*తెలుగు రాష్ట్రాల్లో మన దేవాలయాలు వాటి ప్రముఖ్యత -25*
🛕
*కర్నూలు జిల్లా*
*మంత్రాలయం : రాఘవేంద్రస్వామి
రాఘవేంద్రస్వామి మహిమాన్వితుడైన మహాపురుషుడు, పండిత ప్రవరుడు. యోగి, తుంగభద్రా తీరాన ఆదవాని సమీపంలో మంత్రాలయం మహాక్షేత్రంగా నేడు పరిగణింప బడుతోంది. అది రాఘవేంద్ర స్వామి బృందావనం. అనగా వారి సమాధి స్థానం. కర్నూలు జిల్లాలోని మంచాల గ్రామము. స్వామివారి మహిమచే మంత్రాలయ క్షేత్రమె వెలసినది.
బొంబాయి-మద్రాసు బ్రాడ్ గేజి రైలు మార్గంలో ఆదోని దగ్గర వున్న తుంగభద్ర రైల్వేస్టేషన్ లో దిగి, బస్సుమీద మంత్రాలయం చేరవచ్చు. అక్కడికి తొమ్మిది మైళ్లు, కర్నూలు, ఆదోని పట్టణాలనుంచి బస్సులో వెళ్ళడానికి సదుపాయములున్నవి. మంత్రాలయంలో యాత్రికులకు దేవస్థానం వారిచే వసతి గృహాలు ఉచితంగా ఏర్పాటు చేయబడతాయి.
ఇప్పటికి మూడు శతాబ్దులకు పైగా అయినది. రాఘవేంద్రస్వామి వారి పూర్వాశ్రమ వృత్తాంతం పెద్దలు చెప్పుకుంటారు. వారు మాధ్వ బ్రాహ్మణులు. వారి తాత ముత్తాతలు విజయ నగర చక్రవర్తుల కాలంలో వైణిక విద్వాంసులుగా పేరు పొందినారట. శ్రీకృష్ణ దేవరాయల అనంతరం రాఘవేంద్రుని తండ్రిగారు తిమ్మన భట్టు విజయనగరం విడిచి కంచి దగ్గర భువనగిరి చేరుకున్నారు. తిమ్మనభట్టు భార్య గోపమ్మ. ఈ పుణ్య దంపతులకు వేంకటేశ్వరస్వామి సేవా ఫలముగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగినారు. కుమారుని పేరు వెంకట భట్టు. గొప్ప మేధావి. ఆయన చిన్ననాటి నుంచి శ్రద్ధా భక్తుల తో విద్యాభ్యాసం చేసి తర్కవ్యాకరణ వేదాంత శాస్త్రాలు, తన అక్కగారి భర్త అయిన గురురాజా చార్యుల వారితో వీణావాద్యంలో నైపుణ్యం సాధించారు. సుధీంద్ర భర్తయైన లక్ష్మీ నరసింహా చార్యుల వద్ద అధ్యయనం చేశారు. అన్నగారు తీర్థులవారి శిష్యులయ్యారు. తమ ముప్పదవ యేట వివాహం చేసికున్నారు. భార్యపేరు సరస్వతి. వీరికి పుత్రుడు కలిగాడు. పుత్ర ముఖావలోకనం చేసిన తరువాత వెంకట భట్టు సుధీంద్ర తీర్ధస్వాముల ఆజ్ఞతో ఆశ్రమ స్వీకారం చేసి రాఘవేంద్ర స్వామిగా పేరుపొందారు.
భార్య సరస్వతికి ఈ వార్త తెలిసి పతి ఎడబాటు భరించలేక బావిలోపడి చనిపోయినదట. ఆ కారణంచే ఆమె పిశాచమైనది. స్వామివారది తెలుసుకొని మంత్రశక్తిచే ఆమెను పిశాచ జన్మ నుండి విముక్తురాలిని చేశారని జనశ్రుతి.
