కలిసి కృతఙ్ఞతలను తెలియజేయాలని
నాగపూర్ బయలుదేరాడు.
మార్గమధ్యంలో ఢిల్లీ స్టేషన్లో అతను రైలు
మారవలసి వుంది. అక్కడ కుక్కతో పాటు ఒక అపరిచిత వ్యక్తి కాజీని అనుసరిస్తూ
అతని పక్కనే అనుసరిస్తూ నడవనాడంభించాడు. అప్పుడు టికెట్ కలెక్టర్ అలీషా
పక్కనే నడుస్తున్న వ్యక్తిని టికెట్ చూపించమని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి
తాను, తన కుక్క కాజీతో పాటే వచ్చామని, తమ టికెట్ కాజీ దగ్గరుందని చెప్పి
స్టేషన్ బయటకెళ్లాడు. టి.సి కాజీని అపరిచిత వ్యక్తి టికెట్ గురించి అడగ్గా,
ఆ అపరిచితునితో తనకెట్టి సంబంధమూ లేదని చెప్పి స్టేషన్ బయటకు వచ్చి చూడగా
అక్కడ ఆ కుక్కగానీ, అపరిచిత వ్యక్తి గానీ కనిపించలేదు, దాంతో పీడ
వదిలిపోయిందని! తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత నాగపూర్ వెళ్లి
తాజుద్దీన్ బాబా గారిని చూస్తూనే గౌరవపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసాడు.
అతనిని చూచి బాబా గారు పెద్దగా నవ్వుతూ, "నేను నీతోనే వుంటానని నీకు
చెప్పలేదా? ఢిల్లీ రైల్వే స్టేషన్లో నువ్వు నా మాటలు మరిచి, మన సంబంధాన్ని
తెంచేశావు" అన్నారు. ఢిల్లీ స్టేషన్లో తనకు తారసిల్లిన అపరిచితుడు, కుక్క
సాక్షాత్తూ బాబాయేనని గుర్తించిన అలీషా దిగ్భ్రాంతుడయ్యాడు - "అరెరే!
నేనెంత మూర్ఖంగా బాబా గారిని తిరస్కరించాను!" అనుకున్నాడు. ఈ భావన మనసులో
మెదలగానే అతని హృదయం ద్రవించి కళ్ల నీళ్ల పర్యంతమై బాబాను క్షమాపణ వేడాడు.
అప్పుడు బాబా అతని ఊరడించి చిఱునవ్వుతో ఆశీర్వదించి పంపారు. తరవాత ఒక
మద్రాసు బ్రాహ్మణునికి కూడా బాబాగారు ఇదే అనుభవాన్ని ప్రసాదించారు.
గంగాబాయి అనుభవం :
-----------------------
గంగాబాయి అనే హరిజన స్త్రీ పేదరాలు. తాజుద్దీన్ ప్రభువు దర్బార్లో జాతి,
కుల, మత, పేద - ధనిక బేధాలు లేవని ఆయన అందరిని సమంగా ఆదరిస్తారని విని
ఆయన్ని దర్శించుకోవాలని కాలి నడకన బయలుదేరింది. మహాత్ముల దగ్గరికి
వెళ్లేప్పుడు ఒఠ్ఠి చేతులతో వెళ్లకూడదని, వారికి నైవేద్యం అర్పించడానికి తన
దగ్గరున్న వస్తువులతో ఏదో వంటకాన్ని తయారుచేసి పట్టుకెళ్లింది. అప్పుడు
తాజుద్దీన్ బాబా గారు రఘోజీరావు అనే రాజు భవనంలో వుంటున్నారు. వారిని
దర్శించుకోవాలని రాజు గారి భవనం సమీపించగానే ధనికులు సమకూర్చిన వైభవాల
మధ్యన వున్న బాబా గారికి తన పేద వంటకాన్ని నైవేద్యంగా అర్పించడానికి
మనసొప్పక తన సంకల్పం విరమించుకుంది. అప్పటి సాంఘీక కట్టుబాట్ల దృష్ట్యా
అస్పృశ్యులు రాజభవనంలోకి ప్రవేశించి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తే
ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆమె భయపడింది. అందుచేత ఆమె తను తెచ్చిన
పదార్ధాన్ని ఒక గుడ్డలో మూట కట్టి ఆ మూటను దగ్గరలో వున్న చెట్టు కొమ్మకు
వేలాడదీసి బాబా గారి దర్శనార్ధం ఎదురుచూస్తూ కూర్చున్నది. మధ్యాహ్న సమయం
కాగానే బాబాగారు తమకి భోజనం పట్టుకురమ్మన్నారు.
భక్తులు ఖరీదైన
వంటకాలని సమర్పించడానికి పోటీపడ్డారు. కానీ బాబా గారు వారు సమర్పించిన
వంటకాలని స్వీకరించక - "బయట చెట్టుకు వేలాడుతున్న మూటని పట్టుకురండి,
దాన్లో నాకిష్టమైన ఆహారం వుంది" అన్నారు. సేవకులు అంతా తిరిగి మూటలాంటిదేమీ
కనిపించక తిరిగి వచ్చి, ఇంతకు ముందు వడ్డించిన వాటినే తిరిగి వడ్డించి
తెచ్చారు. బాబా గారు దానిని తిరస్కరించి తాను కోరిన ఆహారాన్నే తీసుకురమ్మని
పట్టుబట్టారు. దాంతో చేసేదేమీ లేక భక్తులు మళ్లీ వెదికి అలసిపోయి వచ్చి
బాబా గారి ముందు తలలు వంచి నిలబడ్డారు. చివరికి బాబా గారే లేచి గంగాబాయి తన
మూటను వేలాడదీసిన చెట్టు వద్దకు వెళ్లి మూటను విప్పి దానిలో తన కోసం చేసిన
నైవేద్యాన్ని ఎంతో ప్రీతిగా ఆరగించి, దాన్లో కొంత భాగం మిగిల్చి యదావిధిగా
దాన్ని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. బాబా గారు వెళ్లిపోగానే గంగాబాయి
చెట్టు వద్దకు వెళ్లి ఆ మూటలో బాబా గారు మిగిల్చిన అన్నాన్ని
గురూచ్ఛిష్టంగా భావించి స్వీకరించింది. ఆమెకు పట్టిన అదృష్టాన్ని చూచిన
భక్తులు కొందరు అయిష్టంగానే ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. "బాబా అంతగా
నిన్ను ఆదరించడానికి ఏ వంటకం చేసి తీసుకొచ్చావు, ఆయన ఇష్టాయిష్టాలు నీకెలా
తెలుసు" అని ఆమెని అడిగినప్పుడు ఆమె "ఆనాటి శ్రీరామ చంద్రుడే, మళ్లీ
తాజుద్దీన్ బాబా రూపంలో అవతరించారు. మనమే ఆయన్ని గుర్తించలేకపోతున్నాం"
అని చెప్పింది.
**కుచేలుడు తెచ్చిన అటుకులను తిన్న శ్రీ కృష్ణుడు,
శబరి ఎంగిలి పండ్లను ప్రీతిగా ఆరగించిన రామచంద్రుడు, భక్త కన్నప్ప
సమర్పించిన మాంసం స్వీకరించిన పరమ పావనుడైన శివుడు తమ భక్తుల నుండి
ఆశించేదేమిటో అవతరించిన ప్రతిసారీ తెలియజెప్తూనే వున్నారు. శిరిడీ సాయిబాబా
కోసం ఎంతో దూరం నుండి నడిచి వచ్చిన ఓ ముసలివాడు, కిక్కిరిసిన భక్తుల మధ్య
లోపలికి ప్రవేశించలేక మసీదు గోడకి ఆనుకుని కూర్చున్నాడు. భక్తులు బాబా
గారికి నైవేద్యం సమర్పించగా వాటిని స్వీకరించకుండా "గోడ దగ్గర కూలబడిన ఆ
ముసలివాడ్ని తీసుకురండి, వాడు తెచ్చిన పదార్ధమే ముందుగా భుజించదగినది" అని
చెప్పి అతన్ని రప్పించారు. ఆ ముసలివాడు చూడటానికి అసహ్యంగా వుండి, నోరంతా
చొంగ కారుతున్నప్పటికి అతన్ని ప్రేమగా ఆదరించారు, అతను సంచీలోంచి ఆహార
పదార్ధం తీసివ్వగానే బాబా ఎంతో ప్రీతిగా దాన్ని ఆరగించారు. భగవంతుడికి
కావలసింది కడుపు నింపే ఆహార పదార్ధాలు కాదు, మనసుని ఆర్ధ్రతతో నింపే ప్రేమ.
