వింధ్యాచల ధామం🌹
దేవీభాగవతంలో వర్ణించిన 108 శక్తిపీఠాల్లో 'వింధ్యాచల ధామం' కూడా ఒకటి. శరన్నవరాత్రుల్లో ఇక్కడికి యాత్ర చేయటం చాలా శ్రేష్ఠం. ఇక్కడ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఉండటం వల్ల 'త్రికోణయాత్ర'గా పరిగణింపబడుతుంది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా కేంద్రం నుండి కేవలం 8 కి.మీ. దూరంలో ఈ వింధ్యాచల ధామం ఉంది. గంగాతీరం, వింధ్యపర్వత పంక్తివల్ల ఈ ప్రదేశంలో ప్రకృతి రమణీయకత సుమనోహరం.
వింధ్యాచల ధామంలోని ప్రధాన ఆలయం వింధ్యవాసిని. ఇది వింధ్యాచలం ముఖ్యవీధిలో ఉంది. ఈ ఆలయంలో కౌశికీదేవి విగ్రహం దాదాపు రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆవిడ పాదాల కింద సింహ విగ్రహం కనిపిస్తుంది. ఈ దేవి ఆవిర్భావం గురించి దుర్గాసప్తశతిలో ఒక కథ ఉంది. శుంభ నిశుంభ దైత్యుల చేత హింసింపబడే దేవతలు శక్తిని ఆరాధించే సమయంలో, అక్కడికి పార్వతీదేవి దయజేసింది. "మీరు ఎవరి పూజలో ఉన్నారు?" అని పార్వతి. ప్రశ్నించింది. అదే సమయంలో ఆ జగన్మాత శరీరం నుండి ఒక తేజోమయమూర్తి వెలువడి, "ఈ దేవతలు నన్ను ఆరాధిస్తున్నారు" అంది. పార్వతీదేవి కోశం నుండి ఉద్భవించింది కనుక ఆమెను కౌశికీదేవి అన్నారు. వింధ్యాచలంలో నివసిస్తున్న కారణంగా ఆమెకు వింధ్యవాసిని అని పేరు వచ్చింది.
చాలా మహిమాన్వితమైన ఈ ప్రదేశం ఆద్యాశక్తికి మూలస్థానం. మనువు సాధన చేసినప్పుడు అక్కడ భగవతి ప్రత్యక్షమైందని దేవీభాగవతంలోని కథనం. అప్పటి నుండి ఆమె వింధ్యాచలాన్ని తన స్థిరనివాసం చేసుకుంది. అక్కడి స్థానికులు ఆమెను 'కజరీదేవి' అంటారు. గానంలో 'కజరీశైలి' ఇక్కడే ప్రారంభమైందని ప్రతీతి. ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో ఇక్కడ 'కజరీ' పేరుతో సాంస్కృతిక సమ్మేళనం జరుగుతుంది. శాక్తమతం పాటించేవారు- దుర్గాసప్తశతిలో వర్ణించిన మహాలక్ష్మీ స్వరూపం వింధ్యవాసినీదేవి అని భావిస్తారు.
వింధ్యవాసిని ఆలయానికి పశ్చిమంలో బారహ్ భుజాదేవి ఆలయం, మరొక మండపంలో 'ఖర్వరేశ్వర మహాదేవ' స్థాపన ఉంది. వింధ్యేశ్వర మందిరానికి దక్షిణంలో మహాకాళి, ఉత్తరంలో ధర్మధ్వజాదేవి ఉన్నారు. వింధ్యాచలంలోనే గంగాతీరంలో వింధ్యేశ్వర శివలింగం, అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంటారు.
వింధ్యాచల సమీపంలో కాళీఖోఫ్ అనే పర్వతగుహలో ప్రసిద్ధి చెందిన మహాకాళీ మందిరం ఉంది. ఇది 'త్రికోణయాత్ర'లో రెండవ మజిలీలోని మహాకాళీ స్వరూపంగా భావింపబడుతుంది. దుర్గాసప్త శతిలోని వివరణ ప్రకారం- శుంభ నిశుంభులతో ఘోరసంగ్రామం చేసేటప్పుడు భగవతికి అమితక్రోధం కలిగింది. ఆ సమయంలో ఆమె ఫాలభాగం నుండి భయంకరంగా ఒక దేవి ఉద్భవించింది. ఆమె శుంభ నిశుంభుల సేనాపతులైన చండ-ముండాసురులను సంహరించి రక్తబీజుని రక్తం పానం చేసింది. ఆమే చాముండాదేవి.ఈ దేవి కాళీఖోఫ్లో మహాకాళీ స్వరూపంతో వెలసింది.