సన్యాసాశ్రమం స్వీకంచిన స్వామి శ్రీరంగం, కంచి, రామేశ్వరం, మధుర మొదలైన క్షేత్రాలు సేవించుతూ మధ్వాచార్యుల స్థానమైన ఉడిపి వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకున్నారు. చివరకు తుంగభద్రా తీరంలో వున్న ''మంచాల' తాము సిద్ధి పొందడానికి తగిన స్థలమని నిర్ణయించుకున్నా రు. ఆ రోజులలో ఆదవాని నవాబు సిద్ది మసీదు ఖాన్. అతడు రాఘవేంద్రస్వామి మహిమ గుర్తించి మంచాల గ్రామాన్ని ఆయనకు సమర్పించాడట. మంచాలమ్మ గ్రామదేవత. రాఘవేంద్ర స్వామి ఆ దేవతాలయం ప్రక్క క్రీ.శ. 1670 లో సజీవ సమాధిలో ప్రవేశించారు. శ్రావణ బహుళ విదియ గురువారం బృందావనస్థులై నారు. పన్నెండు వేల సాల గ్రామాలతో నిర్మించ బడిన ఆ స్థానం శుద్ధ మృత్రికచే మూయబడినది. ఎంతో పవిత్రంగా భావించబడుతూ ఉంటుంది.
📖
మంత్రాలయానికి ఆనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. స్వామిని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వాంఛిత సిద్ధి పొందుతూ వుంటారు. రాఘవేంద్ర స్వామి ఆశీర్వచన ప్రభావంచే రోగనివారణ చేసికోవచ్చునని భక్తుల విశ్వాసం. మంత్రాలయంలో వేదపాఠశాల వుంది. ప్రసిద్ధులైన వేదశాస్త్ర పండితులు అక్కడ అధ్యాపకులుగా వుంటున్నారు. మంత్రాలయం సర్వజన దర్శనీయమైన క్షేత్రం. రాఘవేంద్రస్వామి ప్రహ్లాదుని అవతారమని చెబుతారు.
📖
*మహబూబ్ నగర్ జిల్లా*
*అలంపురం*
తుంగభద్రా నదీతీరంలో మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న ఈ అలంపురములోని ఆలయములు అసంఖ్యాకములు. 7, 8 శతాబ్దాలలో ఇక్కడ పరిపాలించిన చాళుక్యులు ఈ ప్రాంతములోని ఆలయ నిర్మాణ కారకులు. 9వ శతాబ్దములో రాష్ట్రకూటులు, 10, 11 శతాబ్దములలో కళ్యాణ చాళుక్యులు వారి రాణులు, సామంతులు ఈ ఆలయాల ఉద్ధరణకు ఎంతో తోడ్పడిరి. తరువాత బహమనీ సుల్తానుల పరిపాలన కాలములో ఈ ఆలయములన్నియు ధూపదీప నైవేద్యములు లేక జీర్ణస్థితిలోనికి జారుకొన్నవి. కొన్ని నాశనస్థితికి చేరుకొన్నవి. ఇక్కడ అసలు తారక బ్రహ్మాలయము నేలమట్టము చేయబడిన దనియే చెప్పవలెను. ఆ తరువాత శ్రీకృష్ణ దేవరాయలు, ముస్లిమ్ పరిపాలకులు, కొందరు దొరలు ఈ ఆలయముల రక్షణకు దోహదము చేసిరి.
రాయచూరు విజయ యాత్రానంతరము 1521 లో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రాంతమునకు వచ్చి ఆలయములకు అనేక గ్రామములనిచ్చి 'బసవరాజు' అను నతని ఆ పట్టణానికి, ఆలయానికి సంరక్షకునిగా నియమించినట్లు గలదు. ఆ కోట గోడలమీద మహాభారత కథల శిల్ప విన్యాసములను చూడగలము.
దేవాలయమునకు వెనుకనున్న అర్ధనారీశ్వర కుడ్యచిత్రము, గంగావతరణమును కన్నులకు కట్టినట్లు చూపు చెక్కడము యాత్రీకులకు ఎంతో ఆనందానుభవాన్ని కలుగచేయును

No comments:
Post a Comment