ప్రేమగా సమర్పించిన పుష్పమైనా, ఫలమైనా,పత్రమైనా, ఆహారపదార్ధమేదైనా తాను
స్వీకరిస్తానని శ్రీ కృష్ణుడు తెలియజేశారు.
సబ్కా మాలిక్ ఏక్ :
-------------------
హనుమంతరావు సచివాలయంలో ఉద్యోగం చేసేవాడు, అతడు బాబా గారి లీలలు విని ఆయన
పై నమ్మకం కుదిరి సంపూర్ణ శరణాగతుడయ్యాడు. ఆ కాలంలో కొంతమంది హరిజనులు
మహమ్మదీయ మతంలోకి మారి బాబా గారిని శ్రద్ధగా సేవించుకుంటూ లాభం పొందడం అతను
గమనించాడు. అప్పుడతనికి తాను కూడా మతం మార్చుకున్నట్లయితే బాబా గారి కృప
తనకి ఇంకా ఎక్కువ లభిస్తుంది కదా అనే ఆలోచన కలిగింది. సర్వాంతర్యామి ఐన
తాజుద్దీన్ బాబా ఆతని ఆలోచన పసిగట్టి వెంటనే అతన్ని పిలిచి ఏదైనా
పుస్తకాన్ని తెచ్చి ఇవ్వమన్నారు. అప్పుడు హనుమంతరావుకి అందుబాటులో భగవద్గీత
ఉండటంతో అతను ఆ గ్రంధాన్ని బాబా గారికి ఇచ్చాడు. బాబా గారు ఆ గ్ర్రంధాన్ని
తెరిచి పేజీలు అటు ఇటు తిప్పి "అరే ఏమిటీ ! మనం ఇందులో కూడా వున్నామే"
అన్నారు. ఆయన మాటలు విన్న హనుమంతరావుకి బాబా గారిచ్చిన సందేశం అర్ధమైంది.
భగవంతునికి సర్వం సమర్పించి, ఆయన పై పూర్తిగా ఆధారపడిన వారికి సత్యం
బోధపడుతుంది ఈ ధర్మం మహమ్మదీయ మతంలోనే కాక హిందూ మతంలోనూ చెప్పబడివుంది.
బాబా గారి కృపను పొందడానికి మతం మారాల్సిన అవసరం లేదని ఆయన పరోక్షంగా
తెలియజేసారని అర్ధమయి సంతోషంతో నమస్కరించాడు.
** బడే బాబా ఒక
హిందూ మతస్తున్ని మహమ్మదీయ మతంలోకి మారేలా ప్రోత్సహించి, తాను చేసిన పనిని
గొప్ప ఘనకార్యంగా భావించి ఆ విషయం సాయి బాబా గారికి చెప్తాడు. అప్పుడు సాయి
బాబా గారు, బడే బాబాని ఏమీ అనకుండా మతం మార్చుకున్న వ్యక్తిని చెంప పై
కొట్టి "అబ్బని మార్చుకుంటావట్రా" అని కసురుకుంటారు. మతం అనేది బాట మాత్రమే
గమ్యం కాదు, అందరి గమ్యం భగవంతుడే. భగవంతుడ్ని చేరుకోవాలన్న సంకల్పం
దృఢంగా వున్నప్పుడు మారాల్సింది మతం కాదు, మన జీవన విధానం. గమ్యాన్ని
చేరడానికి ఎన్నో దారులున్నాయి. మనకి కావల్సింది దారి తెలిసిన బాటసారి. ఆ
బాటసారే సద్గురువు, ఆయనలోనే భగవంతుడు ప్రకటమవుతాడు. మనకై మనమే బాట వెంటే
నడుస్తూ పోతే ఆ దారిలో ఎలాంటి భయానక పరిస్థితులు ఎదురవుతాయో ఎలా
తెలుస్తుంది? తెలిసిన వారి చెయ్యి పట్టుకుని నడిచేటప్పుడు భయమెక్కడిది?
సర్వమతాలు తనకి చెందినవైనప్పుడు భగవంతుడు ఒక వైపు ఎలా మొగ్గు చూపుతాడు.
అన్ని మతాలు ఆయనవే, అందరిలోనూ వున్నది ఒక్కడే. అందుకే సాయి సబ్కా మాలిక్
ఏక్ అనేవారు.
నిర్యాణం - సూచన :
-------------------
1924లో ఒకరోజు తాజుద్దీన్ బాబా నాగపూర్లో ధిగోరి రోడ్డులో నడుస్తూ రోడ్డు
పక్కగా వున్న వంతెన పై కూర్చున్నారు. ఆయన్ని అనుసరించి వస్తున్న వారు ఆయన
చుట్టూ మూగారు. వారిలో కరీం బాబా అనే అతడు తాజుద్దీన్ బాబా గారిని "సూఫీ
యోగులందరికీ గురువెవరు అని అడిగి, మీరు కాక అంతటి వారు ఇంకెవరున్నారు"
అన్నాడు. అప్పుడు బాబా నిర్భయంగా "ఔను నేనే" అన్నారు. అప్పుడాయన కన్నులు
మూసుకుని "ఓ ! ఈద్ చంద్రుడు దర్శనమిస్తున్నాడు" అన్నారు. దానికి కరీం బాబా
"రంజాన్ ముగిసి చాలా రోజులైంది కదా బాబా! ఇప్పుడు దర్శనమిస్తున్నది బక్రీద్
చంద్రుడు కదా!" అన్నారు. అందుకు బాబా "ఈద్ చంద్రుని మేమిక చూడబోము" అని
నొక్కి చెప్పారు. ఆ తర్వాత బాబా ఆఙ్ఞ ప్రకారం ఆయన చూపించిన స్థలంలో కరీం
బాబా ఒక కట్టడం నిర్మించారు. దానికి తాజ్-అబాద్-షరీఫ్ అని పేరు పెట్టారు.
తర్వాత్తర్వాత అక్కడే మసీదుని కూడా నిర్మించారు. ఒకరోజు బాబా ఆ మసీదులో
కూర్చుని కాస్త ఆహారం తీసుకురమ్మని భక్తులని కోరారు. భక్తులందరూ తలా కొంత
అహార పదార్ధాలను తెచ్చి ఆయనకి సమర్పించారు. వాటిలోంచి బాబా కొద్దిగా
ఆహారాన్ని స్వీకరించిన తర్వాత పట్టణం వైపుగా బయలుదేరారు. నడుస్తూ నడుస్తూ
ఒక ఖాళీ స్థలం దగ్గర ఆగి అక్కడే కూర్చుండిపోయారు. ఆయన్ని అనుసరించి వచ్చిన
భక్తులు ఆయన దగ్గరికి రాగానే "ఈ మట్టి చాలా పవిత్రమైనది. మీరంతా ఇక్కడ
నాకొక భవంతిని కట్టిస్తే బాగుంటంది" అని మళ్లో ఒక్క క్షణకాలం తర్వాత ఆయన
"వద్దు వద్దు ! ఒక పూరి గుడిసె మాత్రమే చాలు నాకు!" అన్నారు. ఆయన సమాధి
చెందిన తర్వాత గానీ తాజుద్దీన్ బాబా సంకేతంగా పలికిన పై మాటలు భక్తులకి
అర్ధం కాలేదు.
1924 జులై మాసం ముగుస్తుండగా బాబా గారికి జబ్బు
చేసింది. పది రోజులు గడిచినా ఆయన కోలుకోలేదు, రోజు రోజుకీ క్షీణిస్తున్న
ఆయన ఆరోగ్యం వల్ల ఆయన మునుపటి వలె తిరగలేకపోయారు. ఆయన పరిస్థితి చూచు రాజా
రఘోజీ రావు కలత చెందసాగారు, అప్పటి నుండి ఆయన తరచూ బాబా గారి దర్శనానికి
వస్తుండేవాడు. ప్రసిద్ధి చెందిన వైద్యులైన జాఫర్ హుసేన్, ధర్మవీర్ ముంజే
మొదలైన వారు వచ్చి బాబా గారిని పరీక్షించి రుగ్మత ఏమిటో
నిర్ణయించలేకపోయారు. సాధారణంగా పవిత్రమైన బక్రీద్ మాసంలో బాబా గారు నూతన
వస్త్రాలు ధరించి నాగపూర్ వీధులన్నీ తిరుగుతూ భక్తులందరికీ తమ దర్శనాన్ని
ప్రసాదిస్తారు, కానీ ఈసారి బక్రీద్ మాసంలో తమకి నూతన వస్త్రాలు
సమర్పించవద్దని భక్తులను ఆయన కఠినంగా శాసించారు. ప్రతి సంవత్సరం మొహరం నెల
10వ రోజున తాజుద్దీన్ బాబా ఆకుపచ్చని జుబ్బా ధరించి "కర్బలా"కు వెళ్లేవారు,
అయితే ఈ సంవత్సరం అలాగాక సకర్దరా పొలిమేరల వద్దకు వెళ్లారు. అక్కడే వజీర్
దగ్గర నుండి ఒక కాగితాన్ని తీసుకుని తన చేతిని పైకెత్తి అందులో రాసిన
ప్రార్ధనను పెద్దగా చదివారు. ప్రార్ధన పూర్తవగానే ఆయన తీవ్రమైన ధ్యానంలోకి
వెళ్లినట్టు కనిపించారు, వెంటనే ఆయన ప్రవర్తనలో పూర్తి మార్పు కనిపించింది.
