ధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములు
సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనుస్సు రాశికి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. *ఆగ్నేయ (అగ్ని) పురాణము* ప్రకారము ఈ మాసము శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతిపాత్ర మైనది. ధనుర్మాస వ్రతమును ఆచరించు వారికి ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైనది.
శ్రీమహావిష్ణువు పుష్ప, శ్రీగంధమాల్య, మణి మౌక్తిక, పీతాంబర అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింప వలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో ఏ దేవాలయములో చూసినా బ్రాహ్మీముహూర్తములోనే పూజలుమొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.
ధనుర్మాస వ్రత కథ
పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మదేవుడు హంస రూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి కావాలని, ఆ హంసపైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును కలిగించాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ, సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని, *నీ తేజో బలము క్షీణించు గాక* యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై, తన ప్రకాశమునంతటినీ పోగొట్టుకున్నాడు.
దానితో మూడులోకాలూ అల్లకల్లోలమైనవి. సూర్యుడి తేజము చాలినంత లేక, జపములు, తపములు, హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు, ఋషులకే గాక, సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులుమొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో,దేవతలు అనేక సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే, సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు.
సూర్యుడు తాను ధనూరాశిని ప్రవేశించగనే ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే అతడి శాప విమోచనము అవుతుంది.అని బ్రహ్మ తెలిపినాడు. బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు పదహారు సంవత్సరముల పాటు ధనుర్మాస విష్ణు పూజను చేసి తిరిగి తన తేజస్సును ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడి నుండీ మొదలైన ఈ పూజ తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది, తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా విజయ వంతంగా జరుగుటకు వారుకూడా ధనుర్మాస పూజ సూర్యోదయపు మొదటి జాములో ఆచరించుట మొదలు పెట్టినారు.
అగస్త్య మహర్షి, విశ్వామిత్రుడు,గౌతముడు, భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు, ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమునుఆచరించినారని వివిధ పురాణములలో ఉంది.
ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యము లైన వివాహ, గృహ ప్రవేశ, ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. ఏమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహావిష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును.
ముద్గాన్న నైవేద్యము
ఈ ధనుర్మాసములో మహావిష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [పెసర పప్పుతో చేసిన పులగము] దీని గురించి *ఆగ్నేయ పురాణము* లో ఇలాగుంది,
ధనూరాశిలో సూర్యుడు ఉండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు అని వివరిస్తుంది
ఈ నైవేద్యమును పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము,
బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే, బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము, బియ్యమునకంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను.
అంతే కాదు పెసర పప్పు, పెరుగు, అల్లము, బెల్లము, కందమూలములు, ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహావిష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు అని పురాణము తెలుపుతుంది.
అందుకే, ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [పొంగల్] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహా విష్ణువును పూజించి కృతార్థులై, ఆయన కృపకు పాత్రులు కాగలరు.
తిరుప్పావై అంటే ఏమిటి …..?
తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ''తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.
తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.
సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగి రోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.
శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగి తేలినవారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.
భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.
తిరుప్పావై మొదటిరోజు పాశురం
తిరుప్పావై
1. పాశురము :
*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !
భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.
తిరుప్పావైగీతమాలిక
అవతారిక:
వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.
1వ మాలిక
(రేగుప్తి రాగము -ఆదితాళము)
ప.. శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!
అ.ప.. మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!
1. చ.. ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
యశోదమ్మ యొడి యాడెడు - ఆ బాల సింహుని
నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి
2. ఛ. ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరం
Read More