కాళీఖోఫ్ సమీపంలోనే భైరవస్వామి స్థానం, పర్వతంపై కొంత ఎక్కాక గేరువా సరస్సు ఉన్నాయి. అక్కడి జలం కాషాయవర్ణంలో ఉంటుంది. అక్కడ నుండి దాదాపు వంద మెట్లు కిందికి దిగితే సీతాకుండ్ అనే ప్రదేశం ఉంది. లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు. సీతాదేవికి విపరీతంగా దాహం వేసింది. అప్పుడు లక్ష్మణస్వామి బాణప్రయోగం చేస్తే భూమినుండి జలధార పైకి ఉబికిందని, అదే సీతాకుండ్ అని భక్తులు చెప్పుకొనే ఒక కథనం.
సీతాకుండ్ దగ్గరా అష్టభుజాదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. కంసుని కారాగారంలో ఉన్న దేవకీదేవి గర్భం నుండి శ్రీకృష్ణుడు జన్మించిన సమ యంలోనే యశోదాదేవి ఒక బాలికను ప్రసవించింది. వసుదేవుడు బాలకృష్ణుడిని యశోద పక్కన ఉంచి, ఆమె కూతురుని మధురకు తీసుకొచ్చాడు. దేవకీదేవి ప్రసవించిందని తెలుసుకొని కంసుడు కారాగారానికి వచ్చాడు. ఆమె దగ్గరున్న శిశువును వధించాలనే క్రోధంతో కంసుడు బాలికను చేతిలోకి తీసుకొని గాలిలోకి విసిరేయగా అష్టభుజాదేవిగా ప్రత్యక్షమైంది. ఆమెయే వింధ్యాచలంలో వెలసింది. ఈమెను 'మహాసరస్వతీ' పేరుతోనూ పిలుస్తారు. త్రికోణయాత్ర మూడవ మజిలీలో ఈ దేవి మహాసరస్వతిగా దర్శనమిస్తుంది. అక్కడకి కొంత దూరంలో భైరవాలయం, భైరవకుండం ఉన్నాయి. దగ్గరలో మచ్చందరాకుండం ఉంది. ఆ పర్వతం నుండి కిందికి దిగితే శీతలాదేవి మందిరం. అక్కడ సరోవరతీరాన హనమంతుని ఆలయం దర్శనమిస్తుంది. వింధ్యాచలంలో 'మంగళాదేవి' ఆలయం కూడా చూడదగింది. దీనిని శ్రీరాముడు స్థాపించాడు. గంగా తీరంలో రామ్ గయా అనే ప్రదేశం దర్శనీయం. అక్కడ శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు.రామ్ గయా ఘట్టం పై రామేశ్వర మహాదేవుని ఆలయం ఉంది. దీనిని కూడా శ్రీరాముడే నిర్మించాడని ప్రతీతి. ఇక్కడికి కొంతదూరంలో తారాదేవి గుడి ఉంది.
వింధ్యాచలం చేరటానికి రోడ్డుమార్గం, రైలుమార్గం, వాయుమార్గం ఉన్నాయి. దగ్గర్లోని విమానాశ్రయ కేంద్రం వారణాసి. అక్కడికి 90 మైళ్ల దూరంలో ఉంది. వింధ్యాచలంలో చిన్న రైల్వేస్టేషన్ కూడా ఉంది. బస చేయటానికి హోటళ్లతో బాటు ధర్మసత్రాలు కూడా ఉన్నాయి. వింధ్యాచలం యాత్రకు సెప్టెంబరు-అక్టోబరు; మార్చి-ఏప్రిల్ నెలలు అనువైనవి.
యే మనుష్యః మాం ఆశ్రతః!
తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!
No comments:
Post a Comment