ఆయన చుట్టూ వున్న భక్తులు ఆయనలో దివ్యత్వాన్ని దర్శిస్తూ హసన్! హసన్! అంటూ
పవిత్రనామాలను ఉచ్ఛరించారు. కాసేపటకి సాధారణ స్థితికి వచ్చిన బాబా గారు తన
బసకు వెళ్లిపోయారు.
1925వ సంవత్సరం అగష్టు నెల 17 వ తేదీన ఎన్నో
పక్షులు గుంపుగా వచ్చి మహరాజు రఘోజీరావు భవనం మీద చేరాయి. అవి ఎటువంటి
కదలిక లేకుండా నిశ్శబ్ధంగా కూర్చున్నాయి. బాబా వాటిని చూచి తమ చేతిని
పైకెత్తి వాటి సంక్షేమం కోసం ప్రార్ధించి వాటిని ఆశీర్వదించారు. తర్వాత
ప్రశాంతంగా పడుకున్నారు. కొద్దిసేపటికి ఆయన గొంతులో నుండి చిన్న గురక
వచ్చింది. వెంటనే ఆయన ఆత్మ అనంతంలో ఐక్యమైపోయింది. క్షణాల్లో వార్త నాగపూర్
పట్టణమంతా వ్యాపించింది. హిందూ, ముస్లీం తేడా లేకుండా ఈ వార్త విని ప్రతి
ఒక్కరూ దిగ్భ్రాంతి చెందారు. బాబా నిర్యాణం తర్వాత ఆయన్ని ఎక్కడ సమాధి
చెయ్యాలనే విషయం పై వివాదం చెలరేగింది. చివరికి బాబా గారు చూపించిన
ప్రదేశంలో వారిని సమాధి చేసారు. ఆయన శరీరాన్ని గోతిలో వుంచుతూ, పవిత్ర
వాక్యాలను చదువుతున్న మతాధికారికి తాజుద్దీన్ బాబా ఆ గోతి పక్కనే నిలబడి
దర్శనమిచ్చారు. ఆయనను సమాధి చేసిన పవిత్రమైన రోజు 1925 అగష్టు 18, ఆ రోజు
గురువారం.
** తాజుద్దీన్ బాబా గారి సంపూర్ణ ఆశీస్సులను పొందిన
వారిలో మహాత్మా గాంధీ, భారత క్రికెట్ జట్టు ప్రధమ కెప్టెన్ సి.కె.నాయుడు
లాంటి వారెందరో వున్నారు.
దైవ విగ్రహాల కన్నీరు :
----------------------
1925 అగష్టు 25వ తేదీన "ఈవెనింగ్ న్యూస్" పత్రికలో నారాయణరావు మదన్ ఇలా
రాసారు "తాజుద్దీన్ బాబా నిర్యాణం చెందిన సమయంలో పాండురంగ మందిరంలోని
విఠల్, రుక్మిణి విగ్రహాలు 12 గంటల పాటు ఏకధాటిగా కన్నీరు కార్చాయి,
ఆశ్చర్యకరమైన ఈ దృశ్యాన్ని వేలాది మంది భక్తులు చూచారు." 1925 అగష్టు 22న
"మద్రాస్ మెయిల్" ఆంధ్రపత్రిక"లు ఇలా రాసాయి "సాక్షాత్తూ శ్రీరాముడే తిరిగి
తాజుద్దీన్ బాబా రూపంలో అవతరించి లోకాన్ని పవిత్రం చేసారు. ఆయన వచ్చిన
కార్యం ముగియగానే ఆయన నిష్క్రమించారు."
సమర్ధ సద్గురు ఎక్కిరాల భరద్వాజ మహరాజ్

కరుణ
చూపమనో ,కృప సాధించాలనో,అనుగ్రహం పొందాలనో, కోరికలు తీర్చుకోవాలనో
భగవంతుడ్ని ఆశ్రయిస్తాం..గుడికెళ్లి కొబ్బరికాయలు కొట్టి ,అష్టోత్తరం
చదివించి.పూజలు చేయించి (చేసి)...ఆ కోరికలు తీరగానే లేదా తీరకుండానో ఆయన్ని
మర్చిపోతాం....కోరికలు తీరితే అవెందుకు తీరాయి?తీరకపోతే అవెందుకు తీరలేదు?
అని కూడా ఆలోచించే తీరిక మనకెప్పుడూ ఉండదు.ఏదైనా సాధించాలంటే మనిషికి ఆ
పని చేసితీరాలి అనే పట్టుదల,ఆత్మవిశ్వాసం,తన సామర్ధ్యం పై నమ్మకం,
చేస్తున్న ( లేదా చేయబోయే) పని మీద ఇష్టం ఉండాలి.ఆ పని పూర్తయి,ఫలితం వచ్చే
వరకూ వేచిచూసే ఓపిక,మధ్యలో ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకునే సహనశక్తి
ఉండాలి.
ఓ పని మన వల్ల కాదు అని నిర్ణయానికొచ్చాక ఆ పనిలో నిపుణులనో,అనుభవఙ్ఞులనో ఆశ్రయించటం జరుగుతుంది...ఇక ఆ పని పూర్తవడానికి మనకి ఎవరూ
సహకరించరు(సహకరించలేరు) అనిపించినప్పుడే మనం భగవంతుడ్ని ఆశ్రయిస్తాం...మన
కోరికలను తీర్చే ఆయన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోం..పోనీ కోరిక తీరకపోతే
ఎందుకు తీరలేదా అని ఒక్కసారి కూడా అలోచించకుండా..భగవంతుడు లేడు
అనేస్తాం...మనతో తిరిగే స్నేహితుల అవసరాల పట్ల శ్రద్ధ వహించకుండా... వారిని
నిర్లక్ష్యం చేసి..మనకి అవసరం ఏర్పడినప్పుడు వారి మీద ఆధారపడితే... వారు
మనల్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తారా???మనకిష్టమైన హీరో గురించో లేదా
ఇష్టమైన వ్యక్తి గురించో అతని జీవిత చరిత్ర ఆసాంతం తెలుసుకునే దాకా
నిద్రపోని మనం భగవంతుడి గురించి తెలుసుకోవటానికి కొంచెం కూడా ఆసక్తి
చూపించం.మనం ఎవర్నయినా నిర్లక్ష్యం చేస్తే .దూరం చేసుకుంటే వారు మనకి దూరం
అవుతారు....ఓ వ్యక్తి దగ్గరవ్వటానికి ముందు పరిచయం చేసుకోవాలి.అతని గురించి
తెలుసుకోవాలి...అతని ఇష్టాయిష్టాలని కనిపెట్టుకోవాలి...అతని పట్ల కాస్త
శ్రద్ధ కలిగివుండాలి.
అతని ఇష్టాయిష్టాలని బట్టి అతనితో మసలుకోవాలి....అతని మనసెరిగి ప్రవర్తిస్తే ఆ మనిషి మనకి దగ్గరవుతాడు(మిత్రుడవుతాడు)....దగ్గరయిననాడు
ఆపదలో ఆదుకుంటాడు...ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తమిత్రుడు....అందరినీ సమంగా
చూచే భగవంతుడే ఆ ఆప్తమిత్రుడు....మరి భగవంతుడు ఏంచేస్తే
దగ్గరవుతాడు..అతనితో స్నేహం చేసేదెలా???మనకి ఆయన రాళ్లలోనో...ఫొటోల్లోనో
తప్ప మనిషిలా కనిపించడే???
