1834లో భారత్ కంటే ఇంగ్లాండ్ లో స్కూళ్ల సంఖ్య తక్కువా ?!?!
ఒక దేశం...సంపన్నతకి, బుద్ధి శ్రేష్ఠతకి, సంస్కార సంపదకి, మానవతా స్థాయికి, సద్గుణాలకు , సదాచారాలకు, జీవన మూల్యాలకు ఆ దేశ విద్యా విధానమే మూలాధారం అవుతుంది. భారత దేశానికి కూడా తనదైన ఒక బోధనా శాస్ర్తం ఉంది. అది వేల సంవత్సరాల నుంచి వికసిస్తూ వచ్చింది. మన విద్యా కేంద్రాల ప్రఖ్యాతి ఒకనాడు విశ్వమంతా వ్యాపించింది. మన ఈ విద్యా బోధనా పరంపర..., ఈ జగతిలోనే శ్రేష్ఠమైందని పేరు పొందింది. మన ప్రాచీన రుషులు ఈ బోధన శాస్ర్తాన్ని శిక్షా దర్శనం అన్నారు. అయితే మన బోధన రంగం ఇప్పుడు అవ్యవస్థకు లోనైంది. వ్యక్తిగత స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎక్కడా మంచి ఫలితాలు రావడం లేదు. మన ఆలోచనా విధానమే పెడదారి పట్టింది. భారతీయ విద్యా వ్యవస్థకు ఏం అయ్యింది...?
ప్రాచీన కాలం నుంచే మన దేశంలో సమాజ రచన యావత్తూ వ్యక్తిగత గుణాలు, అవగుణాలు, సామాజిక శిష్టాచారాలు, వ్యాపారాలు, కళలు, వృత్తులు, పరిపాలన, తత్త్వ చింతన, మనోవిజ్ఞానం, రాజనీతి శాస్త్రాలు, విజ్ఞానం, తంత్రజ్ఞానం, వ్యవసాయం, వ్రతాలు, పండుగలు మొదలైన చిన్నా పెద్ద విషయాలన్నీ కూడా ఈ జీవన దర్శనంపైనే ఆధారపడి ఉన్నాయి. విద్యా రంగంలో కూడా అన్ని శాస్ర్తాల మూల సిద్ధాంతాలలోను ఈ జీవన దర్శనం పూసలలో దారంవలె ఉంటూ వచ్చింది.
జీవన దర్శనం, జీవన శాస్ర్తం, జీవన వ్యవహారం, జీవన వికాసం, విద్యా బోధన వీటి మధ్య సామరస్యం ఉన్న కారణంగా భారత దేశం చిరంజీవి అయ్యింది. బ్రిటీషు వాళ్లు తమ బోధన మాధ్యమం ద్వారా మన దేశానికి తీరని నష్టం కలిగించారు. వాళ్లు మొఘల్ లు లాగా విద్యాలయాలను ధ్వంసం చేయలేదు. విద్యాంసులను వధించలేదు. గ్రంథాలయాలను తగులబెట్టలేదు. పైగా విశ్వ విద్యాలయాలను స్థాపించారు. గ్రంథాలను రచింప చేశారు. విస్తృతమైన బోధన వ్యూహాలను తయారు చేశారు. కానీ విశ్వవిద్యాలయాలలోను, పాఠశాలలోనూ బోధించబడే పాఠ్యాంశాల ద్వారా, పాఠ్య ప్రణాళికల ద్వారా మన జీవన దర్శనాన్నే తారుమారు చేశారు.
ఏ విషయాన్నైనా మూలాల్లోకి వెళ్ళి కొద్ది మార్పులు చేస్తే దాని సమగ్ర స్వరూపమే మారిపోతుంది. భారత్ విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రిటీష్ వారు, వారి తర్వాత మెకాలే, మార్క్స్ వాదులు ఇదే చేశారు. ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. అటు ఐరోపా విధానం, ఇటు భారతీయ ప్రాచీన విధానం రెండు కలగాపులగమైపోతున్నాయి. ఫలితంగా దేశంలో అస్థవ్యస్థ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టే భారతీయ జీవన దర్శనం ఆధారంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.
ఇంతకీ 17వ శతాబ్దంలో ఇంగ్లండులో విద్యావిధానం ఎలా ఉండేది ? బ్రిటన్ లో సండే స్కూళ్లను ఎందుకు ప్రారంభించారు ? మన దేశంలో కంటే ఇంగ్లండులోనే ఆనాడు పాఠశాలలు తక్కువగా ఉండేవా ? ఇంగ్లండులో విద్యను కేవలం ధనవంతులకు మాత్రమే బోధించేవారా ? ఇంతకీ అసలు నిజం ఏమిటీ?