ఆయనకి దగ్గరవటానికి ఒకే దారి ఉంది అది
భక్తిమార్గం ...మరి భక్తి అంటే ఏమిటి? భగవంతుడిపై అవ్యాజమైన ప్రేమే
భక్తి.సర్వం పొందాలనే కోరిక ప్రేమలో ఉంటుంది...సమస్తం సమర్పించాలనే కోరిక
భక్తిలో ఉంటుంది...మరి ఆయన మనిషి కాదుగా అంటే...రాముడు,కృష్ణుడు,సాయిబాబా,రమణ
మహర్షి.ఏసు ప్రభువు, మహమ్మదు,గురునానక్ వీరందరూ మానవరూపంలోనే భూమిపై
అవతరించారు.మనిషిగా అవతరించినపుడు వారిని అందరూ ఒకేసారి పూజించలేరు కాబట్టి
అందరికి దగ్గరవటానికి.ఫొటోలు,విగ్రహాల రూపంలో మనకి దగ్గరవుతారు.మరి వారిని
అర్ధం చేసుకొని వారిని భక్తి భావంతో సేవించి వారికి దగ్గరవ్వాలంటే ఏం
చెయ్యాలి??మన ముందర ఆయన్ని సేవించిన పరీక్షిత్తు,నారదుడు,ప్రహ్లాదుడు,బిల్వమంగళుడు,భక్త
జయదేవుడు,హనుమంతుల వారు లాంటి భక్తులు ఏం చేసి ఆయన అనుగ్రహాన్ని పొందారో
గమనించి...మనం కూడా వాటిని ఆచరించడం ద్వారా ఆయన కరుణ,కృప,అనుగ్రహం
పొందగలం...
భక్తి,ఙ్ఞాన,కర్మ యోగాల ద్వారా భగవంతుడ్ని పొందవచ్చు అని
మనకి శాస్త్రాల్లో చెప్పారు..వాస్తవానికి అవి ఒకటే తప్ప వేరు
కాదు...భగవంతుడిపై పరిపూర్ణ నమ్మకంతో కూడిన అవ్యాజమైన ప్రేమ
పెంచుకోవటం(భక్తి) ,భగవంతుడెవరు?ఆయన తత్వమేమిటి?ఆయన ఓ సాధారణమైన రాయా? లేక
విశ్వమంతా వ్యాపించిన చైతన్యమా?ఆయనకి దగ్గరవటం ఎలా? అనే విషయాలు
తెలుసుకుని( ఙ్ఞానం)...ఆయన అనుగ్రహాన్ని పొందటానికి ఇతర భక్తులు ఏం చేసారో
అర్ధంచేసుకుని.. అవి ఆచరించటం(కర్మ) ...ఈ మొత్తాన్ని అర్ధం చేసుకుంటే
భగవంతుడి అనుగ్రహాన్ని పొందటంలో.... పై మూడింటి ఆవశ్యకత
ఏమిటో..భక్తి,ఙ్ఞాన,కర్మ మార్గాలు మధ్య అవినాభావ సంబంధం ఏమిటో
అర్ధమవుతుంది.
భక్తిలో నవవిధ భక్తిమార్గాలున్నాయని చెప్పటం మనం
వినే(చదివే) ఉంటాం..వాటి ద్వారా మనమేమైనా ఫలితం పొందామా? అంటే సమాధానం
శూన్యం..కారణం?
ఎందుకిలా జరుగుతుంది?అసలవేమిటో అర్ధం
ఐతే....అర్ధం అయినవి ఆచరణలో పెడితే మనం క్రమంగా ఓ స్థాయికి వచ్చేసరికి...
భగవంతుడు మనని శ్రద్ధగా గమనిస్తున్నారు..ఆయన మనల్ని
పట్టించుకుంటున్నారు..ఆయన మన బాధల్ని అర్ధం చేసుకుంటున్నారు అనే విషయం
అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు మనపట్ల ఆయన పూర్తిగా సంతృప్తి చెందితే మనం
పూజించే అవతారంలోనో లేదా అవధూత మహాత్ముల రూపంలోనో సగుణ సాక్షాత్కారం
ప్రసాదించి.... దర్శన,స్పర్ప,సంభాషణ అనుభవాలు ఇవ్వవచ్చు..ఆచరణ వల్లే
అనుభవాలు కలుగుతాయి.ముందుగా మనకి కావల్సింది ఒకే ఒక భగవంతుడి పై
గురి(భక్తి)....అది రాముడా,కృష్ణుడా.సాయి బాబానా.ఏసు ప్రభువా,అల్లానా అని
మన మతం నిర్ణయిస్తుంది..లేదా భగవుంతుడ్ని వివిధ గుణాలతో ఆరాధించే వారికి
సాధారణంగా అయన్ని ఆరాధించేవారి అభిప్రాయాన్ని బట్టీ ఆయన అనేక రూపాల్లో
దర్శనమిస్తాడు(హిందుమతం).మతాన్ని
బట్టో,ఇష్టాన్ని బట్టో ముందుగా మనకి నచ్చిన భగవంతుడ్ని ఎంచుకొని...ఆయనకి
నవవిధ భక్తి ద్వారా దగ్గరయి,ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ముందుగా నవవిధ
భక్తి మార్గం గురించి తెలుసుకుందాం. వాస్తవానికి అవి తొమ్మిది మార్గాలు
కాదు,ఒకే మార్గంలో వివిధ దశలు.
కేవలం తెలుసుకోవటంలో ఏమీ లేదు.. ఆచరణ
మీద ఆధారపడి ప్రపంచం నడుస్తుంది..చేసుకున్నవారికి చేసుకున్నంత..ఏదైనా
ఆచరణలో పెడితేగాని అనుభవానికి రాదు.ప్రతి దానిలోనూ మనం మంచి చెడు
చూచి..ఎంచుకుంటాం...మరి భగవంతుడు చూడడా?
నిప్పు ముట్టుకుంటే కాలుతుంది.ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది
వ్యాయామం వల్ల ఆరోగ్యం కలుగుతుంది.ఎండలో వేడి..శీతాకాలంలో చలి ఇవన్నీ మనకి
అనుభవానికి వస్తున్నప్పుడు..వీటిని సృష్టించిన భగవంతుడెందుకు అనుభవానికి రాడు???
భగవంతుడ్ని ఆచరణలో పట్టుకోవాలి...ఆ ఆచరణే నవవిధ భక్తిమార్గం.
నవవిధ భక్తిమార్గం :
1.శ్రవణము 2.కీర్తనము 3.స్మరణము 4.పాదసేవనము 5.అర్చనము 6.వందనము 7.దాస్యము 8.సఖ్యము 9.ఆత్మ నివేదనము.
1.శ్రవణము :
ఇక్కడ ఈ శ్రవణం అనే పదమే వాడాల్సిన అవసరం ఏమిటి?పఠనం వాడొచ్చుగా? దీన్ని
వినటం అనే అర్ధంలో కాకుండా చెప్పిన మాట వినటం అనే అర్ధంలో ఉపయోగించినప్పుడు
మనకి సరైన ఫలితాలు వస్తాయి..సత్ప్రవర్తన అభివృద్ధి చేసుకోవాటంలో
ఇది...అద్భుతమైన ఫలితాలిస్తుంది...
ఉదా : సాయి సచ్చరిత్రలో వి.హెచ్
ఠాకూరుకి బాబాగారు చెప్పిన ఉపదేశం వినండి ఇచ్చటి మార్గం అప్పా(కన్నడయోగి)
నీతులు బోధించినంత సులువుకాదు..
నాన్హేఘాటుని దున్నపోతునెక్కి దాటడం
కంటే కష్టం...ఆధ్యాత్మ మార్గం అత్యంత కష్ఠసాధ్యం....అప్పా చెప్పినదంతయు
నిజమే.కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో
పెట్టాలి,ఊరకనే గ్రంధములు చదవటం
వల్ల ప్రయోజనం లేదు.నీవు చదివిన విషయాలను జాగ్రత్తగా విచారించి,అర్ధం
చేసుకుని, అభ్యసించి ఆచరణలో పెట్టాలి.
గురువు అనుగ్రహంలేని ఉత్త
పుస్తకఙ్ఞానం నిష్ప్రయోజనం.గురువు గారి మనసుని అర్ధం చేసుకుని ఆయన మన నుండి
ఏమి ఆశిస్తున్నారో అది వారికి సమర్పించడం ద్వారా వారి అనుగ్రహాన్ని
సులభంగా పొందవచ్చు... మనల్ని అశాంతికి గురిచేసే అరిషడ్వర్గాలని వారికి
సమర్పించి వారు ఆచరించి చూపిన మార్గాన్ని మన దారిగా చేసుకుని నడిస్తే ఉన్నత
జీవులుగా ఎదగతామనే వాస్తవాన్ని వారెప్పుడూ బోధిస్తారు.
ఇది చదివినందువల్లో వినినందువల్లో....ఏమిటి ఉపయోగం....వినమంటే ఆచరించమని....ఇక్కడ పఠనం అనకుండా శ్రవణం అనటంలో అర్ధం ఇది.
2.కీర్తనం :
మంచి చెడుల భేదభావం తెలిసి ఆచరణలో పెట్టాక...ఆ సుగుణాల వల్ల మనకి కాస్త
శక్తి లభించి అది గర్వంగాను..అహంగానూ మారుతుంది..అప్పుడు భగవంతుడ్ని
తలుచుకుంటూ ఆయనకెన్ని గొప్ప గుణాలు వున్నప్పటికీ సాధారణమైన వ్యక్తిగా
ఆయనెంత అణకువ కలిగి ప్రవర్తించారో....గుర్తెరిగి ఆయన్ని కీర్తిస్తూ
మన అహాన్ని చంపుకోవాలి....దైవాన్ని స్మరిస్తూ అహన్ని చంపుకో అని బాబాగారు చెప్పారు.
ఉదా: సాయి సచ్చరిత్రలో మసీదులో చాలసేపు కూర్చున్న ఓ వ్యక్తి, ఓసారి బయటికి
వెళ్లి వచ్చేసరికి అతని స్థానంలో ఓ పిల్ల కూర్చుని ఉంటుంది..వెంటనే అతను
ఆ స్థలాన్ని ఖాళీ చెయ్యమని పిల్లతో కఠినంగా మాట్లాడతాడు...అప్పుడు
బాబాగారు ఆవేశంగా ఈ సృష్టి అంతా భగవంతుడి సొత్తు...ఎవరకీ దీనిపై యాజమాన్యపు
హక్కులుండవు అంటారు...ఇదే అనుభవం బాబాగారికే ఎదురవుతుంది..బాబాగారు ఓ రోజు
ఆయన స్థానంలో కూర్చుని ఉండగా నానావలి గారు వచ్చి...కూర్చుంది
చాల్లే
లే!!!నేను కూర్చోవాలి ...అంటాడు..వెంటనే బాబాగారు మరో ఆలోచన లేకుండా లేచి
నిలబడగానే....నానావలి కొద్దిసేపు అక్కడ కూర్చుని లేచి బాబాగారికి
నమస్కరించి వెళ్లిపోతాడు....మాట మాత్రంతో తుఫానుని నియంత్రించిన
భగవానుడు..తన ఆచరణ ద్వారా మనిషి ప్రవర్తన ఎలా ఉండాలని కోరుకుంటున్నారో
చూడండి... ఇలాంటి సందర్భాలు చదవి గుర్తుంచుకుని మన నిజజీవితంలో మనం వాటిని
ఎదుర్కొన్నప్పుడు అంత శక్తివంతుడైన ఆయనకే ఎలాంటి అహంలేనప్పుడు
మనకెందుకుండాలి అని ఆయన గుణాలను గుర్తుకు తెచ్చుకుని ...ఆయన భక్తులుగా ఆయన
కీర్తిని మరింత పెంచాలి.
3.స్మరణం :
స్మరణం అంటే
తొమ్మిదిసార్లో,నూటెనిమిది సార్లో కాకుండా...వీలున్నప్పుడల్లా ఆయన్ని
స్మరిస్తూ ఉండాలి.అందాన్ని,అందవికారమైన దాన్ని దేన్ని
చూచినా అది ఆయన
సృష్టిగా భావిస్తూ...ఆయన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.ప్రతి పనికి ముందు,పని
ముగిశాక....(అంత ఏకాగ్రత అవసరంలేని పనులకు) పని చేస్తూ ఆయన్ని
స్మరించాలి..ప్రతి దాన్లోనూ ఆయన్ని చూచినప్పుడు ఒకనాటికి ఆయనకి దయకలిగి
దర్శనభాగ్యం ప్రసాదిస్తాడు.కలియుగంలో కేవలం భగవంతుడి నామస్మరణే మానవులని
అన్ని పాపాలనుండి విముక్తులను చేస్తుందని వేదవ్యాస మహర్షుల వారు భాగవతంలో
అజామిళుని కథలో చెప్పారు..మనం విజయదశమి రోజు ఆయుధాలను
పూజిస్తాం.వినాయకచవితి రోజు పుస్తకాలని బొట్టుతో అలంకరించి విఘ్నేశ్వరుడి
ముందు పెడతాం. ఏ పెద్ద వస్తువు కొన్నా మనం దానికి బొట్టు పెడతాం,వాహానాలకి
పూజ చేయిస్తాం..ప్రతిదాన్లోనూ మనం భగవంతుడ్ని చూస్తాం...కానీ కొంతసేపటికి
మరిచిపోతాం ఈ మరుపు వల్లే మనం
చాలా తప్పులు చేస్తాం...అందుకే అయన్ని నిత్యం స్మరించాలి...గురు నామమే మహామంత్రం...అది గుర్తించి ఆయన్ని స్మరించాలి.
ఉదా: రోహిల్లా శిరిడిలో బిగ్గరగా భగవంతుడి నామం ఉచ్ఛరించడం వల్ల ఇబ్బంది
కలిగిన భక్తులు అతనితో తలపడలేక బాబాగారికి విన్నవించుకుంటే ఆయన
వాడిని
ఇంకా బిగ్గరగా నామం ఉచ్ఛరించనివ్వండి..అతడు చేసే స్మరణ నాకెంతో ఆనందాన్ని
కల్గిస్తుంది..అతని జోలికెవరు వెళ్లకండి అన్నారు.రోహిల్ల ఉచ్ఛరించే
ఆ భగవంతుడెవరో చెప్తూనే...అది వారికెంత ఇష్టమైనదో తెలియజెప్పారు.
నానాచందోర్కర్,బాబాగారి పక్కనే కూర్చున్నప్పటికీ అందమైన అమ్మాయిని
చూడగానే మనసు చలించి,ఆమెని ఇంకొక్కసారి చూడాలనిపిస్తుంది. అప్పుడు బాబాగారు
ఏమన్నారో చూడండి...నానా(చందోర్కర్) సింహద్వారం ఉండగా దొడ్డిదారిన
వెళ్తావెందుకు??ఇంద్రియాల పనిని ఇంద్రియాలని చేసుకోనివ్వు...మనసుకి ఆలోచనలు
కల్పించకు.అందమైన దేవాలయాలెన్ని(దేహాలు) లేవు?అందులో ఉన్న దైవాన్ని
దర్శించు...అందమైన దేహాన్నిసృష్టించిన దేవున్ని స్మరించు అన్నారు.
4.పాదసేవనం :
సద్గురువులు,మహాత్ముల పాదాలెంత పవిత్రమైనవో హిమాలయయోగులు అనే గ్రంధంలో ఓ మహాయోగి రామాగారికి చెప్తూ ఇలా అంటారు..
మహాత్ముల పాదాలెందుకు సేవించాలంటే...బ్రహ్మఙ్ఞానం పొందిన మహాత్ములు
భగవంతునితో ఐక్యమై ఉంటారు...అలా ఐక్యమై భగవంతుని పాదాలచెంత తమ జీవితంలో
సర్వస్వమూ అర్పిస్తారు.సామాన్యంగా జనాలు ఎదుట వారిని ముఖం చూచి
పోల్చుకుంటారు,కానీ ఋషీశ్వరుల ముఖం (అహం) ఇక్కడ ఉండదు, భగవంతుని చెంత
ఉంటుంది(ఐక్యమైవుంటుంది).జనాలిక్కడ ఆయన పాదాలనే (ఆచరణ) కనుగొంటారు.అందుచేత ఆయన పాదాలకి నమస్కరించాలి.పాదసేవనం
అంటే పాదాలను కౌగలించుకోవటం,ముద్దడటమో,పాదాల చెంత తలను వాల్చడమో కాదు...ఆయన అనుసరించి చూపిన మార్గంలోనే నడవటం...ఆయన చెప్పిన
వాటిని ఆచరించి చూపించడం.మహాత్ముల పాదాల పవిత్రత ఎంతటిదంటే....సాయి
సచ్ఛరిత్రలో దాసగణుకి బాబాగారు వారి పాదలనుండే త్రివేణీ సంగమంలోని జలాలని
అనుగ్రహించారు....ఎవరి పాదాలనుండి గంగ ఉద్భవించి పవిత్రమైందో ఆ భగవంతుడు
తనే అని నిరూపించారు.అత్యంత పవిత్రమైన గంగ...పాపుల వల్ల
మలినమై
మహాత్ముల స్పర్శచే పునీతమవుతుంది...అంతటి మహాత్ములు చూపిన దారి మనల్ని ఎంత
ఉన్నత స్థితికి చేరుస్తుందో గుర్తించి దానిని ఆచరించి
ఫలితాలు పొందాలి.
5.అర్చనం :
హిందువులకి సగుణరూపంలో (ఫొటో,విగ్రహం) భగవంతుడ్ని అర్చించాలనే నియమం
విధించబడింది....కృతయుగంలో విగ్రహారధన లేదు..గురుశిష్య పరంపర కొనసాగిన కాలం
అది...త్రేతాయుగంలో రాముడు,ద్వాపరయుగంలో కృష్ణుడు గురువులని
ఆశ్రయించారు..కానీ క్రమంగా సామాన్యులు గురువులని, మహాత్ములని దూరం
చేసుకోవటం వల్ల...మనకి భగవంతుడు దూరమయ్యాడు, అదీకాక కలియుగంలో
ప్రతివీధిలోనూ ఓ గురువు వెలుస్తాడు...సద్గురువు ఎవరో తెలుసుకునే ఙ్ఞానం
అల్పులైమైన మనకి ఉండదు కాబట్టి.. ఋషులు ఇది ముందుగా గ్రహించి మనకి
విగ్రహారాధన అలవాటు చేసారు.మనం ఓ సద్గురువుని ఆశ్రయించి(శ్రీపాద వల్లభ
మహరాజ్.నృసింహ సరస్వతి మహరాజ్,మాణిక్య ప్రభువు,అక్కల్కోట స్వామి
సమర్ధ,షేగాఁ గజానన మహరాజ్,తాజుద్దీన్ మహరాజ్,శిరిడీ
సాయిబాబా,రాఘవేంద్రస్వామి,వీరబ్రహ్మేంద్రస్వామి,మహావతార్
బాబాజీ ) ఈ ఆరాధన సక్రమంగా చేస్తూ..పారాయణలు,వ్రతాలు చేస్తూ..వారి
అనుగ్రహాన్ని పొందితే వారు మన బాధ్యత తీసుకుంటారు.
అర్చన విధాలు : ముగ్గు,సుగంధము,అక్షతలు,పుష్పము,ధూపం,దీపం,ఉపహారం,తాంబూలం అని ఎనిమిది విధాల భగవంతుడి సగుణరూపాన్ని అర్చించాలి.
అర్పించడమంటే సమర్పించడం...మనకున్న వాటిని భగవంతుడికి సమర్పించడమే
అర్చన....ప్రతి అవసరానికి భగవంతుడిపై ఆధారపడే మనకి ఆస్తులేముంటాయి?
ఈ చరాచర జగత్తుని సృష్టించిన ఆయనకి మనమేమివ్వగలం??ఆయన కోరుకొనేది మనలో దుర్గుణాలు ఆయనకి సమర్పించి....పరిపూర్ణమైన ప్రేమని ఇచ్చి..
ఆయన అనుగ్రహాన్ని పొందమనే ఆయన చెప్పేది.
6.వందనం :
ప్రతి పనిలోనూ..మన ప్రతి కదలికలోను ఆయన మనల్ని ఎలా కనిపెట్టుకుని ఉన్నారో గుర్తెరిగి ఆయనపట్ల కృతఙ్ఞతా భావం కలిగివుండటం
తినే అన్నం..తాగే నీరు...పీల్చే గాలి అన్నీ ఆయనవే....ఉద్యోగం
రాకున్నా,ఉన్నతి కోసం ఇలా ప్రతిదానికి ఆయన్ని ప్రార్థిస్తాం...అన్నీ
ఇచ్చేది ఆయనే కాబట్టి
వందనం అంటే నమస్కరించటం...ఉన్నతమైన వారికి మన
శిరస్సు వంచి నమస్కరిస్తాం..శిరస్సు వంచటం అంటే పెద్దల గొప్పతనాన్ని
గుర్తించి మన అహాన్ని
ఒదలి వారి పట్ల వినయ,విధేయతలు ప్రకటించటం....ఈ వినయ,విధేయతలు వారి సమక్షంలోనే కాదు సుమా..వారికి దూరంగా ఉన్నప్పటికీ వారి పట్ల మనం
అదే గౌరవభావాన్ని ప్రదర్శిస్తాం...అదేవిధంగా భగవంతుడి గొప్పతనాన్ని,ఆయన
సమస్త జీవులలోను ఉన్నారని గుర్తించి సకల జీవరాసుల పట్ల కరుణ,దయ,
ఇతరులతో సోదరభావం కలిగివుండటమే అసలైన వందన సమర్పణ.కేవలం గుడిలో విగ్రహం
ముందు మాత్రమే కాకుండా..మనం ఉన్న ప్రతి చోటా,మనం కలిసే ప్రతి వ్యక్తిలోనూ
జీవించి ఉన్న ప్రతి జీవిలోనూ...
భగవంతుడున్నాడని గమనించి మన ప్రవర్తనని సక్రమంగా మలచుకోవాలి.
7.దాస్యం :
మనం చూస్తున్న ప్రకృతిలో ప్రతిదానిని సృజించింది భగవంతుడే...చూచే
ప్రతిదానిలోనూ,చేస్తున్న ప్రతి పనిలోనూ ఆయన ఉన్నాడు....ఆయనే మనల్ని ఆ పనికి
నియమించారని...అందరికి యజమాని ఆయనే అని..మనం చేసే పని ఆయనని సంతృప్తి
పరిస్తే చాలు అనే సేవ్యభావంతో చేస్తూ..ఆయన సేవకుడిగా మనల్ని మనం
భావించుకోవటం ద్వారా దురహంకారం అంతమయి...ఆయన బిడ్డలమనే సంతృప్తి మనకి
కలుగుతుంది.సత్యసాయిబాబా ఒక సందర్భంలో మనప్రజలు ప్రతిపనిలోనూ భగవంతుడినే
చూస్తారు అని, దానికి ఉదాహరణగా మన లారీ డ్రైవర్లు, లారీని నడపడానికి ముందు
అగరువత్తులు
వెలిగించి స్టీరింగ్కి నమస్కరిస్తారు..చేసే పనిలో
భగవంతుడ్ని చూడటం అంటే ఇదికాక మరేమిటి అన్నారు...దాస్యం అంటే సేవ
చెయ్యటం..పైన ఆరు విధాలుగా
భగవుంతుడికి భక్తిని సమర్పిస్తూ వచ్చిన భక్తుడు ఈ మజిలీలో తన కోసం తను చెయ్యవలిసిన పనంటూ ఏమీలేదని గుర్తించి...అందరిలోనూ,అన్నింటిలోనూ
భగవంతుడ్ని చూస్తూ..వారికి సేవ చేస్తూ భగవంతుడి సేవకి
అంకితమైపోతారు.ఇప్పుడు వీరు నడిచే మార్గమే భగవంతున్ని చేరుకొనే దారి
అవుతుంది.
8.సఖ్యం :
భగవంతుడు అంటే రాయో,రప్పో కాదని...విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అని తెలుసుకుని...ఆయన్ని...తండ్రిగానో..తల్లిగానో...కొడుకుగానో... ప్రియుడిగానో..తాతగానో....మనింట్లో పెద్దవాడిగా గుర్తించి..మనం ఏమి తిన్నా..ఏమి తాగినా ఆయనకి సమర్పించి...మనకెంతో ఇష్టమైన వ్యక్తి పట్ల మనమెలా
ఆదరభావం ప్రదర్శిస్తామో అంతే ఆదరణ,ప్రేమ ఆయనపట్ల చూపిస్తూ..ఆయనకి దగ్గరవ్వాలి..ఒకసారి బంధం అంటూ ఏర్పడితే..మనం అయన్ని ఒదిలిపెట్టినా
ఆయన మనల్ని ఒదలడు.ఇక్కడి వరకూ వచ్చిన భక్తులకి రాయిలో కూడా చైతన్యం కనిపిస్తుంది..రామకృష్ణ పరమహంస వారి జీవితంలో వారు కాళీమాతకి
చేరువైన తీరు గమనించండి... మనకెంతో ఇష్టమైన మనిషితో ఎలా మెలగుతామో ఆయన
కాళీమాత విగ్రహంతో అలా మెలగేవారట..విగ్రహానికి అన్నం తినిపించడం.చామరాలు
వీచటం ఇవి చూచి ఇతరులు ఆయన పిచ్చివాడనుకునేవారట,అంతగా ఆయన భగవంతుడికి
దగ్గరయ్యారు...చివరికి ఆయన కాళిమాతని
మరవలేకపోతుంటే తోతాపురి గురుదేవుల
వారు రామకృష్ణుల వారిని మందలించారట.మూడురోజుల్లో తోతాపురి గురుదేవులవారు
శ్రీరామకృష్ణులవారికి ఆత్మఙ్ఞానాన్ని ప్రసాదించారు....సాయిబాబా గారు కూడా
వారి గురుదేవుల వారిని ఎలా సేవించేవారో సచ్ఛరిత్రలో వివరించారు.మనిషికి
చిట్టచివరి బంధమే గురువు.మనుషులకి భగవంతుడితో దగ్గరగా మెలిగే అవకాశం కేవలం
గురువుల సన్నిధిలోనే కలుగుతుంది.
9.ఆత్మనివేదనం :
మన దగ్గరున్నవన్నీ సమర్పించేశాక మిగిలేది ఆత్మ ఒక్కటే అదే పరబ్రహ్మం.ఈ స్థితిలో భగవంతుడికి,భక్తునికి భేదంలేదు..ఇద్దరూ ఒక్కటే.
సద్గురువుని ఆశ్రయించి...ఆయన్ని అనుసరించి..ఆయన భోదలే జీవితంగా
మలచుకున్నవారు ఆయనే అవుతారు....ఇదే భ్రమరకీట న్యాయం..భ్రమరాన్నే చింతించిన
కీటకం భ్రమరం అవుతుంది...ఇప్పుడు భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు
అవుతాడు...సద్గురు మిలరేపా,సద్గురు ఎక్కిరాల భరద్వాజ మహరాజ్,సద్గురు
సిద్ధప్ప ఇలాంటివారు గురువుగారిని ఆచరించి గురువులు అయ్యారు.ఈ స్థితిలో
వారేమైనా చెయ్యగల సమర్ధులై తమ మార్గంలోకి ఎంతోమంది రావడానికి ప్రేరణ
కలిగిస్తారు...జనన,మరణాల్ని జయించి ఎప్పటికీ జీవిస్తూ తమ భక్తుల,శిష్యుల
బాగోగులు గమనిస్తూ వారికి సన్మార్గాన్ని చూపిస్తారు.
ఆధ్యాత్మికతలో గురువులు ఉపయోగించే పదాలన్నీ నిగూఢంగా వుంటాయి..తిరిగి తిరిగి దాన్ని అలోచిస్తేగానీ దానిలోతైన అర్ధం మనకి అర్ధంకాదు.
పారాయణ ద్వారా నియమబద్ధమైన జీవితానికి అలవాటుపడుతూ..క్రమశిక్షణ కలిగివుండటం అలవాటుగా చేసుకోవాలి... నామం రాస్తూ పోవటం ద్వారా
ఏకాగ్ర దృష్టి పెంచుకోవాలి....నామానికి, రూపానికి, గుణానికి
(పంచభూతాలకి,పంచతత్వాలకి) అతీతమైన భగవంతుడు ధ్యానంలో మాత్రమే
కనిపిస్తాడు(వినిపిస్తాడు).ధ్యానం చేస్తూ భగవంతుడికి దగ్గరవ్వాలి.మరి భగవంతుడిపై మనకి ప్రేమ కలగాలంటే ఏం చెయ్యాలి??
మహాత్ముల,భక్తుల,సద్గురువుల,వారి
శిష్యుల జీవిత చరిత్రలు చదువుతూ వారు ఏ విధంగా చేసారో గమనిస్తూ...వాటిని
ఆచరిస్తూ పోతే..మనం అన్నిటినీ ఒదులుకోవటానికి సిద్ధపడగానే భగవంతుడు
అంతులేని ప్రేమ అనే సంపదని ప్రసాదిస్తారు.
పఠించవలసిన గ్రంధాలు :
*శ్రీ శిరిడీ సాయి సచ్చరిత్ర
*శ్రీ నృసింహ సరస్వతీ మహరాజ్ల వారి శ్రీ గురు చరిత్ర (పారాయణం)
*శ్రీ శ్రీపాదవల్లభ మహరాజ్ల వారి చరిత్ర.
*భాగవతం
*ఆధ్యాత్మ రామాయణం
*యోగవాసిష్టం
*భగవద్గీత
*అష్టావక్రగీత
*మహాత్ముల, భక్తుల చరిత్రలు
*బైబిల్
*ఖురాన్
*హిమాలయ యోగులు
*ఒక యోగి ఆత్మకథ
*నారద భక్తిసూత్రములు
*శాండిల్య భక్తిసూత్రములు
*నవనాధుల చరిత్ర
*శ్రీ గురుగీత
*శ్రీ రామకృష్ణ పరమహంస,రమణ మహర్షి(అరుణాచలం),శ్రీ వీరబ్రహ్మేంద్ర
స్వామి,శ్రీ స్వామి వివేకానంద,శ్రీ రాఘవేంద్రస్వామి వంటి మహాత్ముల చరిత్రలు
బిల్వమంగళుడు,భక్త జయదేవుడు,భక్త తుకారాం,కబీరు దాసు ,శ్రీ రూప
సనాతనులు,భక్త యవనుడు హరిదాసు,భక్త రఘునాధదాసు,భక్త కన్నప్ప,రామభక్త శబరి
వంటి పరమ భక్తుల చరిత్రలు చదవటం,ఆచరించడం ద్వారా మనం గమ్యాన్ని సులువుగా
చేరుకోవచ్చు.
*నేను దర్శించిన మహాత్ములు (రచన: సమర్ధ సద్గురు ఎక్కిరాల భరద్వాజ మహరాజు)
*ఏది నిజం,మతమెందుకు,విఙ్ఞాన వీచికలు,ధ్యానయోగ సర్వస్వం
Jagadguru Bodhendra Swamigal

Jagadguru Bodhendra Swamigal was born in Kancheepuram. Kancheepuram is
one of the 7 moksha shethrams in India and the only one in South India.
Jagadguru Bodhendra Swamigal
There were a couple in Kancheepuram by name Kesava Pandurangan and
Suguna. They did not have a kid for quiet some time. They prayed to
their guru, Vishwadikendhra Saraswathi, who was then the pontiff of
Kanchi mutt. He blessed them that they would have a child very soon and
they returned happily. They then had a male child born to them shortly.
They named him Purushothaman. Purushothaman was a very bright kid. They
performed his upananyanam (sacred thread ceremony) and took him to their
guru Vishwadikendhra Saraswathi. Their guru enquired who the kid was
and they replied that it was the Guru’s kid. The guru then asked Kesava
Pandurangan if he would give the kid to the mutt if he really meant that
he was his kid. Kesavan then told his Guru that he would check with his
wife and let him know. He then stepped back to speak to his wife. They
knew that if they give him to the mutt he would become a sanyasi and
that their lineage can not continue as he was their only son. Suguna was
now crying and when her husband asked her the reason, she said that she
was crying for the only reason that he had told their guru that he
would check with her and then give their son. She then said that she and
the kid belonged to him and that he belonged to his guru, and there was
no need to ask her for permission. Kesava Pandurangan then happily gave
Purushothaman to Vishwadikendhra Saraswathi. The guru arranged for a
teacher who would teach Purushothaman all the Vedas and sastras.
Purushothaman studied along with another boy called Gyanasakaran. He
finished all his studies when he was only 18. The only thing left to be
learned was Bhramavidhyai and he wanted to learn this from his Guru and
Vishwadikendrar had also promised that he would teach him Bhramavidhyai
personally. However Vishwadikendrar had gone on a yatra and was now in
Kasi. Purushothaman and Gyanasakaran had to go by walk from Kanchi to
Kasi. One day they started their journey to Kasi to meet their guru.
Gyanasakaran was good in astrology and knew that he would die on the way
to Kasi. As they were close friends he told Purushothaman that if
something happens to either one of them the other should perform their
death ceremony and then give up his life in the Ganges so that both of
them can be together even after death. They had only covered half the
distance and Gyanasekaran suddenly fell ill and passed away. After
performing his death ceremony Purushothaman continued his journey to
Kasi. On reaching Kasi he met his guru prostrated to him and told him
what had happened to them on their way. He then asked his guru’s
permission to give up his life in the Ganges. The guru felt bad as he
had planned to make Purushothaman as the next pontiff of the mutt. He
then told Purushothaman that if he has do what he promised to his friend
and also do what he wanted him to do there was a solution and asked him
if he would agree to it. Purushothaman immediately replied that he
would agree to his Guru’s words. The Guru then said that getting in to
Sanyasa ashram was like having a new birth. This way he would keep up
the promise made to his friend and also keep him happy by becoming the
next pontiff of the mutt. Vishwadikendrar then gave him sanyasa and
named him as Bagavannama Bodhendrar. He then stayed in Kasi and learnt
everything from his guru. His guru then asked him to go back to south
India and do Nama pracharam and show the power of Bagavan Nama.