భారతీయ విద్యావ్యస్థకు గురించి ఇంగ్లీషు కళ్లతో ఇండియాను చూసే మేధావులు, కుహనా సెక్యులర్ వాదులు, జాతీయ చింతన లేని జాతీయ నాయకులు, మార్క్స్ వాదులు అదేపనిగా అబ్దాలను ప్రచారం చేశారు. మన దేశంలో ఆధునిక విద్య అనేది ఇంగ్లీషువాడు మనకు పెట్టిన భిక్ష...! బ్రిటీష్ వాళ్లు దేశంలో అడుగు పెట్టక ముందు....ఇక్కడ విద్య ఉన్నా...అది ప్రధానంగా బ్రాహ్మణుల చేతిలో వుండేదని... ముఖ్యంగా ఈ దేశంలో కుల వ్యవస్థను సుస్థాపితం చేసేందుకే ఈ విద్యను వాడుకున్నారని కట్టుకథలు అల్లారు. ఇతర కులాల వారిని విద్యకు , విజ్ఞానికి దూరం పెట్టారని అభియోగాలు మోపారు. అంతేకాదు తెల్లవాళ్లు ఈ దేశంలో అడుగు పెట్టి యావద్భారతాన్నీ ఏకచ్ఛత్రం కిందకి తెచ్చి ఇంగ్లీషు బడులు తెరిచారని ఇది మన అదృష్టమని మార్క్స్ , మెకాలే మానసపుత్రులు చెబుతుంటారు.
మనకు ఇంగ్లీషు నేర్పించి మన జాతిని ఉద్ధరించారని అంటారు. ఇంకా కొంతమంది అయితే మన దేశంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు బ్రిటీష్ వారు ఎన్ని పాపిష్టి పనులు చేసినా... స్వరాజ్యం కావాలన్నా వారిపై దమన నీతికి పాల్పడ్డా కూడా ఆంగ్లేయుల పాలనతో దేశానికి కొంత మేలు జరిగిందని అంటారు. తమ పరిపాలన నడపటానికి కావలసిన గుమాస్తాలను తయారు చేసుకోవాలన్న స్వార్థంతోనే మన జనసామాన్యానికి ఆధునిక విద్యబుద్ధులు నేర్పించారని... ఆంగ్ల భాషతో, ఆంగ్ల సారస్వతంతో పరిచయం ఏర్పడిందని..., అభ్యుదయ భావాలను అలవరచుకున్నాక విద్య ఎలా ఉండాలో, దాని పరమార్థమేమిటో మనకు తెలిసిందని...విద్య అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చిందని ఈ మేధావి గణం లెక్చర్లు దంచేస్తారు. ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ కాలేజీ వరకు ఈ అసత్యాలనే మనకు బోధిస్తున్నారు.
ఇంచు మించుగా సగటు విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం మన భారతీయ విద్యావిధానం గురించి ఇవాళ ఇలాగే ఆలోచిస్తున్నారు. అయితే భావన తప్పు అని...మన ప్రాచీన విద్యా విధానాన్ని చూసే ఇంగ్లీషు వాళ్లు తమ దేశంలో విద్యావిధానాన్ని రూపొందించుకున్నారన్న పచ్చి నిజాన్ని చెబితే మాత్రం మన నేతలు, మెధావి వర్గాలు మాత్రం నమ్మరు.
క్రీ.శ.1822వ సంవత్సరం, అప్పటికి ఇంకా 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం... అదే మన వామపక్ష మేధావులు పేర్కొనే సిపాయిల తిరుగుబాటు ఇంకా జరగలేదు. పెత్తనం అంతా ఇంకా ఈస్టింయా కంపెనీ చేతుల్లోనే ఉంది. నైజాం మినహా ఆంధ్ర ప్రాంతం అంతా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. దీనికి సర్వాధికారి గవర్నర్ , ఈ పదవిలో సర్ థామస్ మన్రో ఉన్నారు. మనది పాములు పట్టి ఆడించే దేశమని...ఈ దేశ ప్రజలు అజ్ఞానులని అప్పటికే ఈస్టిండియా కంపెనీ ఇంగ్లండులో ప్రచారం చేసింది. తమ ప్రచారానికి అనుగుణంగా మన విద్యా విధానంపై సమగ్ర సర్వే చేయాలని ఈస్టిండియా కంపెనీ అధికారులకు ఆయన జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలతో రంగంలోకి దిగిన బ్రిటీష్ అధికారులు ఉత్తరాన గంజాం నుంచి దక్షిణాన తిన్నెవెల్లి వరకు..అటు పశ్చిమాన మలబారు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ అంతటా పాఠశాలల, ఉన్నత విద్యా సంస్థల వివరాలను సేకరించారు. ఈ వివరాల నివేదికలను చూసిన తర్వాత బ్రిటిష్ అధికారుల మతి పోయింది. ఇంతకాలం అనాగరికులు, మూర్ఖులు, విద్యాగంధం లేని అజ్ఞానులని పాశ్చాత్య మేధావులు ప్రచారం చేస్తున్న భారతీయులు విద్యాలో ఇంగ్లీషు వారి కంటే ఎంతో ముందున్నారని రుడీ అయ్యింది.