There was a great saint called Lakshmidharar in Puri, who had written a
book called Bagavannama kowmudhi which was a nama siddhantha grantham.
Vishwadikendrar had also instructed Bodhendrar to collect this book on
his way back and wanted him to master that that book too. He then came
to Puri had darshan of Lord Jagannath and then went to Lakshmidharar’s
house. Lakshmidharar had passed away and his son Jagannatha Pandit was
there. It was evening and the house was locked from inside. Bodhendrar
not wanting to disturb them sat down outside the house and started
meditating.
A few days earlier an event had happened there. A
couple from south India had come on a yatra to Kasi. One night when they
were staying in that village the husband woke up the next morning and
found that his wife was missing. He searched for her the next morning
and could not find her. He then told the villagers about this and they
said that some Muslims would come in the night and kidnap any women they
find and take them to be with them as their mistress. The husband felt
very bad hearing this but dint want to stop his Kasi yatra because of
this.
He completed his yatra and was returning back through the
same village that day. He was performing his rituals in the river and a
Muslim lady seeing him came running to him and started crying to him.
He then realised that it was his wife. When he asked her what had
happened, she told him that there was no time now and that they have to
escape now and promised to tell him what happened later. They then ran
through the forest and came to a safer place. The lady then told him
that they had kidnapped her in the night by tying her mouth with a cloth
and ravished her. She then asked her husband to save her from them and
asked him to have her as maid if not as a wife. The husband then told
her that if the sastras allowed this he would take her. They then
decided to come to see Jaganatha Pandit to check with him on what the
Dharma sastras say.
The couple reached Jaganatha Pandit’s house
the same night to ask him what the Dharma Sastras say. Bodhendrar was
meditating outside the house and they knocked the door to wake up
Jaganatha Pandit. When he opened the door they told him their story and
feel on his feet asking him to give them a solution. Hearing this he
asked her to say Rama Rama Rama and after that they could live together.
As he said this his mother who was seated inside asked him why he
degraded the power of Rama Nama by asking them to say it 3 times and
told him that his father would ask even the biggest sinner to utter Rama
only once and that would take care of removing all his sins. Bodhendrar
who was sitting there now stood up and asked Jaganatha Pandit if there
was any proof for what he was saying. Jaganatha Pandit then said that
his father’s book had the proof for the same. Bodhendrar then asked him
to show the book. Bodhenrar finished reading the book the same night
with the help of a small lamp. The next day he called the couple and
Jaganatha Pandit and said that the sastras were true and that his father
had mentioned very clearly what he told yesterday, but the outside
world wouldn’t believe this. Bodhendrar then asked the couple to go to
the river and take a dip after chanting Rama nama. He then said that
though she is now wearing a Muslim dress once she takes a dip after
chanting Rama nama she will get back to her old attire and become as
pure as how she was before she left her husband. The entire city
gathered on the river bank to see this event. The lady came and
prostrated Bodhendral and he asked her if she believes that by saying
Rama nama all her sins would go away. The lady said that she doesn’t
know about Rama nama but she believes him and considers him as her guru.
She then said Rama and took a dip in the river. As she came out she had
flowers in her head, kumkum in her forehead and turmeric applied all
over her body. On seeing this everyone started chanting Rama nama and
she happily went to her husband. The couple then prostrated to
Bodhendral and took his blessing. Bodhendral then continued his yatra to
south India.
On reaching Kanchi he wrote several books as
desired by his guru. Some of them that are available today are
Bagavannama Rasodhayam, Bagavannama Rasarnavam, Bagavannama Rasayanam.
Our guru Sri Krishna Premi Maharaj has translated Bagavannama Rasodhayam
in Tamil and the same is now available for people who don’t know
Sanskrit. Botherndral was waiting for his guru to come back so that he
could show his books to him. Vishwadikendhra Saraswathi finished his
yatra and came back to Kanchi. Vishwadikendhra Saraswathi was very happy
with his work and asked him to preach the importance of Bagavan Nama.
Bodhenral then travelled across India and made everyone chant Rama nama
and also preached that the only way to attain god in this Kaliyuga was
chanting the name of god.
Sridhara Ayyaval, of Tiruvisanallur
was a contemporary to Bodhendral. He was elder to Bodhendral. They
happened to meet each other once and after that they would go together
to the villages to do Nama pracharam. They would go to a village and
initiate everyone in the village with Rama nama. Once done they would
move to the next village. Bodhendral once came to a village called
Perambur. One day he was invited by a person to his house for Biksha
(lunch). His son was dumb (incapable of speaking). Bodhendral would go
to places only where people chanted Rama nama. So he initiated him with
Rama nama and also asked him to ask his wife to chant the name of Rama
while cooking. When Bodhendral came to his house for lunch he felt very
bad that there was no way for his son to say Rama nama as he was dumb.
He then felt that his nama siddhantam could not help people like him to
reach god. After the lunch when the family prostrated to Bodhendral he
was filled with tears in his eyes for the boy. On seeing this, the man
said that it was his destiny to be born like this and asked him not to
be worried about him. Bodhenral then told him that he was only worried
about how he would attain god and not because he is dumb. The man
immediately told him that now he knew that his son will definitely reach
god as there is a guru who is bothered about him. He also said that his
guru kripa will help him attain god. After that the kid automatically
started chanting Rama nama in his mind. Forever he would be with
Bodhendral and do service to him. Bodhendral was about to leave Perambur
after 4 months and the kid started crying as he could not bear the
detachment from his guru. Bodhendral then gave him his Sri Padukas and
left.
Bodhendhral made the Nawab of Arcot as his disciple.
Arcot was hit by plague once and there was no treatment for this. The
Nawab was also attacked by plague and it so happened that Bodhendral was
there in Arcot then. The people in the city went and told their problem
to Bodhendral who then asked them to get together and chant Rama nama.
Once they did this everyone were cured and there was no trace of plague
in the city. The Nawab then gave some land to his mutt and became his
follower.
During his yatra Bodhendral once went to a village
called Thirukokarnam for nama pracharam. He was initiating everyone in
that village with Rama nama. A dassi came there to him and asked if she
could also chant Rama nama and if he would initiate her. Bodhendral
initiated her with Rama nama without any hesitation. Those days
sanyasi’s were not even allowed to speak to women and when he directly
initiated a women that too a dassi, the villagers started speaking ill
about him. After some days Bodhendral left the village. The dassi was
chanting Rama nama religiously and would chant though out the day.
Bodhendral happened to come back to that village after some time. By the
time Bodhendral came back she had finished chanting crores of Rama
nama. The dassi came to have a darshan of Bodhendral and after
prostrating to him she left this world through Kabala moksham(spirit
leaving the body, opening the top of her skull at her own will) in front
of her guru like how a yogi leave this world. The villagers were
surprised seeing this and realised their mistake.
One day kids
were playing in the banks of Kaveri. They would keep their feet in the
mud and close it with mud and then remove the disappeared leg from the
sand. Bodhendral had now planned to leave this world, so he went to the
children and said that he would come out if they buried him inside the
sand. Taking this for true the kids dug a pit and asked him to get
inside. They then closed him completely with sand while he was
meditating. Next day people in the village were searching for Bodhendral
and they couldn’t find him. The kids then told them that he is buried
under the sand and that he had asked them to do that. The villagers were
now frightened. They then decided to start digging there and all of a
sudden there was a voice saying that he was in Samadhi here and that no
one should disturb him. After a few years the exact location of his
Samadhi was forgotten as they had not build an Adhishtanam.
After 100 years of his Samadhi, Maruthanallur Sadguru swamigal decided
to find his Samadhi and build an Adhishtanam around it. He searched for
the exact location in Govindapuram. He would tie his legs and crawl on
the river bank as he did not want to accidentally touch the Samadhi on
his feet. At one place he could hear Rama nama being chanted and he
immediately found out that it was the location where Bodhendral had
attained Samadhi. He then went to Maharashtrian king who was then ruling
Thanjavore and with his help built the Adhishtanam there.
No comments:
Post a Comment