అసలు నిజం ఏమిటంటే నవనాగరికమని...బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అందరూ అనుకుంటున్నట్లుగా, ఇంగ్లండులో ఆనాడు విద్య అందరికీ దొరికే వస్తువు కాదు. కులీనులు, సంపన్నులు, అయిన పెద్ద మననుషుల పిల్లలకు మాత్రమే విద్యను బోధించేవారు. రైతు కొడుకు పొలం పనిచేయాలి. చేతి పని కుమారుడు తండ్రి వృత్తినే కొనసాగించాలి. పెద్ద మనుషుల పిల్లలు విద్య నేర్చి పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందాలి. ఎవరికి పడితే వారు స్కూళ్లకు పోవడం కుదరని ఇంగ్లీషు రాజులు 16వ శతాబ్దంలో ఏ శాసనమే చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లండ్ పరిస్థితిలో మార్పు వచ్చింది. కనీసం బైబిల్ చదవగలిగే మేరకైనా అన్ని వర్గాలవారి చదువు నేర్పించాలని చారిటీ స్కూళ్ల ఉద్యమం కొన్నాళ్లు నడిచింది. క్రైస్తవ మిషనరీల చొరవతో ప్రతి బిడ్డా బైబిలును చదవగలగాలన్న ధ్యేయంతో పాప్యులర్ ఎడ్యుకేషన్ పేర సన్ డే స్కూల్ ఉద్యమం 1780 ప్రాంతాల్లో మొదలైంది. ఆ తర్వాత కాలక్రమంలో ఒక్క ఆదివారమే గాక మిగతా రోజుల్లోనూ చదువు చెప్పే పద్ధతి ప్రారంభమైంది. ఇక మన్రో మన దేశంలో సర్వే చేయించే నాటికి....1834లో ఇంగ్లండులో ఉన్న స్కూళ్ల సంఖ్య భారత్ కంటే చాలా తక్కువ. వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అది కూడా ఆయా పాఠశాలలో క్రైస్తవ మత బోధన...కొంచెం కొంచెంగా గణితం బోధించేవారు. ఇంకా కొన్ని స్కూళ్లలో అయితే చదవడమే తప్ప రాయడం నేర్పేవారు కాదు. రాయడం నేర్పితే ఇంగ్లీష్ పిల్లలు చెడిపోతారని భయపడేవాట. ఇది ఇంగ్లండు విద్యా వ్యవస్థకు సంబంధించిన నిప్పులాంటి నిజం...!
మెకాలే విద్యా విధానం కంటే ముందే మన దేశంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు ఉండేవా...? కులాలు , మతాల ప్రసక్తే లేకుండా అన్ని వర్గాల విద్యార్థులు చదువుకునే వారా ? కావాలనే ఓ పద్ధతి ప్రకారం బ్రిటిష్ వారు ఇతర వర్గాల వారిని హిందూ సమాజం నుంచి దూరం చేసే కుట్రలు చేశారా ?
క్రీ.శ.1822-26 మధ్యకాలంలో బ్రిటిష్ వారు మన దేశంలో చేసిన సర్వేలు...వాటికి సంబంధించిన రికార్డుల ప్రకారం...మన దేశంలో ప్రతి గ్రామంలో పాఠశాల ఉన్నది. ఆయా పాఠశాల్లో విద్యను నేర్చుకునేది కేవలం బ్రాహ్మణ విద్యార్థులే కాదు...మిగిలిన అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నారు. అంతేకాదు సంస్కృతంతో పాటు ప్రాంతీయ భాషల్లోను విద్యా బోధన జరిగేది. 19వ శతాబ్దంలో మన దేశంలోని దేశీయ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థుల కులాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. నేడు ప్రచారంలో ఉన్న చదువులపై అగ్రకులాల గుత్తాధిపత్యం మొదలైన అనేక సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఆధారాలు 1822లో బ్రిటీష్ వారు జరిపిన సర్వే రికార్డుల్లో కనిపిస్తాయి.
మన దేశీయ విద్యావిధానంలో నిమ్నకులాలకు విద్య పూర్తిగా అందుబాటులో ఉండేది. అగ్రకులాల విద్యార్థుల కంటే నిమ్న కులాల విద్యార్థులే ఎక్కువ. ఉపాధ్యాయులు కూడా అన్ని కులాలకు చెందినవారు ఉండేవారు. పైగా మన విద్యా విధానం బ్రిటీష్ విద్యా విధానం మాదిరిగా ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ఆనాడు మన దేశంలోని విద్యాలయాల ఖర్చును, విద్యార్థుల పోషణను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలే స్వచ్చందంగా భరించేవారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment